Andhra Pradesh News: ఎన్నికల సంగ్రామం వేడెక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసే అభ్యర్థుల జాబితా పూర్తి కాగా కొన్నిచోట్ల మినహా అన్ని ప్రాంతాల్లో ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో కండువాలు మార్చే వారి సంఖ్య పెరుగుతోంది. ఇక్కడో అడుగు... అక్కడో అడుగు వేస్తూ సమయం కోసం వేచి చూస్తున్నారు. ఇంకొందరు ఏకంగా కండువాలు మార్చేసి టికెట్లు పొందారు. 


ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 శాసనసభ నియోజకవర్గాలు, 3 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి అనేక మంది రాజకీయ నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులుగా చెలామణి అవుతున్నారు. కండువాలు మారుతున్నాయి. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీ, జనసేన, కాంగ్రెస్ లోకి అక్కడి నుంచి వైసీపీలోకి... ఇలా అక్కడి వారు ఇక్కడికి... ఇక్కడి వారు అక్కడికి మారుతున్నారు. ఇందులో ఓటు బ్యాంకు మినహా మరే ఉపయోగం లేని నాయకులు కొందరైతే ఓటు బ్యాంకు అధికంగా ఉన్న వారు మరికొందరు. కొందరు పంచాయితీ స్థాయిలో ప్రభావం చూపగలిగితే... ఇంకొందరు నియోజకవర్గ స్థాయిలో పేరు ఉన్న నాయకులు. 


సీనియర్, జూనియర్ల వివాదం
ప్రతి పార్టీలో కొత్తగా సీనియర్... జూనియర్ల వివాదం నెలకొంది. పార్టీ అభివృద్ధి కోసం పని చేసిన వారు కొత్తగా వచ్చిన వారిని ఆహ్వానిస్తున్నారు. కాని సీనియర్లతో సమానంగా కూర్చోబెట్టడం, వారి కంటే జూనియర్లకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని తట్టుకోలేకపోతున్నారు. దీనిపై ఆయా పార్టీల అభ్యర్థులు పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో సీనియర్ నాయకులు వారి వార్డు, పంచాయితీకి తప్ప పార్టీ కార్యక్రమాలకు పెద్దగా హాజరుకావడం లేదు. ఇది నచ్చని వారు పార్టీ మారిపోతున్నారు. 


ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా పార్టీలు మారినా వారే
వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను చాలా వరకు అభ్యర్థులుగా ప్రకటించింది. కొన్ని చోట్ల వేరే పార్టీలోని వారికి సీట్లు కేటాయించింది. దీంతో అంత వరకు పని చేసిన వారు బయటకు వెళ్లిపోయి వేరే పార్టీల్లో టికెట్లు దక్కించుకున్నారు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన వారిలో తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, తిరుపతి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరపున వరప్రసాద్, కాంగ్రెస్ పూతలపట్టు నుంచి ఎంఎస్ బాబు, మదనపల్లి షాజహాన్ బాషా, రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. వీరికి ఆయా పార్టీలలో ఉన్న నేతలు ఎంత వరకు సహకరిస్తారు అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది.