గెలుపే అన్ని డిసైడ్‌ చేస్తుంది. ఇప్పుడు మునుగోడు ఉపఎన్నిక రిజల్టే రాజకీయనేతల భవితవ్యాన్ని తేల్చనుందా? . ముఖ్యంగా వలస నేతలకు ఈ ఉపఎన్నిక ఫలితం కీలకం కానుంది. మునుగోడు ఉపఎన్నికలో గెలవాలన్నది మూడు ప్రధాన పార్టీల లక్ష్యం. ఆ దిశగానే హోరాహోరీగా ప్రచారాలు, విమర్శలు-ఆరోపణలు చేసుకున్నారు. ఇక పోలింగ్‌కి సమయం దగ్గర పడే కొద్దీ పార్టీలకే కాదు ఆయా నేతలకు కూడా టెన్షన్‌ మొదలైంది. ఓటర్లు ఎవరిని గెలిపిస్తారు.. ఏ పార్టీకి ఈ గెలుపు భవిష్యత్‌ని చూపించనుందన్నది చర్చనీయాంశంగా మారింది.


ముందుగా అధికార పార్టీ గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు తెలంగాణకే పరిమితమైన టీఆర్‌ఎస్‌ ఈ ఉపఎన్నిక సమయంలో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. బీఆర్‌ఎస్‌ పార్టీగా దేశంలో చక్రం తిప్పాలని భావిస్తోంది. అందుకు ఈ మునుగోడు ఉపఎన్నిక గెలుపు కీలకం కానుంది. అంతేకాదు బీజేపీ ఆకర్ష్‌ నుంచి పార్టీ నేతలను కాపాడుకోవడానికి కూడా ఈ ఉపఎన్నిక విజయం తప్పనిసరిగా మారింది. 


ఇప్పటికే కారు దిగడానికి కొంతమంది నేతలు సిద్ధంగా ఉన్నారు. అలాంటి వారి లిస్ట్‌ గులాబీ అధినేత కెసిఆర్‌ దగ్గర సిద్ధంగా ఉంది. వీరిని బుజ్జగించే కన్నా ఈ గెలుపుతో ఇటు పార్టీలోని వలస నేతలకు అటు బీజేపీకి రెండింటికి ఒకేసారి చెక్‌ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు కెసిఆర్‌ అండ్‌ కో. అయితే కారు దిగేందుకు ఎవరెవరు సిద్ధంగా ఉన్నారన్న దానిపైనా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. 


ఇప్పటికే దక్షిణ తెలంగాణ, రంగారెడ్డిల్లో బీజేపీ బలంగా నాటుకుపోతోంది. డికె అరుణ వంటి సీనియర్లు యాక్టివ్‌గా ఉండటంతో ఆ పార్టీ టీఆర్‌ఎస్‌ని ఢీ కొట్టే రేంజ్‌లో ఎదుగుతోంది. ఆంధ్రా సరిహద్దు జిల్లాలపై కూడా ఫోకస్‌ పెట్టింది బీజేపీ. ఇప్పుడు మునుగోడులో బీజేపీ గెలిస్తే నల్గొండ జిల్లా నుంచి కూడా భారీ సంఖ్యలో టిఆర్‌ఎస్‌ నుంచి వలస నేతలుంటారన్న వార్తలు హడావుడి చేస్తున్నాయి. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్‌ని కాషాయం లాగేసింది. ఇక ఈ గెలుపుతో ఖమ్మం జిల్లా నుంచి కూడా టీఆర్‌ఎస్‌కి చెందిన బడా నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉందన్న టాక్‌ గత కొంతకాలంగా వినిపిస్తోంది. 


ఇంటిపోరుతో విసిగిన నేతలు కమలం గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరిలో ప్రముఖంగా తుమ్ముల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నట్లు టాక్. టీఆర్ఎస్ నేతలు కూడా దీనికి అవుననే సమాధానం ఇస్తున్నారు. బీజేపీకి ఇక మిగిలింది ఖమ్మం జిల్లానే అక్కడ కూడా గట్టి లీడర్లను డంప్ చేసుకుంటే దక్షిణ తెలంగాణలో పూర్తి స్థాయిలో పట్టు సాధించినట్లు ఉంటుందని అనుకుటున్నారు కమలనాథులు. ఖమ్మంజిల్లాపై పట్టు కోసం చేస్తున్న ప్రయత్నాలు మునుగోడుకు లింక్ ఉంది. 


మునుగోడు ఫలితంపైనే వారి భవితవ్యం 


దక్షిణ తెలంగాణలో హైదరాబాద్‌కు ఆనుకొని ఉన్న రంగారెడ్డి జిల్లా నుంచి కూడా భారీగా వలసలు ఉంటాయని ఆశిస్తోంది బీజేపీ. రంగరెడ్డి జిల్లా నేతలు కూడా మునుగోడు తర్వాత ఆలోచిద్దాం అనే ధోరణితో ఉన్నారట. ఇప్పటికే రంగారెడ్డిజిల్లాలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి రాకతో బీజేపీ కొంత ఊరట లభించింది. మహబూబాబాద్‌ నుంచి కూడా కొందరు టీఆర్‌ఎస్‌ నేతలు కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి వారిలో మాజీ ఎంపీ ప్రొఫెసర్‌ సీతారామ్‌ నాయక్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గతకొంతకాలంగా ఈయన పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. వీళ్లేకాదు టీఆర్‌ఎస్‌ మంత్రుల్లోని కొందరు బంధువర్గం కూడా కాషాయ కండువా కప్పుబోతోందన్న వార్తలు హడావుడి చేస్తున్నాయి. అందులో ఓ మంత్రి అల్లుడి పేరు కూడా ఉందని తెలుస్తోంది. .


ఈ వలసలంతా బీజేపీ మునుగోడు ఉపఎన్నికలో గెలిస్తే తప్పకుండా ఉంటాయన్నది వాస్తం. వలసలే కాదు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ అధికారాన్ని అందిపుచ్చేకునే ఛాన్స్‌ కూడా ఉంటుందన్నది ఆపార్టీ నేతల అభిప్రాయం. ఇదే విషయాన్ని పదేపదే బీజేపీ కూడా చెప్పుకుంటూ వస్తోంది. త్వరలోనే గులాబీ నేతలు కమలం గూటికి చేరుతారని ఆపార్టీ నేతలు ధీమాగా చెప్పడానికి ఇదే కారణమంటున్నారు.


ఈ రెండు పార్టీల కన్నా కాంగ్రెస్‌కే ఈ గెలుపు అనివార్యంగా మారింది. సిట్టింగ్‌ స్థానాన్ని ఎలాగైనా సరే మళ్లీ గెలుచుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఈ గెలుపుతో ఇప్పటివరకు తెలంగాణ కాంగ్రెస్‌లో ఉన్న ఇంటిపోరు కూడా సద్దుమణిగే ఛాన్స్‌ ఉంది. రేవంత్‌ రెడ్డికి కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీపై పట్టుసాధించడానికే కాదు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సరే ఈసారి గెలుపు సంఖ్యని పెంచుకునే వీలు ఉంటుందని ఆపార్టీ భావిస్తోంది. అంతేకాదు వలసలు కూడా ఆగుతాయని ఆపార్టీ నేతలు ఆశిస్తున్నారు. గెలుపు కాకపోయిన కనీసం రెండో ప్లేసో, లేక భారీ ఓటు బ్యాంకు సాధిస్తే హాస్తాన్ని వదిలి వెళ్లే వారి సంఖ్య తగ్గుతుందని భావిస్తున్నారు. 


మునుగోడు ఫలితం తర్వాతే భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనీయర్ కొమటిరెడ్డి వెంకటరెడ్డి భవిష్యత్ ప్రణాళిక కూడా తెలిపోనుంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? ఎలా ముందుకు వెళ్లాలి? ఎలాంటి వ్యూహాలు అనుసరించాలన్నది మునుగోడు ఉపఎన్నికల ఫలితాల తర్వాతే డిసైడ్ కానుంది. మరోవైపు బిఎస్పీకి కూడా ఈ ఎన్నికలు చాలా కీలకం కానున్నాయి. ఇక్కడ భారీగా ఓటు బ్యాంకు సాధిస్తే రాబోయో సాధరణ ఎన్నికలకు ఉపయోగపడుతుంది. మిగిలిన పార్టీల నుంచి నేతలు కూడా ఇటు వైపు వచ్చే అవకాశాలు లేకపోలేదని బిఎస్సీ భావిస్తోంది. 


మునుగోడు అనుభవాలు కొన్ని పార్టీలకు గుణపాఠాలు కానుండగా మరికొన్నింటికి మాత్రం ఒక మంచి ప్రయోగంలాగా ఉపయోగపడనున్నాయి. ఇక్కడ అవలంభించిన స్ట్రాటజీనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేసే అవకాశం లేకపోలేదు. ఇలా మునుగోడు ఉపఎన్నిక పార్టీల భవిష్యత్‌ మాత్రమే కాదు రాజకీయనేతల తలరాతని కూడా డిసైడ్‌ చేసేదిగా మారడంతో ఇది చరిత్రలో నిలిచిపోయేదిగా ఉండబోతోంది.