సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్.. మెయిన్‌పురి కర్హాల్ నియోజకవర్గంలో ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. అఖిలేశ్ యాదవ్‌తో పాటు మరికొంతమంది ఎస్పీ అభ్యర్థులు కూడా ఈరోజు తమ నియోజకవర్గాల్లో నామపత్రాలు సమర్పించారు.






ముందుగా తన సొంతూరైన సైఫైయికి చేరుకున్న అఖిలేశ్ యాదవ్.. అక్కడి నుంచి కలక్టరేట్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలు సమర్పించారు.


అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్నారు అఖిలేశ్ యాదవ్. ప్రస్తుతం ఆయన ఆజంగఢ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. కర్హాల్ నియోజకవర్గం సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోట. 1993 నుంచి ఏడుసార్లు ఇక్కడ సమాజ్‌వాదీ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. కేవలం 2002లో భాజపా ఇక్కడ విజయం సాధించింది. ప్రస్తుతం కర్హాల్ నియోజకవర్గానికి సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సోబరాన్ సింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.







ఈసారి కర్హాల్ నియోజకవర్గం నుంచి అఖిలేశ్ యాదవ్‌పై పోటీ చేసే తమ అభ్యర్థిని భాజపా ఇంకా ప్రకటించలేదు. మెయిన్​పురి పార్లమెంట్​ నియోజకవర్గానికి సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్​ యాదవ్​ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 


7 విడతల్లో..


403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 10 నుంచి ఎన్నికలు మొదలుకానున్నాయి. మార్చి 10న ఫలితాలు వెల్లడిస్తారు.


ముందు ఊఊ..


కొద్దిరోజుల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని అఖిలేశ్ ప్రకటించారు. కానీ పార్టీ సభ్యులతో పలు దఫాలు చర్చించి బరిలోకి దిగడానికే నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఆజంగఢ్ నుంచి పార్లమెంటు సభ్యుడిగా అఖిలేశ్ యాదవ్ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం అఖిలేశ్ యాదవ్‌కు ఇదే తొలిసారి. 


2000లో తొలిసారి కన్నౌజ్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు అఖిలేశ్ యాదవ్. ఆ తర్వాత 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో కూడా అదే స్థానం నుంచి విజయం సాధించారు. 2012లో అఖిలేశ్ యాదవ్.. ఉత్తర్‌ప్రదేశ్ సీఎం అయ్యారు.