నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ రోడ్డులో ప్రజాదీవెన సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది టీఆర్‌ఎస్. తెలంగాణ రాజకీయాలకు, రాబోయే ఎన్నికలకు ఇదో కొలమానంగా పార్టీలు భావిస్తున్నాయి. అందుకే ఈ సభను టీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 


అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో ఏడాది మాత్రమే ఉంది. ఈ పరిస్థితుల్లో వచ్చిన మునుగోడు ఎన్నికలు పార్టీల స్థితిగతులను తేల్చేయనున్నాయి. ఎవరెవరి మధ్య పోటీ ఉంటుంది.. ఎవరికి ప్రజల మద్దతు ఉంటుందనే విషయంలో స్పష్టం రానుందని భావిస్తున్నాయి పార్టీలు. పార్టీల్లోనే కాకుండా ప్రజల్లో కూడా ఈ ఎన్నికపై చాలా ఆసక్తి నెలకొంది. 


మునుగోడు ఉపఎన్నికకు షెడ్యూల్ రాకపోయినా పార్టీలు ప్రచారం మొదలు పెట్టేశాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా ప్రజలను కలుస్తున్నాయి. ఆయా పార్టీల అగ్రనేతలు మునుగోడులో సభలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 


సమరశంఖం పూరిస్తున్న గులాబీ


మునుగోడులో టీఆర్‌ఎస్ ఓ అడుగు ముందే నిలిచింది. ప్రజాదీవెన పేరుతో భారీ బహిరంగ సభను ఇవాళ నిర్వహిస్తోంది. ఈ సభతో తమ సత్తా చాటాలను గులాబీ దళం గట్టిగానే భావిస్తోంది. అందుకే అమిత్‌షా నిర్వహించే సభ కంటే ముందుగానే మీటింగ్ పెట్టింది. 


హైదరాబాద్‌ నుంచి రెండు వేల కార్లు, ఇతర వాహనాలతో మనుగోడు బహిరంగ సభ వరకు భారీ ర్యాలీ తీస్తున్నట్టు టీఆర్‌ఎస్‌ లీడర్లు చెబుతున్నారు. అదే స్థాయిలో భారీగా జనసమీకరణ కూడా చేపట్టిందా పార్టీ. 






రోడ్డు మార్గంలో హైదరాబాద్‌ నుంచి మునుగోడు చేరుకుంటారు సీఎం కేసీఆర్. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్‌లో బయల్దేరి మధ్యాహ్నం 2 గంటలకు మునుగోడు వస్తారు. ఆయన కాన్వాయ్‌ను వేల మంది పార్టీ శ్రేణులు అనుసరించనున్నారు. 
మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం సమీపంలో జరగనుంది టీఆర్‌ఎస్‌ మనుగోడు ప్రజాదీవెన సభ. చలో మునుగోడు పేరుతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి నేతలు బయల్దేరనున్నారు. ఈ సభ వేదికగానే కాంగ్రెస్, బీజేపీకి చెందిన నేతలు టీఆర్‌ఎస్‌లో చేరేలా ప్లాన్ చేశారు గులాబీ నేతలు. 


తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని ప్రజలకు ఈ సభవేదికగా సీఎం కేసీఆర్ వివరించనున్నారు. తెలంగాణపై కేంద్రం చూపిస్తున్న వివక్షను... ఇతర పార్టీ నేతల తీరుపై కేసీఆర్ ప్రసంగించనున్నారు. 






ఇదే వేదికపై టీఆర్‌ఎస్‌ తరఫున మునుగోడులో ఎవరు పోటీ చేయనున్నారో కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది.