Telangana Elections 2023 :  గత 60 రోజులుగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పార్టీ తరఫున అన్నీ తానై ముందుకు నడిపించారు. ఒకవైపు ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు కేసీఆర్ తర్వాత అత్యధిక సభలు, రోడ్ షోలు, ర్యాలీలో పాల్గొన్న కేటీఆర్ మరోవైపు పార్టీ ప్రచార ప్రణాళికల నుంచి మొదలుకొని క్షేత్రస్థాయి సమన్వయం వరకు విస్తృతంగా పని చేశారు.  ఎన్నికల షెడ్యూల‌్‌కి ముందే మంత్రి హోదాలో దాదాపు 30 నియోజకవర్గాలు విస్తృతంగా పర్యటించి గత పది సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించిన మంత్రి కేటీఆర్, ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అటువైపు ప్రభుత్వ పనితీరు, పదేళ్ల అభివృద్ధి ప్రస్థానాన్ని సమర్థంగా వివరిస్తూనే ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బిజెపిల పైన తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.  


రెండు నెలలుగా అవిశ్రాంత ప్రచార కార్యక్రమాలు 


గత 60 రోజుల నుంచి మరింత విస్తృతంగా పర్యటించి రాష్ట్రం నలుమూలలా జరిగిన భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. తన పదునైన ప్రసంగాలతో ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నారు. మరీ ముఖ్యంగా మహిళలు, యువత, విద్యావంతులను ఆలోచింపజేసేలా సాగిన కేటిఆర్ ప్రసంగాలు సోషల్ మీడియాలోనూ పెద్దఎత్తున వైరల్ అయ్యాయి. అలాగే అత్యంత కీలకమైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతను తన భుజాలపై మోసి.. ప్రతి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఒక్కొక్క నియోజకవర్గంలో కనీసం రెండు రోడ్ షోలతో పాటు ఎల్బీనగర్ , శేర్లింగంపల్లి , మల్కాజ్ గిరి వంటి పెద్ద నియోజకవర్గాల్లో ఒకే రోజు నాలుగు నుంచి ఐదు రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రతి రోడ్ షోలో అడుగడుగునా ప్రజాభిమానం వెల్లువెత్తింది. అడుగడుగునా మంచి స్పందన కనిపించింది. 


టీవీ ఇంటర్యూలు - వివిధ వర్గాలతో ఇంట్రాక్షన్లు 


ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లాల్లో వివిధ నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించి ఆ తర్వాత సాయంత్రం నుంచి రాత్రి 10 గంటల వరకు హైదరాబాదులో తన ప్రచార కార్యక్రమాలను కొనసాగించారు. ఒకవైపు జయప్రకాష్ నారాయణ (జేపీ), గోరేటి వెంకన్న, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వారితో ప్రత్యేక ఇంటర్వ్యూలు కొనసాగించిన కేటీఆర్ ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువకులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి అభిప్రాయాలు తెలుసుకోవడంతోపాటు.. ప్రభుత్వ నియామక ప్రక్రియను శరవేగంగా పూర్తిచేసేందుకు చేపట్టిన పటిష్టమైన చర్యల గురించి వివరించారు. అలాగే ఓలా ఊబర్, జొమాటో వంటి వాటి ద్వారా సేవలు అందిస్తున్న గిగ్ వర్క్ చేస్తున్న యువకుల దాకా అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ వారితో సంభాషిస్తూ వారికి భరోసానిస్తూ ముందుకు సాగారు. దీంతో పాటు హైదరాబాదులో ఫస్ట్ టైం ఓటర్లు, ఐటీ ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, దళిత గిరిజన పారిశ్రామికవేత్తలు వంటి వివిధ వర్గాల ప్రముఖులు, ఉద్యోగులు, ప్రజలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. సమాజంలో సగభాగమైన మహిళలతో ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం మరోసారి గెలిచిన తర్వాత మహిళల కోసం చేపట్టే అనేక కార్యక్రమాలపైన తన ఆలోచనలను పంచుకున్నారు. దీంతోపాటు అటు పలు కుల సంఘాల నాయకులు ప్రతినిధులతో మాట్లాడుతూనే మైనార్టీలతో ప్రత్యేకంగా సమావేశమై గత పది సంవత్సరాలలో ఆయా వర్గానికి జరిగిన లబ్ధిని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ భవిష్యత్తు ప్రణాళికలను ఆవిష్కరిస్తూ.. వారిలో కొండంత భరోసాను నింపారు.


మీడియా, సోషల్ మీడియాల్లో ప్రచారం కూడా కేటీఆర్ ప్రణాళిక ప్రకారమే ! 


కేవలం ప్రచార కార్యక్రమాలే కాకుండా పార్టీ చేపట్టాల్సిన పత్రిక ప్రకటనల నుంచి మొదలుకొని సామాజిక మాధ్యమాలలో రూపొందించాల్సిన కంటెంట్ వరకు విస్తృతంగా చర్చించి వారికి దిశా నిర్దేశం చేశారు. మొత్తం 60 రోజుల పార్టీ ప్రచారంలో అత్యంత హుందాగా పార్టీ ప్రచారాన్ని చేపట్టారు. ఓవైపు ప్రతిపక్ష పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేసినా, కేవలం పాజిటివ్ అంశాలే ఈ ఎన్నికల ఎజెండా కావాలన్న సానుకూల ఆలోచనతో.. పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయడంతో.. ఆ మేరకు మొత్తం క్షేత్రస్థాయి నుంచి కేంద్ర పార్టీ కార్యాలయం వరకు పూర్తి సమన్వయంతో ప్రచారపర్వంలో ప్రత్యర్థులకు అందనంత వేగంగా బీఆర్ఎస్ దూసుకెళ్లింది. దీంతోపాటు ప్రతిరోజు వేలాది మందితో టెలి కాన్ఫరెన్స్ ద్వారా కేటిఆర్ మాట్లాడారు. ఒకవైపు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు, పార్టీ నియమించిన ఇన్చార్జిలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన వార్ రూమ్ ప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు , కార్యకర్తలతో ఎప్పటికప్పుడు టెలి కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేశారు. వీరితోపాటు పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలతో, ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఒపీనియన్ మేకర్లు, ముఖ్యమైన వ్యక్తులతోనూ టెలికాన్ఫరెన్స్ ద్వారా సంభాషించి పార్టీ కోసం వారి మద్దతును కూడగట్టారు. 
 
సమర్థంగా  ప్రచార భారాన్ని  మోసిన కేటీఆర్ 


మొత్తంగా గత 60 రోజులపాటు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీకి  అన్నీ తానై, స్టార్ క్యాంపెయినర్ గా, వర్కింగ్ ప్రెసిడెంట్ గా అన్ని బాధ్యతలు తన భుజాలపైకి ఎత్తుకొని రోజుకి దాదాపు 15-18 గంటల వరకు పనిచేశారు కేటిఆర్. ముఖ్యంగా ప్రజల నుంచి లభించిన అపూర్వ స్పందనే తనను ముందుకు నడిపించిందని, ప్రజలకు మంచి చేస్తే, వారు అండగా ఉంటారన్న బలమైన నమ్మకంతో తన క్యాంపెయిన్ సాగిందని, భారత రాష్ట్ర సమితిని మరోసారి ప్రజలు గెలిపిస్తారన్న పూర్తి విశ్వాసం తనకుందని కేటీఆర్ అన్నారు. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో, 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో తమ వెంట నడిచిన తెలంగాణ సమాజం వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీని గుండెల నిండా ఆశీర్వదించాలని కేటిఆర్ విజ్ఞప్తిచేశారు.