వరంగల్ పశ్చిమ నియోజకవర్గం... నియోజకవర్గాల పునర్విభజన తర్వాత హన్మకొండ బదులు వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం ఏర్పడింది. హన్మకొండ, కాజీపేట ప్రాంతాలను కలుపుకొని ఉంది ఈ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో హన్మకొండ, కాజీపేట మండలాలు ఉన్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 2,66,825 కాగా, వీరిలో పురుషులు 1,32,761, మహిళలు 1,34,053 ఉన్నారు. వరంగల్ వెస్ట్‌ నియోజకవర్గంలో.. రెడ్డి ఓట్లే కీలకం. ఇక్కడే బీఆర్‌ఎస్‌కు పట్టు ఉంది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దాస్యం వినయ్ భాస్కర్ ఒక ఉప ఎన్నికతో సహా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఐదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.


టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఈ నియోజకవర్గంలో.. వరుసగా గులాబీ జెండానే ఎగురుతూ వస్తోంది. 2004లో మందాడి సత్యనారాయణ గెలిస్తే.. ఆ తర్వాత జరిగిన 4 ఎన్నికల్లోనూ.. సిట్టింగ్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 2023 ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌ నుంచి దాస్యం వినయ్‌ భాస్కర్‌ బరిలో ఉన్నారు. వరంగల్‌ వెస్ట్‌లో మూడు ప్రధాన పార్టీలు అయిన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉంది. కానీ హవా మాత్రం బీఆర్‌ఎస్‌దే. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీలో గ్రూపు రాజకీయాలు వినయ్‌ భాస్కర్‌కు కలిసివస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈసారి మాత్రం ఎన్నికలు పోటా పోటీగా ఉంటాయంటున్నారు.


2014 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్‌ వెస్ట్‌ నుంచి ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన దాస్యం వినయ్ భాస్కర్ గెలిచారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎర్రబెల్లి స్వర్ణపై ఆయన విజయం  సాధించారు. వినయ్ భాస్కర్‌కు 83,492 ఓట్లు రాగా... ఎర్రబెల్లి స్వర్ణకు 27,188 ఓట్లు వచ్చాయి. వినయ్‌ భాస్కర్‌కు 56,304 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇక.. 2018 ఎన్నికల్లో..  టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌ రెడ్డిపై 36,451 ఓట్ల ఆధిక్యంతో విజయం సాదించారు వినయ్‌ భాస్కర్‌. కూటమిలో భాగంగా ఇక్కడ టీడీపీ పక్షాన రేవూరి పోటీ చేసినా ఫలితం దక్కలేదు. దాస్యం వినయ్‌ భాస్కర్‌కు 80,189 ఓట్లు రాగా, రేవూరి ప్రకాష్‌ రెడ్డికి 43,299 ఓట్లు వచ్చాయి. గతంలో నర్సంపేట నుంచి మూడుసార్లు గెలిచిన  ప్రకాష్‌రెడ్డి.. 2018లో వరంగల్‌ వెస్ట్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీ తరఫున పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే ఎం‌.ధర్మారావుకు 6 వేల ఓట్లు వచ్చాయి. 


అభివృద్ధి కార్యక్రమాలే తనను మళ్లీ గెలిపిస్తాయనే ధీమాలో ఉన్నారు ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. అయితే.. విభజన హామీల్లో ప్రధానమైన కోచ్ ఫ్యాక్టరీ, చారిత్రక వేయి స్తంభాల ఆలయ మంటపం పునర్నిర్మాణం పూర్తి కాలేదు. దీనికి సబంధించి నిధుల విషయంలో విమర్శలున్నా.. అందుకు కేంద్రమే కారణమని చెప్తున్నారు. ఇక, ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీకి ఉన్న వ్యతిరేకత మీదే ఆశలు పెట్టుకున్నాయి. రెడ్డి సామాజిక వర్గంతో గెలవొచ్చన్నది కాంగ్రెస్‌ ఆలోచన. బీజేపీకి కూడా ఈసారి ఎలాగైనా గెలుస్తామన్న ధీమా ఉంది. మరి వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అధికారం నిలబెట్టుకుంటుందా? లేక గులాబీ కోటను ప్రతిపక్షాలు బద్ధలుకొడతా? వేచి చూడాల్సిందే.