YS Sharmila: ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపులు చోటుచేసుకుంటుున్నాయి. ఎన్నికల నామినేషన్లు ఈ రోజు నుంచి ప్రారంభం కాగా.. పార్టీలన్నీ ఇప్పటికే ప్రచారంలో వేగం పెంచాయి. అలాగే అభ్యర్థులను కూడా దాదాపు పార్టీలన్నీ ప్రకటించాయి. ఎన్నికల పోలింగ్‌కు కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండటంతో పొత్తులపై కూడా క్లారిటీ వస్తుంది. కాంగ్రెస్‌తో సీపీఎం, సీపీఐ పొత్తు ఖరారు అవుతుందని అందరూ భావించగా.. సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకపోవడంతో కుదరలేదు. ఈ సమయంలో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.


తొలుత కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనం చేయాలని షర్మిల భావించగా.. హస్తం పార్టీతో అవగాహన కుదరకపోవడంతో వెనక్కి తగ్గారు. కానీ ఇవాళ అనూహ్యంగా షర్మిల ఊహించని ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన షర్మిల.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌టీపీ పోటీ చేయడం లేదని, కాంగ్రెస్‌కు సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్‌టీపీ శ్రేణులు, వైఎస్సార్ అభిమానులందరూ కాంగ్రెస్‌కు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఓటు బ్యాంక్ చీలకూడదనే కారణంతో కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. మీడియా ముందు ప్రకటించడమే కాకుండా.. కాంగ్రెస్‌కు మద్దతివ్వడంపై రాహుల్ గాంధీకి షర్మిల లేఖ కూడా రాశారు.


ఈ క్రమంలో షర్మిల చేసిన ప్రకటనపై తెలంగాణ కాంగ్రెస్ స్పందించింది. థ్యాంక్యూ షర్మిల గారు అంటూ తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ పెట్టింది. ఈ సందర్భంగా షర్మిలకు ధన్యవాదాలు తెలిపింది. కాంగ్రెస్‌కు మద్దతివ్వడంతో రాహుల్ గాంధీకి రాసిన లేఖను వైఎస్ షర్మిల తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. దీనిని షేర్ చేసి టీ కాంగ్రెస్.. థ్యాంక్యూ షర్మిల గారు అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.


అయితే కేసీఆర్ నీచ పాలనను అంతమొందించేందుకే కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నట్లు షర్మిల మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని, కేసీఆర్‌ను అధికారం నుంచి దించడానికి ఎలాంటి కఠిన నిర్ణయానికైనా సిద్దమని స్పష్టం చేశారు. తెలంగాణ భవిష్యత్ కోసం ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా త్యాగం చేస్తున్నట్లు షర్మిల తెలిపారు. కేసీఆర్ ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, కాంగ్రెస్ గెలుపు అవకాశాలను అడ్డుకోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ విషయాన్ని వైఎస్సార్‌టీపీ శ్రేణులందరూ అర్దం చేసుకోవాలని సూచించారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని వైఎస్సార్ అనుకున్నారని షర్మిల గుర్తు చేశారు. ఢిల్లీలో తాను సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కలిసినప్పుడు తనను కుటుంబసభ్యురాలిగా చూశారని పేర్కొన్నారు.


కాగా కాంగ్రెస్‌లో విలీనం కుదరకపోవడంతో షర్మిల ఒంటరిగా బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. 119 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతున్నామని, ఆశావాహులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విలీనానికి రేవంత్ రెడ్డి అడ్డుకట్ట వేశారని, అందుకే షర్మిల విలీనంపై వెనక్కి తగ్గారనే ప్రచారం నడిచింది. కానీ ఏమైందో ఏమో కానీ చివరికి మళ్లీ కాంగ్రెస్‌కే షర్మిల జై కొట్టడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.