CM Of Telangana State 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ తన సీఎం అభ్యర్థిని ఎంపిక చేయడంలో మాత్రం రెండు రోజుల నుంచి కసరత్తు చేస్తోంది. అయితే సీఎం ఎవరనే దానిపై క్లారిటీకి వచ్చిందని ఆయన జట్టులో ఎవరెవరు ఉండాలో అనే అంశంపై చర్చలు నడుస్తున్నట్టు సమాచారం. దీనిపై ఖర్గే నివాసంలో చర్చిస్తున్న రాహుల్ గాంధీ సమావేశాన్ని ముగించి వెళ్లినపోయారు. 


తెలంగాణ సీఎం అభ్యర్థి ఆయన జట్టుపై కసరత్తు చేస్తున్న ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, డీకే శివకుమార్‌ సమావేశం ముగిసింది. దాదాపు అరగంట పాటు దీనిపై చర్చించారు. పార్టీ విజయం సాధించినప్పటి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్లు చెప్పిన అభిప్రాయాలు, రాష్ట్రంలో నెలకొన్ని పరిణామాలపై కీలకమైన రిపోర్టును డీకే శివకుమార్ అధినాయకత్వం ముందు పెట్టారు. 


డీకే శివకుమార్ మీటింగ్‌కు ముందు మీడియాతో మాట్లాడతూ.. సీఎల్పీ లీడర్ ఎన్నిక, సీఎం ఎంపికపై ఎమ్మెల్యేలు చేసిన తీర్మానాన్ని అధిష్ఠానానికి అందిస్తా అన్నారు. వారి సూచనలతో సాయంత్రం లోపు నిర్ణయం వెలువడే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అధినాయకత్వమే ఫైనల్‌ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. 


సీఎల్పీ భేటీ తర్వాత కూడా పలువురు సీనియర్లతో డీకే శివకుమార్ చర్చించారు. రేవంత్ రెడ్డితో మాట్లాడారు. ఈ ఉదయం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్కతో కూడా విడివిడిగా మాట్లాడారు. వారి అభిప్రాయాలు తీసుకున్నారు. అన్నింటిని క్రోడీకరించి పార్టీ అగ్రనేతలతో డీకే శివకుమార్ చర్చించారు. 


ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిలో ఎక్కుమంది రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. అభ్యంతరం చెప్పిన వాళ్లు కూడా పదవుల అంశంపై పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. కొత్తగా కొలువు దీరే అసెంబ్లీలో 18 మందికి చోటు దక్క వచ్చని తెలుస్తోంది. వారిలో ఎంతమంది డిప్యూటీ సీఎంలుగా తీసుకుంటారనేది ఇప్పుడు చర్చ నడుస్తోంది. 


శాఖ కేటాయింపులు, డిప్యూటీలు ఎన్ని ఉండాలనే వాటిపై నేతలతో చర్చించిన డీకే శివకుమార్ అధినాయకత్వానికి నివేదిక సమర్పించారు. ఆ నివేదికపై పార్టీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చర్చించారు. సుమారు అరగంట పాటు మాట్లాడారు. మరో రెండు మూడు గంటల్లో కీలక నిర్ణయం వెలువడే ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. 


అధినాయకత్వం నిర్ణయాన్ని ఢిల్లీలో ప్రకటించకుండా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో సమావేశమై ప్రకటిస్తారు. ఈ బాధ్యతను డీకే శివకుమార్ తీసుకున్నారని చెబుతున్నారు. అందరి ఎమ్మెల్యే ఆమోదం తర్వాతే అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. అప్పటి వరకు ఎవరూ మీడియాతో మాట్లడటం అనవసరమైన విమర్శలు చేయవద్దని హైకమాండ్‌ నుంచి నాయకులకు చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి.