తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్‌ 55 మందితో కూడిన జాబితాను ప్రకటించింది. ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ వంటి నేతలకు తొలి జాబితాలో చోటు దక్కలేదు. మైనంపల్లి కుటుంబానికి రెండు టికెట్లు దక్కాయి. సిట్టింగ్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ హుజూర్‌ నగర్‌ నుంచి పోటీ చేస్తుండగా.. ఆయన సతీమణి పద్మావతి రెడ్డికి కోదాడ టికెట్‌ కేటాయించారు. కొడంగల్‌ నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పోటీ చేయనున్నారు.


ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏడు సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్‌ పార్టీ. జగిత్యాల నియోజకవర్గం నుంచి పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. బీఆర్ఎస్‌ తరపున సిట్టింగ్‌ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో సంజయ్ కుమార్ భారీ మెజార్టీతో గెలుపొందారు. జీవన్ రెడ్డి 1983 నుంచి ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేశాశారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ తరపున పలుసార్లు గెలుపొందారు. మంత్రిగానూ సేవలు అందించారు.  వేములవాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌, గులాబీ పార్టీ తరపున చల్మెడ లక్ష్మీనరసింహారావు పోటీ పడుతున్నారు. మానకొండూరు స్థానంలో కాంగ్రెస్‌ నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ, అధికార పార్టీ తరపున సిట్టింగ్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బరిలోకి దిగారు. రసమయి బాలకిషన్‌ ముచ్చటగా మూడోసారి మానకొండూరు నుంచి బరిలోకి దిగుతున్నారు. 


ధర్మపురిలో హస్తం పార్టీ నుంచి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, అధికార పార్టీ తరపున కొప్పుల ఈశ్వర్ తలపడనున్నారు. కొప్పుల సాంఘిక సంక్షేమ మంత్రిగా ఉన్నారు. 2009 నుంచి ఇప్పటి దాకా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ధర్మపురిని బీఆర్ఎస్ కు అడ్డాగా మార్చేశారు. ఐదోసారి బరిలోకి దిగారు కొప్పుల ఈశ్వర్. రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి శాప్‌ మాజీ ఛైర్మణ్‌ రాజ్‌ ఠాకూర్‌, గులాబీ పార్టీ తరపున సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బరిలోకి దిగుతున్నారు.  మంథని నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, బీఆర్ఎస్‌ నుంచి పుట్టా మధులు ముచ్చటగా మూడోసారి పోటీ పడుతున్నారు. శ్రీధర్ బాబు కిరణ్ కుమార్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. పెద్దపల్లి అసెంబ్లీ స్థానంలో హస్తం పార్టీ నుంచి చింతకుంట విజయ్‌ రమణారావు, బీఆర్‌ఎస్‌ తరపున సిట్టింగ్‌ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి మరోసారి తలపడుతున్నారు. 


ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో నిర్మల్ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరపున శ్రీహరి రావు, దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి బీఆర్ఎస్‌ తరపున పోటీ చేస్తున్నారు. ఇంద్రకరణ్ రెడ్డి సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు. ఎంపీగానూ పని చేసిన అనుభవం ఉంది. నిర్మల్ నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చుకున్నారు. రిజర్వ్‌డ్ స్థానం బెల్లంపల్లి నుంచి మాజీ మంత్రి గడ్డం వినోద్‌కు సీటు కేటాయించింది. 2004లో వినోదో కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు. బీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పోటీ చేస్తున్నారు. దుర్గం చిన్నయ్య ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అటు మంచిర్యాల నుంచి కాంగ్రెస్‌ తరపున ప్రేమ్‌సాగర్‌ రావు, బీఆర్ఎస్‌ నుంచి నడింపల్లి దివాకరరావు పోటీ పడుతున్నారు. 


ఉమ్మడి  నిజామాబాద్‌ జిల్లాలో మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. బోధన్ స్థానంలో కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి, బీఆర్ఎస్‌ తరపున షకీల్ బరిలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న సుదర్శన్ రెడ్డి, వైఎస్, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో నీటి పారుదల, సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా పని చేశారు. అలాగే బాల్కొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరపున సునీల్‌ కుమార్‌ రెడ్డి, బీఆర్ఎస్‌ నుంచి వేముల ప్రశాంత్‌రెడ్డి తలపడనున్నారు. సునీల్‌కుమార్‌కు ట్రావెల్స్‌ వ్యాపారం ఉంటే...వేముల ప్రశాంత్‌ రెడ్డి రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్నారు. ముచ్చటగా మూడోసారి వేముల ప్రశాంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆర్మూర్‌లో కాంగ్రెస్‌ నుంచి ప్రొద్దుటూరి వినయ్‌ కుమార్‌ రెడ్డి, బీఆర్ఎస్‌ తరపున జీవన్‌ రెడ్డి పోటీ పడుతున్నారు. జీవన్‌ రెడ్డి...ఇప్పటికే రెండుసార్లు విజయం సాధించారు. అటు వినయ్ కుమార్‌ రెడ్డి ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు.