Sanath Nagar Assembly Seat: అధికార బీఆర్ఎస్‌ సిట్టింగ్‌లకు మెజార్టీ స్థానాలను కేటాయించింది. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్లతో పాటు కొత్త వారిని బరిలోకి దించింది. ఉమ్మడి హైదరాబాద్‌ జిల్లాలోని సనత్‌నగర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి కోట నీలిమ, అధికార పార్టీ తరపున తలసాని శ్రీనివాస్‌ యాదవ్ తలపడుతున్నారు. తలసాని శ్రీనివాస్‌ యాదవ్ 1994, 99, 2008 ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి తెలుగుదేశం పార్టీ తరపున, 2018 ఎన్నికల్లో సనత్ నగర్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున ఎ.సంతోష్‌ కుమార్‌, బీఆర్ఎస్ తరపున పద్మారావు బరిలోకి దిగారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావు 2014, 2018  ఎన్నికల్లో గెలుపొందారు. హ్యాట్రిక్ విజయం సాధించాలని మరోసారి బరిలోకి దిగారు.


ఎమ్మెల్యేతో మాజీ ఎంపీ ఢీ 
ముషీరాబాద్‌  నుంచి అంజన్‌కుమార్‌ యాదవ్‌, బీఆర్ఎస్‌ నుంచి ముఠా గోపాల్ పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ముఠా గోపాల్ గెలుపొందారు. మలక్‌పేటలో కాంగ్రెస్‌ నుంచి షేక్‌ అక్బర్‌, బీఆర్‌ఎస్‌ తరపున తీగల అజిత్ రెడ్డి తలపడుతున్నారు. కార్వాన్‌లో  కాంగ్రెస్ నుంచి  ఉస్మాన్‌ బిన్‌ మహ్మద్‌ అల్‌హజ్రి, బీఆర్ఎస్‌ నుంచి క్రిష్ణయ్య పోటీ చేస్తున్నారు. చాంద్రయణగుట్టలో కాంగ్రెస్‌ నుంచి బోయ నగేశ్‌, బీఆర్ఎస్ తరపున సీతారాంరెడ్డి...యాకత్‌పుర కాంగ్రెస్ నుంచి కె. రవి రాజు, బీఆర్ఎస్‌ నుంచి సామ సుందర్ రెడ్డి బరిలోకి దిగారు. బహదూర్‌పుర కాంగ్రెస్ తరపున రాజేశ్‌ కుమార్‌ పులిపాటి, బీఆర్ఎస్‌ నుంచి అలి బక్రీ పోటీ చేస్తున్నారు.  


మైనంపల్లి వర్సెస్ మర్రి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏడు స్థానాలకు కాంగ్రెస్‌ సీట్లు ప్రకటించింది. మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, బీఆర్ఎస్‌ నుంచి మర్రి రాజశేఖర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. మైనంపల్లి హనుమంతరావు ఇప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రామాయంపేట నుంచి రెండు పర్యాయాలు, మెదక్‌ నుంచి ఒకసారి, మల్కాజ్‌గిరి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతకుముందు ఎమ్మెల్సీగాను పని చేసిన అనుభవం ఉంది. మర్రి రాజశేఖర్‌రెడ్డి గత ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మేడ్చల్‌ నియోజకవర్గంలో తోటకూర వజ్రేశ్‌ యాదవ్‌,  మంత్రి చామకూర మల్లారెడ్డిని ఢీ కొట్టబోతున్నారు. మల్లారెడ్డి రెండోసారి మేడ్చల్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఆయన 2014లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీగా గెలుపొందారు. రెండోసారి మేడ్చల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. 


కేపీ వివేకానంద హ్యాట్రిక్ కొడతారా ?
కుత్బుల్లాపూర్‌లో హస్తం పార్టీ నుంచి కొలన్‌ హన్మంత్‌ రెడ్డి, గులాబీ పార్టీ తరపున కేపీ వివేకానంద ఫైట్‌ చేయబోతున్నారు. కేపీ వివేకానంద ముచ్చటగా మూడోసారి కుత్బుల్లాపూర్‌ నుంచి పోటీ చేస్తున్నారు. 2014లో టీడీపీ నుంచి గెలుపొందగా, 2018లో బీఆర్ఎస్‌ తరపున విజయం సాధించారు. చెవేళ్లలో హస్తం పార్టీ నుంచి భీమ్ భరత్, బీఆర్ఎస్‌ నుంచి కాలే యాదయ్య బరిలోకి దిగారు. కాలే యాదయ్య ముచ్చటగా మూడోసారి బరిలోకి దిగారు. 2014, 2018లో  ఇదే స్థానం యాదయ్య గెలుపొందారు. పరిగిలో కాంగ్రెస్‌ నుంచి రామ్మోహన్‌ రెడ్డి, బీఆర్ఎస్‌ నుంచి కొప్పుల మహేశ్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. వికారాబాద్‌లో హస్తం పార్టీ నుంచి మాజీ మంత్రి ప్రసాద్‌ కుమార్‌, సిట్టింగ్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ బీఆర్ఎస్‌ నుంచి బరిలోకి దిగారు. ఉప్పల్‌లో కాంగ్రెస్ తరపున పరమేశ్వర్‌ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి బండారి లక్ష్మారెడ్డి పోటీ పడుతున్నారు.