Stock Market News Today: దేశీయ స్టాక్ మార్కెట్లకు ఈ రోజు బ్లాక్ డేగా చెప్పాలి. రూ. లక్షల కోట్ల మేర ముదుపర్ల సంపద గంటల వ్యవధిలో ఆవిరైపోయింది. ఎన్నికల ఫలితాలే దీనికి కారణం.


గంటల వ్యవధిలో ముదుపర్ల సంపద ఆవిరైపోయింది. నిన్నటి రోజు లక్షల కోట్లు లాభాలు ఆర్జించిన స్టాక్ మార్కెట్లు గంటల వ్యవధిలోనే లక్షల కోట్ల మేర నష్టం చవి చూశాయి. 


ఎన్నికల ఫలితాల సరళి స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా ఉంది. సోమవారం ఆల్ టైమ్ హైలో నమోదైన సెన్సెక్స్, నిఫ్టీ 50 షేర్లు మంగళవారం భారీగా పతనమయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ లో ఇండియా కూటమికి వస్తాయనుకున్న స్థానాల కంటే ఎక్కువ స్థానాల్లో ఆ కూటమి అభ్యర్థులు లీడింగ్ లో ఉండటమే ఇందుకు కారణం. పార్ల మెంటు ఎన్నికల్లో  దాదాపు 120 నుంచి 170 సీట్లకే ఇండియా కూటమి పరిమితమవుతుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్పగా.. ఫలితాల ప్రకటన సమయంలో 230 కి దగ్గరగా ఇండియా కూటమి గెలిచే అవకాశం ఉండటంతో మార్కెట్ భారీగా పతనమయ్యాయి. ఫలితాల సరళితో పాటే ఈ గణాంకాలూ నిమిషాల వ్యవధిలోనే భారీగా మారుతున్నాయి. 


మార్కట్ కుదేలవ్వడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇన్వెస్టర్లకు రూ. 1.6 లక్షల కోట్లు నష్టమొచ్చింది. బీ ఎస్ ఈ లో 9.6 శాతం మేర ఈ షేర్ హోల్డర్లు  నష్టపోయారు. 


ఇక అదానీ ఎంటర్ ప్రైజెస్, అదాని పోర్ట్స్ వంటి షేర్లు 15 నుంచి 20 శాతం మధ్య నష్టం చవిచూశాయి. 


సోమవారం 76468.78 పాయింట్ల వద్ద క్లోజ్ అయిన బీఎస్ఈ సెన్సెక్స్ మంగళవారం ఉదయం 10 గంటలకు 74,906 వద్ద ఓపెన్ అయింది. అంటే 1500 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తరువాత మరింత పతనమైంది. 70,285 పాయింట్ల కనిష్టానికి వెళ్లింది. అంటే దాదాపు 6,183 పాయింట్ల మేర అంటే 8 శాతానికి పైగా కుప్పకూలింది.  నిఫ్టీ సైతం 1982 పాయింట్ల మేర (8శాతం పైగా)  21,330 పాయింట్లు అంటే నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయింది. తిరిగి రెండూ మూడు శాతం మేర పుంజుకుని మధ్యానం రెండు గంటల వరకు దాదాపు అయిదు శాతం నష్టాలతో ముగిశాయి.