Lok Sabha Elections 2024: ఉత్తర తెలంగాణలో నిజామాబాద్ (Nizamabad) పార్లమెంట్ నియోజకవర్గం హాట్ సీట్ మారిపోయింది. ఇక్కడ బీజేపీ (BJP) తరపున సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) పోటీ చేస్తుంటే... బీఆర్ఎస్ (BRS)పార్టీ తరపున ఆ పార్టీ సీనియర్ నేత బాజిరెడ్డి గోవర్దన్ (Bajireddy Govardhan) బరిలోకి దిగుతున్నారు. ధర్మపురి అర్వింద్, బాజిరెడ్డి గోవర్దన్ కుటుంబాల మధ్య దశాబ్దాలుగా రాజకీయ వైరం ఉంది. దీంతో ఈ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో నిరూపించుకోవడానికి సమాయత్తం అయ్యారు. కాంగ్రెస్  పార్టీలో ఉంటూ రాజకీయ ఉద్దండుగులు ఓ వెలుగు వెలిగారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో డి.శ్రీనివాస్‌తో బాజిరెడ్డి గోవర్దన్ తలపడ్డారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డీఎస్ పై బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్...26 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. 


ఇద్దరు మున్నూరు కాపు నేతలు
ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో...డిఎస్ తనయుడు ఎంపీ అర్వింద్‌తో పోటీకి సై అంటున్నారు బాజిరెడ్డి గోవర్దన్. బాజిరెడ్డి రాజకీయాల్లో తలపండిన నేతగా గుర్తింపు పొందారు. తనకంటే జూనియర్‌గా ఉన్న అర్వింద్‌ బరిలోకి దిగడంతో...రాష్ట్ర రాజకీయ నేతలంతా నిజామాబాద్ వైపు చూసేలా చేస్తున్నాయి.  ఇద్దరూ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే. బీజేపీలో కీలక నేతగా ఉన్న అర్వింద్.. రాజకీయాల్లో బాజిరెడ్డితో పోలిస్తే జూనియరే.. ఈ ఎన్నికల్లో జూనియర్ కు అవకాశం ఇస్తారా.. సీనియర్ కు పట్టం కడతారా ? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇద్దరు మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో...ఆ సామాజిక వర్గం ఓట్లను చీల్చడానికే బాజిరెడ్డిని బీఆర్ఎస్‌ బరిలోకి దించిందన్న ప్రచారం జరుగుతోంది. 


దశాబ్దాలుగా రెండు కుటుంబాల మధ్య రాజకీయ వైరం
మాజీ పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ కుటుంబాల మధ్య ఏళ్లుగా  రాజకీయ వైరం ఉంది. ఇద్దరు కాంగ్రెస్‌లో పని చేసినప్పటికీ...ప్రత్యర్ధులుగా జిల్లాలో, రాష్ట్రంలో రాజకీయాలు నడిపారు. పీసీసీ అధ్యక్షుడి తనను తనను రాజకీయంగా అణగదొక్కేందుకు ధర్మపురి శ్రీనివాస్ కుట్రలు చేశారని బాజిరెడ్డి గోవర్దన్‌ పలువురి వద్ద చెప్పుకున్నారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో డీఎస్‌తో పొసగక.. పార్టీ మారి ఆయనపైనే పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో ఓడించి...డీఎస్ పై పైచేయి సాధించారు. 


తండ్రిని ఓడించినట్లే...కుమారుడ్ని ఓడిస్తారా ?
సీన్ కట్ చేస్తే ఇప్పుడు డీఎస్ చిన్న కుమారుడు బాజిరెడ్డి పోటీకి దిగారు. ధర్మపురి శ్రీనివాస్ ను ఓడించిన బాజిరెడ్డి గోవర్దన్...కుమారుడు ఎంపీ అర్వింద్ ను  ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో వ్యూహాలు రచిస్తున్నారు. అప్పట్లోనే డీఎస్‌ను లైట్ తీసుకున్న బాజిరెడ్డి...ఆయన కుమారున్ని ఓడించడమే తన ధ్యేయమని ప్రచారం చేస్తున్నారు. ఆర్మూర్, బాన్సువాడ, నిజామాబాద్‌ రూరల్ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బాజిరెడ్డి...2023 అసెంబ్లీ మొన్నటి ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఐతే ఇప్పుడు ఎంపీగా బరిలో నిలిచి డీఎస్ ఫ్యామిలీని మరో సారి ఢీ కొట్టబోతున్నారు. 2014 ఎన్నికల్లో డీ శ్రీనివాస్ ను ఓడించిన బాజిరెడ్డి...2024 ఎన్నికల్లో అర్వింద్ ను కూడా ఓడిస్తారా ఆన్నది ఆసక్తికరంగా మారింది. 


నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాజిరెడ్డి
1999 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పోటీ టీడీపీ అభ్యర్థిపై గెలుపొందారు. 2004 బాన్సువాడ నియోజకవర్గంలో విజయం సాధించి...రెండోసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014, 2018 ఎన్నికల్లో నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం నుంచి...బీఆర్ఎస్ పార్టీ తరపున విజయం సాధించారు. ఆర్టీసీ ఛైర్మన్ గానూ పని చేశారు.