మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో రోజుకో కొత్త అంశం తెరపైకి తీసుకొస్తున్నాయి రాజకీయా పార్టీలు. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలన్నీ... ప్రత్యర్థుల నెరవేర్చని హామీలు, గతంలో చేసిన వాగ్దాలను ప్రజల ముందు ఉంచుతున్నాయి. అలాంటి ఓ హామీని వెలుగులోకి తీసుకొచ్చిన టీఆర్‌ఎస్‌... బీజేపీని దోషిగా నిలబెట్టే కార్యక్రమం చేపట్టింది. 


మునుగోడుకి ప్రాంతీయ ఫ్లోరైడ్ సెంటర్ ఇస్తానంటూ గతంలో హామీ ఇచ్చిన జేపీ నడ్డా ఇప్పటి వరకు ఆ మాట నిలబెట్టుకోలేదని టీఆర్‌ఎస్‌ విమర్శిస్తోంది. ట్విట్టర్ వేదికగా దీనిపై ప్రశ్నలు గుప్పించిన వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు... బీజేపీ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఆరేళ్లయినా కేంద్రం ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్‌కు నయా పైసా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. మర్రిగూడలో 300 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని హమీ ఇచ్చి మర్చిపోయారన్నారు. అబద్దపు హమీలిస్తూ, ప్రజా గోడు పట్టని బీజేపీ నేతల్లారా ఏం మోహం పెట్టుకుని ఓట్లడగడానికి మునుగోడుకు వస్తున్నారని హరీష్‌ నిలదీశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి బుద్ది చెప్పడం ఖాయమంటూ అభిప్రాయపడ్డారు. 






కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న టైంలో 2016లో మర్రిగూడలో నడ్డా పర్యటించారు. ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తమన్నారు. ఆ హమీ ఇచ్చి  ఆరేళ్లయిందని గుర్తు చేశారు హరీష్‌ రావు. ఈ సెంటర్ ఏర్పాటు కోసం 8.2 ఎకరాల స్థలం చౌటుప్పల్‌లో  తెలంగాణ ప్రభుత్వం కేటాయించిందని కూడా తెలిపారు. అయినా ఇంత వరకు ఆ ఊసే ఎత్తలేదని తప్పుపట్టారు హరీష్‌. జేపీ నడ్డాను ట్యాగ్‌ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు హరీష్‌. 






నడ్డా ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ కొంతమంది మునుగోడు టీఆర్‌ఎస్‌ నేతలు..... ఏకంగా జేపీ నడ్డా సమాధి నిర్మించారు. చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ గ్రామంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా సమాధి కట్టారు. మునుగోడుకి ప్రాంతీయ ఫ్లోరైడ్ సెంటర్ ఇవ్వనందుకు నిరసనగానే ఈ సమాధి కట్టినట్టు చెబుతున్నారు. ఇప్పుడు ఇది స్థానికంగా రాజకీయదుమారం రేపుతోంది.