Mamata started BJP finished: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా వెలిగిన మమతా బెనర్జీ సామ్రాజ్యం నేడు కుప్పకూలింది. బెంగాల్ గడ్డపై బీజేపీకి చోటు లేదు అంటూ ఆమె చేసిన శపథం, ఖేలా హోబే అంటే ఆట మొదలైంది అన్న నినాదం ఈసారి ఆమెకే ఎదురుదెబ్బ తగిలాయి. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ 148ని దాటి ఏకంగా 190 స్థానాల్లో ఆధిక్యంలోకి దూసుకుపోతుండగా, తృణమూల్ కాంగ్రెస్ వంద మార్కు దగ్గరే చతికిలబడింది. ఈ చారిత్రాత్మక పతనానికి గల ఐదు ప్రధాన కారణాలను పరిశీలిస్తే బెంగాల్ ప్రజల నాడి స్పష్టమవుతుంది.
తీవ్రమైన అధికార వ్యతిరేకత
వరుసగా మూడుసార్లు అధికారంలో ఉన్న టీఎంసీపై ప్రజల్లో సహజంగానే వ్యతిరేకత పెరిగింది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో టీఎంసీ నాయకుల అరాచకాలు, కమీషన్ సంస్కృతిపై సామాన్య జనం విసిగిపోయారు. మమతా బెనర్జీ వ్యక్తిగత చరిష్మా ఉన్నప్పటికీ, పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకత్వంపై ఉన్న ఆగ్రహం ఈ సారి ఓట్ల రూపంలో బీజేపీకి కలిసివచ్చింది.
ఆర్.జి. కర్ ఉదంతం - మహిళా ఓటు బ్యాంకులో చీలిక
మమతా బెనర్జీకి అసలైన బలం మహిళా ఓటర్లు. అయితే, ఆర్.జి. కర్ మెడికల్ కాలేజీ ఘటన, పశ్చిమ బెంగాల్లో మహిళా భద్రతపై తలెత్తిన ప్రశ్నలు ఈసారి ఆమె కంచుకోటను బద్ధలు కొట్టాయి. పానిహతి వంటి నియోజకవర్గాల్లో బాధితురాలి తల్లి బీజేపీ తరపున పోటీ చేసి ముందంజలో ఉండటం, బెంగాల్ మహిళలు మార్పును కోరుకున్నారని చెప్పడానికి నిదర్శనం. లక్ష్మీర్ భండార్ వంటి సంక్షేమ పథకాలు కూడా శాంతిభద్రతల వైఫల్యం ముందు దిగదుడుపు అయ్యాయి.
హిందూ ఓట్ల పోలరైజేషన్
ఈ ఎన్నికల్లో హిందూ ఓటర్లు పెద్ద ఎత్తున బీజేపీ వైపు మొగ్గు చూపారు. సువేందు అధికారి వంటి నేతలు ప్రచారం చేసినట్లుగా, హిందువులంతా ఏకమవ్వాలి అనే నినాదం క్షేత్రస్థాయిలో బలంగా పనిచేసింది. ముస్లిం ఓట్లు టీఎంసీ, కాంగ్రెస్ మధ్య చీలిపోవడం, మరోవైపు హిందూ ఓట్లు గంపగుత్తగా బీజేపీకి పడటం మమత ఓటమిని శాసించింది. ముఖ్యంగా ఉత్తర బెంగాల్, జంగల్ మహల్ ప్రాంతాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసే దిశగా సాగడం దీనికి నిదర్శనం.
నిరుద్యోగం - వలసలు
బెంగాల్లో పరిశ్రమల లేమి, పెరుగుతున్న నిరుద్యోగం యువతలో తీవ్ర అసహనాన్ని నింపాయి. యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి రావడంపై బీజేపీ చేసిన ప్రచారం ప్రభావం చూపింది. ద్రవిడ మోడల్ లాగే బెంగాల్ మోడల్ కూడా కేవలం ప్రచారానికే పరిమితమైందని, అభివృద్ధి కావాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ప్రధాని మోదీ చేసిన పిలుపు పట్టణ , విద్యావంతులైన ఓటర్లను ఆకర్షించింది.
బీజేపీ సంస్థాగత బలం
ఒకప్పుడు మమతకు కుడిభుజంగా ఉన్న సువేందు అధికారి, ఈసారి బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో సఫలమయ్యారు. టీఎంసీకి ఉన్న కేడర్ బలాన్ని బీజేపీ కూడా అందిపుచ్చుకుంది. అమిత్ షా, నరేంద్ర మోదీల నిరంతర పర్యటనలు, బూత్ స్థాయిలో పార్టీని పటిష్టం చేయడం బీజేపీకి చారిత్రాత్మక విజయాన్ని అందించాయి. మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గం భవానీపూర్లో అతి స్వల్ప మెజార్టీతో ముందంజలో ఉన్నారు. బెంగాల్ ప్రజలు హింసాత్మక రాజకీయాల కంటే అభివృద్ధికి, భద్రతకు పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారని ఈ ఫలితాలు చాటిచెబుతున్నాయి. శపథాలు, సవాల్లు ప్రజాక్షేత్రంలో పలకవని, ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని ఈ ఎన్నిక నిరూపించింది. సాయంత్రానికి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం కావడంతో, బెంగాల్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ శకం ముగిసి కొత్త అధ్యాయం మొదలైంది.
