Congress alliance shows lead in Kerala:  కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఉత్కంఠ పరాకాష్టకు చేరుకుంది.  రాష్ట్రంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయానికి భిన్నంగా ఎల్‌డీఎఫ్ (LDF) హ్యాట్రిక్ విజయం సాధిస్తుందా లేక కాంగ్రెస్ నేతృత్వంలోని  యూడీఎఫ్ (UDF)  మళ్ళీ పుంజుకుంటుందా అన్నది క్షణక్షణానికి మారుతున్న ట్రెండ్స్ ఆసక్తికరంగా మార్చాయి. ప్రారంభంలో పోస్టల్ బ్యాలెట్లలో యూడీఎఫ్   ఆధిక్యం కనబరిచింది. ఈవీఎం ఓటింగ్ లోనూ కాంగ్రెస్ అభ్యర్థులకు మెజార్టీ వస్తోంది రాష్ట్రంలో అధికార ఎల్‌డీఎఫ్ ప్రభంజనాన్ని అడ్డుకుంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని  యూడీఎఫ్  స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. గత పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న యూడీఎఫ్, ఈసారి కేరళ ఓటర్ల 'మార్పు' సంప్రదాయాన్ని పునరావృతం చేస్తూ మ్యాజిక్ ఫిగర్ వైపు శరవేగంగా అడుగులు వేస్తోంది.

Continues below advertisement

ప్రముఖ నియోజకవర్గాల్లో యూడీఎఫ్ దిగ్గజాలు తమ పట్టును చాటుకుంటున్నారు. ప్రతిపక్ష నేత  వీడీ సతీశన్ పరవూరులో భారీ ఆధిక్యంలో ఉండగా, మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ వారసుడు చాందీ ఊమెన్ పుత్తుపల్లిలో తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మధ్య కేరళ , మలబార్ తీర ప్రాంతాల్లో యూడీఎఫ్ అభ్యర్థులు ఎల్‌డీఎఫ్ కోటలను బద్ధలు కొడుతూ ముందంజలోకి రావడం రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.

ముఖ్యమంత్రి  పినరయి విజయన్  ధర్మడంలో ఆధిక్యంలో ఉన్నప్పటికీ, ఆయన మంత్రివర్గంలోని పలువురు కీలక మంత్రులు వెనుకంజలో ఉండటం ఎల్‌డీఎఫ్‌కు గట్టి ఎదురుదెబ్బగా మారింది. ప్రభుత్వ వ్యతిరేకత, నిరుద్యోగం,  ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని వివాదాలు యూడీఎఫ్‌కు సానుకూలంగా మారాయని ప్రాథమిక విశ్లేషణలు చెబుతున్నాయి. కేరళ ఓటర్లు మరోసారి అధికార మార్పిడికే మొగ్గు చూపినట్లు ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి.   

Continues below advertisement

బీజేపీ నేతృత్వంలోని  ఎన్డీఏ (NDA) పాలక్కాడ్ ,  త్రిస్సూర్ వంటి కొన్ని స్థానాల్లో గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ, ప్రధాన పోరు మాత్రం యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్ మధ్యే సాగుతోంది. యూడీఎఫ్ కూటమిలోని ముస్లిం లీగ్  తన బలమైన పట్టున్న మలప్పురం జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసే దిశగా సాగుతుండటం ఆ కూటమికి కొండంత బలాన్నిస్తోంది.                      

ప్రస్తుత ట్రెండ్స్ గనుక ఫలితాలుగా మారితే, కేరళలో యూడీఎఫ్ ఘనవిజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. తిరువనంతపురంలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం  ఇందిరా భవన్  వద్ద కార్యకర్తలు అప్పుడే బాణాసంచా కాల్చి సంబరాలు మొదలుపెట్టారు. దశాబ్ద కాలం తర్వాత కేరళ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరబోతుండటంతో యూడీఎఫ్ శ్రేణుల్లో ఉత్సాహం మిన్నంటింది.