Elections 2024 :  మరో పదేళ్ల పాటు  రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి  స్పష్టం చేశారు. తనకు పదవులపై ఆశ లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో క్యాంప్ పెట్టినప్పుడు మూడు రాత్రులు తాను కనీసం గది నుంచి కాలు బయట పెట్టలేదన్నారు. కొందరు డిల్లీ వెళ్లి పైరవీలు చేసుకున్నారన్నారు. కానీ తాను మాత్రం ఎక్కడికీ వెళ్ళలేదన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో  మీడియా ప్రతినిధులు అడిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.  25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూన్ 5న కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారన్నారు. త్వరలో బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. ఆరుగురు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు తనను సం ప్రదించారని తెలిపారు. డీలిమిటేషన్ తర్వాత తెలంగాణలో 154 అసెంబ్లీ సీట్లు అవుతాయని… ఇందులో 125 కాంగ్రెస్ గెలుస్తుందని  ధీమా వ్యక్తం చేశారు.                                 


బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మద్యం కేసులో ఇరుక్కొని తెలంగాణ పరువు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత  బతుకమ్మ చుట్టూ తిరుగుతుందనుకున్నామని… కానీ బతుకమ్మలో బ్రాందీ బాటిల్ పెట్టుకొని తిరుగుతుందని గుర్తించలేకపోయామని  ఘాటు వ్యాఖ్యలు చేశారు.  తలసాని శ్రీనివాస్ యాదవ్ కంటే శంకరమ్మకి తెలివి ఎక్కువ ఉందని, అయినప్పటికీ తలసాని మంత్రి ఎలా అవుతాడని ప్రశ్నించారు. కేసీఆర్‌ని ఫుట్‌బాల్ ఆడుకుంటానన్న తలసాని… తర్వాత మంత్రి అయ్యి గొర్రెలు, బర్రెలు, చేపలు తిన్నాడని  సెటైర్లువేశారు.                        


రాముడి పేరు మీద బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. పదేండ్లు ప్రధాని ఉండి.. రాముడి పేరు చెప్పి ఓట్లు అడుక్కునే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు.  రిజర్వేషన్లపై మోదీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఫైరయ్యారు.  ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని బీజేపీ నాయకులు మత కలహాలు రేపుతున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసం బీజేపీ చిల్లర రాజకీయం చేస్తుందన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల ముచ్చట ఏమైందని ప్రశ్నించారు.                       


ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపైనా స్పందించారు. ఏపీలో జరిగే ఎన్నికల్లో తమ పార్టీకి ఒక్క సీటు రాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.  కడప నుంచి ఎంపీగా షర్మిల పోటీ చేస్తున్నారు.వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నా షర్మిల పీసీసీ చీఫ్ గా అయినా  సరే.. ఒక్క సీటు కూడా రాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తేల్చేశారు. షర్మిలకు మనోధైర్యం ఇచ్చేలా కొన్ని మాటలు అయినా చెబితే బాగుండేదన్న అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో వినిపిస్తోంది.