Pawan And Chandra Babu Discussing: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వెళ్లా. వీరిద్దరూ రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులతోపాటు బీజేపీ కూటమిలో చేరిక, ఈ నెల ఏడో తేదీన ఢిల్లీకి వెళ్లాలని భావిస్తున్న నేపథ్యంలో చోటు చేసుకోబోయే పరిణామాలు తదితర వాటిపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా పవన్‌ కల్యాణ్‌ తొలి జాబితాలో ఐదు సీట్లకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన 19 సీట్లకు సంబంధించిన అభ్యర్థులు ప్రకటన, అక్కడ ఎదురవ్వబోయే ఇబ్బందులు వంటివి చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. జనసేన అడిగిన స్థానాలు, వాటిలో తెలుగుదేశానికి ఉన్న ఇబ్బందులపైనా ఇరువురు నేతలు మాట్లాడుకుంటున్నారు. జనసేనకు ఇవ్వాల్సిన 19 స్థానాల్లో సుమారు ఆరేడు స్థానాల్లో టీడీపీకి బలమైన అభ్యర్థులు ఉన్నట్టు చెబుతున్నారు. ఆయా స్థానాల్లోనే జనసేనకు బలమైన నేతలు ఉండడంతో ఇరు పార్టీల అగ్రనేతలు వీటిపై సమాలోచనలు చేస్తున్నారు.

  


ప్రకటనకు అవకాశం ఉంటుందా..?


తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమిగా వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యాయి. ఈ కూటమిలో బీజేపీ చేరనుందని చెబుతున్నారు. బీజేపీ చేరడానికి ముందే ఇరు పార్టీలు కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మొత్తంగా జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, మూడు పార్లమెంట్‌ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది. దీనికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా అంగీకరించడంతోపాటు కేడర్‌ను దానికి సంసిద్ధులను చేసేలా ఉమ్మడి సమావేశంలో పవన్‌ ప్రసంగించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలోనే మిగిలిన 19 స్థానాలకు పవన్‌ కల్యాణ్‌ అభ్యర్థులను ప్రకటిస్తారని చెబుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ప్రకటిస్తారా..? ఢిల్లీ పర్యటన తరువాత ఆ మేరకు ప్రకటన ఉంటుందా..? అన్నది చూడాల్సి ఉంది. రెండో జాబితాపైనే ఇద్దరి నేతల మధ్య చర్చలు జరగుతున్నట్టు తెలుస్తోంది.


ఆశావహుల్లో టెన్షన్‌


పవన్‌, చంద్రబాబు భేటీపై జనసేన, టీడీపీ నాయకుల్లో టెన్షన్‌ నెలకొంది. శ్రేణులు కూడా ఏయే స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తారన్న దానిపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ, జనసేన ముఖ్య నాయకులకు మాత్రం ఈ భేటీ ఆందోళనకు గురి చేస్తోంది. ఎవరి స్థానాలకు ముప్పు వాటిల్లుతుందో, ఎవరి అభ్యర్థిత్వం గల్లంతు అవుతుందో అన్న ఆందోళన చాలా మంది నేతల్లో ఉంది. రెండో జాబితాలోనే పవన్‌ కల్యాణ్‌ మిగిలిన 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారా..? అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా తొమ్మిదో తేదీ నాటికి రాష్ట్రంలోని కూటమి సీట్ల పంపకాలపై ఒక స్పష్ట వచ్చే అవకాశముంది. ఈలోగానే జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తుందా..? లేదా..? అన్నది చూడాలి. బీజేపీకి ఇచ్చే సీట్లపైనా కూటమిలో చర్చ జరుగుతోంది. పది ఎమ్మెల్యే, నాలుగు ఎంపీ స్థానాలను బీజేపీ కోరుతున్నట్టు చెబుతున్నారు. మరి చంద్రబాబు ఎన్ని సీట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తారో చూడాల్సి ఉంది.


ఢిల్లీ వెళ్లిన పురందేశ్వరి


మరోవైపు ఈ పొత్తులపై చర్చించేందుకు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా ఢిల్లీ వెళ్లారు. ఏపీలో పొత్తులపై నేతల అభిప్రాయాలు, షీట్ల వ్యవహారాలు, పోటీకి సన్నద్దతపై చర్చించబోతున్నారు. ఆమెతో మాట్లాడిన తర్వాత రేపు ఎల్లుండి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ని కూడా ఢిల్లీకి పిలిపించి పొత్తుల ఎపిసోడ్‌కు ఎండ్‌ కార్డు వేయాలని చూస్తోంది బీజేపీ.