Present political Scenario in Visakha South Seat: విశాఖ జిల్లాలోని మరో నియోజకవర్గం విశాఖ దక్షిణం. నగర పరిధిలోని ఈ నియోజకవర్గంలో అత్యధికంగా మత్స్యకార ఓటర్లు ఉంటారు. 2009 నియోజకవర్గాలు పునర్విభజనలో భాగంగా ఇది ఏర్పాటైంది. ఇప్పటి వరకు మూడుసార్లు ఎన్నికలు జరిగాయి. నాలుగో ఎన్నికకు ఈ నియోజకవర్గం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో 2,76,723 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,35,695 మంది ఓటర్లు ఉండగా, మహిళా ఓటర్లు 1,41,011 మంది ఉన్నారు. 


మూడు ఎన్నికల ఫలితాలు ఇవే


ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల్లో రెండుసార్లు తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఒకసారి కాంగ్రెస్‌ పార్టీ విజయాన్ని దక్కించుకుంది. నియోజకవర్గం ఏర్పాటైన 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఇక్కడ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన ద్రోణంరాజు శ్రీనివాస్‌ విజయాన్ని దక్కించుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన తన సమీప ప్రత్యర్థి కోలా గురువులపై 341 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. 2014లో జరిగిన రెండో ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వాసుపల్లి గణేష్‌కుమార్‌ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కోలా గురువులుపై 18,316 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 2019లో జరిగిన మూడో ఎన్నికల్లోనూ వరుసగా రెండోసారి వాసుపల్లి గణేష్‌ కుమార్‌ విజయం దక్కించుకున్నారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీ చేసిన ద్రోణంరాజు శ్రీనివాస్‌పై 3729 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. 


ఆసక్తి కలిగిస్తున్న రాజకీయం


2024 ఎన్నికలకు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైసీపీ, జనసేన పార్టీలు సిద్ధమవుతున్నాయి. కూటమిలో భాగంగా ఇక్కడి సీటును తెలుగుదేశం పార్టీ దక్కించుకునే అవకాశముంది. గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన వాసుపల్లి గణేష్‌కుమార్‌ వైసీపీకి అనుబంధంగా కొనసాగుతూ వస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. అధిష్టానం కూడా ఆయనకే టికెట్‌ కేటాయించే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థిగా గండి బాబ్జీ బరిలో దిగేందుకు సిద్ధపడుతున్నారు. గతంలో పెందుర్తి ఎమ్మెల్యేగా పని చేసిన ఈయన్ను కొన్నాళ్ల కిందట టీడీపీ ఇక్కడ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా పెట్టింది. ఆయన ప్రజల్లోకి జోరుగా వెళుతున్నారు. వాసుపల్లి గణేష్‌కుమార్‌, గండి బాబ్జీ ఇద్దరూ జోరుగా ప్రజల్లో తిరుగుతున్నారు. వీరిద్దరి మధ్య పోటీ ఆసక్తికరంగా ఉండబోతోందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.