Harish Rao Fires On Revanth Reddy :  కేసీఆర్‌ సిరిసిల్లలో వడ్ల బోనస్‌ గురించి మాట్లాడితే సీఎం రేవంత్‌ రెడ్డి చెత్త పదజాలంతో  విమర్శిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. " కేసీఆర్ డ్రాయర్ ఊడకొడ్తా అంటుండు రేవంత్ రెడ్డి.. నువు రాష్ట్ర ముఖ్యమంత్రివా లేదా చడ్డీ గ్యాంగ్ సభ్యుడివా " అని ప్రశ్నించారు. పటాన్ చెరువు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని శ్రీ సిద్ది గణపతి దేవాలయం  ఆవరణలో బీఆర్‌ఎస్‌ మెదక్ లోక్‌సభ ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.  ఎలక్షన్స్‌ ముందు నోటితో తియ్యగా మాట్లాడిన రేవంత్‌ ఇప్పుడు నొసటితో వెక్కిరిస్తున్నారన్నారు. 


కాంగ్రెస్ పార్టీ వాళ్లు గారడి మాటలు చెప్పారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ పై తిట్ల పురాణం మొదలు పెట్టాడు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసింది..రేవంత్ రెడ్డి తిట్ల కోసమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫేక్ వార్తలు, లీకులతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రైతులను పట్టించుకోలేదని చెప్పారు. వెంకట్రామిరెడ్డి   పక్కా లోకల్.. తెల్లాపూర్‌లోనే నివాసం ఉంటారని పేర్కొన్నారు. వెంకట్రామిరెడ్డి అధికారిగా మెదక్ జిల్లా ప్రజలకు సేవ చేశారని తెలిపారు. మంచి మనిషి, పరిపాలన అనుభవం ఉండి ప్రజలకు అందుబాటులో ఉండే వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని కోరారు. 


దుబ్బాక ప్రజలు బీజేపీ అభ్యర్ధి రఘునందన్‌రావును చిత్తు చిత్తుగా ఓడించారు. పదేళ్ల బీజేపీ పాలనలో ప్రజలకు చేసింది ఏమీలేదన్నారు. భవిషత్తు అంతా బీఅర్ఎస్ పార్టీ దేనని స్పష్టం చేశారు. మళ్లీ అధికారంలోకి వచ్చేదిబీఆర్ఎస్ పార్టీయేనని, మన ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసే వెంకట్రామి రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ పార్టీ వంద రోజుల పాలనలో అన్ని వర్గాలను మోసం చేసింది. ఏ ముఖం పెట్టుకుని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతలు ఓట్లు అడుగుతారు. కాంగ్రెస్ అభయహస్తం అక్కరకురాని హస్తం లాగా తయారయ్యింది. 2004 నుంచి 2019 వరకు మెదక్ గడ్డపై గులాబీ జెండా ఎగురుతూనే ఉంది. ఈసారి కూడా మెదక్ గడ్డపై బీఆర్‌ఎస్‌ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. 


తుక్కుగూడ సభలో కేసీఆర్‌పై  రేవంత్ విమర్శలు 


ఇటీవల తుక్కుగూడ సభలో కేసీఆర్‌పై రేవంత్ విరుచుకుపడ్డారు.  కేసీఆర్‌ కాలు విరిగిందని, అధికారం పోయిందని, కూతురు జైలుకెళ్లిందని ఇన్నాళ్లూ సంయమనం పాటించామని.. సైలెంట్‌గా ఉన్నామని ఏదిపడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. తాను జానారెడ్డి టైపు కాదని.. తప్పుడు మాటలు మాట్లాడితే అంగీ, లాగు ఊడదీసి చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తానని హెచ్చరించారు. గతంలోనే తాను చెప్పినట్టు కేసీఆర్, కూతురు, అల్లుడు, కుటుంబం ఉండేట్టు అందులో డబుల్‌ బెడ్రూం కట్టిస్తానని వ్యాఖ్యానించారు. ‘‘ఇన్నాళ్లూ కుక్కలు మొరిగినయ్‌. ఇప్పుడో నక్క వచ్చింది. మొన్న సూర్యాపేటకు, నిన్న కరీంనగర్‌కు వెళ్లింది. కేసీఆర్‌ తననేం పీకుతారని అడుగుతున్నారు. వెంట్రుక కూడా పీకలేరని అంటున్నారు. అది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషేనా? పదేళ్లుగా రాష్ట్రాన్ని పీడించి, దోచుకున్న దొంగలు వాళ్లు. " అని విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.