Karnataka Election 2023 :   కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనూహ్యంగా ఉన్నాయి. దిగ్గజ నేతలు కొంత మంది పరాజయం పాలయ్యారు. చాలా కాలం నుంచి టిక్కెట్ ఇవ్వకుండా పక్కన పెడుతున్న గాలి జనార్ధన్ రెడ్డి ఈ సారి బీజేపీని తీవ్రంగా దెబ్బకొట్టారు. ఆయన సొంత పార్టీ పెట్టుకుని ఎమ్మెల్యేగా గెలవడమే కాదు.. బీజేపీ అభ్యర్థుల్ని ఓడించారు. 


కర్ణాటక రాజకీయాల్లో గాలి జనార్దన్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి గాలి జనార్దన్ రెడ్డి సోదరులు, బళ్లారి శ్రీరాములు శక్తి వంచన లేకుండా పని చేసేవారు. అయితే అక్రమ మైనింగ్ కేసుల్లో జైలుకు వెళ్లిన గాలి జనార్దన్ రెడ్డి రాజకీయ జీవితం పూర్తిగా తల్లకిందులు అయ్యింది.  గత డిసెంబర్ నెలలో బీజేపీ నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కల్యాణ కర్ణాటక ప్రగతి పార్టీ (కేఆర్ పీపీ) పెట్టి బీజేపీ నాయకులకు షాక్ ఇచ్చారు. కోప్పళ జిల్లాలోని గంగావతి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఫుట్ బాల్ సింబల్ మీద పోటీ చేసిన మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి 8 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. గంగావ‌తిలో బీజేపీ మూడ‌వ స్థానంలో నిలిచింది.                              
 
కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీల నుంచి ఎంతో సీనియర్ నాయకులు పోటీలో ఉన్నా గంగావతిలో సొంత పార్టీ పెట్టిన గాలి జనార్దన్ రెడ్డి  విజయం సాధించారు.  సిద్దరామయ్యను సీఎం చేస్తే తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తానని ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఆయన మద్దతు కాంగ్రెస్ కు అవసరం లేదు. గాలి జనార్దన్ రెడ్డి కొత్త పార్టీ తరపున అనేక నియోజక వర్గాల్లో చాలా మంది పోటీ చేశారు.  బళ్లారిలో పోటీ చేసిన గాలి జనార్ధన్ రెడ్డి  భార్య లక్ష్మీ అరుణ ఓడిపోయారు. అయితే గట్టి పోటీ ఇచ్చారు.  వచ్చే ఎన్నికల్లో కేఆర్ పీ పార్టీ అభ్యర్థులు అందర్ని గెలిపించుకోవడానికి ఇప్పటి నుంచి తాను పని చేస్తానని గాలి జనార్ధన్ రెడ్డి ప్రకటించారు.                                            


తాను బెంగళూరులోని విధాన సౌధలో త్వరలోనే అడుగుపెడుతానని, తన నియోజక వర్గం ప్రజల సమస్యలు పరిష్కరించడానికి శక్తి వంచన లేకుండా పని చేస్తానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాలు ఉంటే లేనిపోని సమస్యలు వస్తాయని, ఏదో ఒకపార్టీకి సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వస్తే ప్రజలకే మంచిది అని గాలి జనార్దన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.  తాను బీజేపీ అనే ఇంటి నుంచి బయటకు వచ్చేశానని, ఆ ఇంటికి తనకు ఎలాంటి సంబంధం లేదని, బీజేపీ నాయకులకు దురంహకారం ఎక్కువ అయ్యిందని, అందుకే ఆ పార్టీకి ఈ పరిస్థితి ఎదురైయ్యిందని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. అందరి ఉసురు తగిలి బీజేపీకి ఇలాంటి గతిపట్టిందని గాలి జనార్దన్ రెడ్డి శాపాలు పెడుతున్నారు.