Mudragada Wrote A letter To Pawana: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి ముద్రగడ మరో లేఖాస్త్రం సంధించారు. ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన ఆయన ఇప్పుడు మరోసారి విమర్శలు అందుకున్నారు. ఇన్ని రోజులు జనసేనలో ముద్రగడ పద్మనాభం జాయిన్ అవుతారని అంతా అనుకున్నారు. కానీ పవన్ కల్యాణ్ వెళ్లి ఆహ్వానించకపోవడంతో ముద్రగడ బాగా హర్ట్ అయినట్టు ఆ లేఖ చూస్తే అర్థమవుతోంది. దీనికి తోడు తాడేపల్లి గూడెం సభలో పవన్ మాట్లాడుతూ.. తనతో వచ్చే వాళ్లంతా పోరాడే వాళ్లు అయి ఉండాలే కానీ సలహాలు ఇచ్చే వాళ్లు వద్దే వద్దని తెగేసి చెప్పేశారు. ఇది కూడా ముద్రగడను బాగా కెలికేసిందని తెలుస్తోంది. 


ఇంతకీ పవన్‌కు ముద్రగడ రాసిన లేఖలో ఏముందంటే... "2019 ఎన్నికల ముందు కవాతు సందర్భంగా కిర్లంపూడి వస్తానని కబురు వంచారు. అయోధ్య వెళ్ళొచ్చిన తరువాత కిర్లంపూడి వస్తానని మరోకసారి కబురు పంపించారు. ఎటువంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పడం జరిగింది. అన్ని వర్గాలకు న్యాయం జరగడం కోసం పార్టీని ముందుకు తీసుకువెళ్ళడానికి నా వంతు కృషి చేయాలని, ఎటువంటి ఫలితం ఆశించని సేవ మీతో చేయించాలని అనుకున్నాను.


మన ఇద్దరి కలయిక అనగానే యావత్ జాతి చాలా బలంగా కోరుకున్నారు. వారి అందరి కోరికతో నా గతం, నా బాధలు, అవమానాలు, కోరికలు అన్ని మరచి మీతో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డానండి. రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ ఒరవడి తీసుకురావాలని చాలా బలంగా ప్రయత్నం చేద్దామని ఆశించాను. మీరు కూడా ఇదే ఆలోచనతో ఉన్నారి నమ్మానండీ... కానీ దురదృష్టవశాత్తు మీరు నాకు ఆ అవకాశం ఇవ్వలేదండీ. 


చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు మొత్తం టి.డి.పి కేడర్‌ బయటకు రావడానికి భయపడిపోయింది. అంతా ఇళ్ళకే పరిమితమైపోయారు. అలాంటి సమయంలో తమరు జైలుకి వెళ్లి వారికి భరోసా ఇవ్వడం సామాన్యమైన విషయం కాదండి. చరిత్ర తిరగరాసినట్టు అయ్యిందండీ. వారి పరపతి విపరీతంగా పెరగడానికి ఎదరు ఎన్ని చెప్పినా మీరే కారణమని బల్లగుద్ది చెప్పగలనండి. 


ప్రజలంతా ముమ్మల్ని ఉన్నత స్థానంలో స్థానంలో చూడాలని తహతహలాడారు. పవర్‌ షేరింగ్‌కు ప్రయత్నించి 80 సీట్లు అడుగి, ముందుగా మిమ్మల్ని రెండేళ్లు సీఎంగా చేయమని కోరి ఉండాలండి. కానీ ఆ సావాసం మీరు చేయలేకపోవడం చాలా బాధాకరమండి. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం గానీ, పదవుల కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం గాని చేయులేదండి. ఆపరిస్థితి రాకుండా చేయమని భగవంతున్ని తరచూ ప్రార్థిస్తుంటానండీ. 


కానీ మీలా గ్లామర్ ఉన్న వ్యక్తి కాకపోవడం, ప్రజల్లో పరపతి లేనివాడిని అవ్వడం వల్ల మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్‌ వ్యక్తిగా, తుప్పు పట్టిన ఇనుము లాంటివాడిగా ఉండటంతోనే వస్తానని చెప్పించి రాలేకపోయారు. మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు. ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుంది.
మీ పార్టీ పోటీ చేసే 24 మంది కోసం నా అవసరం రాదు రాకూడదనిని భగవంతున్ని ప్రార్ధిస్తున్నానండి." అంటూ ముద్రగడ తనలేఖను ముగించారు.