కేంద్ర ఎన్నికల సంఘం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. తెలంగాణలో అనేక మంది ఐఏఎస్ లు, ఐపీఎస్ లు బదిలీ చేసిన గంటల్లోనే, కొత్త అధికారులను నియమించింది. కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేసిన స్థానాల్లో తాత్కాలిక నియామకాలు చేపట్టింది. హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ను బదిలీ చేసి, ఆయన స్థానంలో హైదరాబాద్‌ అదనపు సీపీగా ఉన్న విక్రమ్‌సింగ్‌ మాన్‌ను నగర సీపీగా నియమించింది. మరోవైపు వరంగల్‌ సీపీ రంగనాథ్ స్థానంలో నేరవిభాగం డీసీపీగా ఉన్న మురళీధర్‌ నియమించింది. నిజామాబాద్‌ సీపీ సత్యనారాయణ స్థానంలో ఎస్‌.జయరామ్‌ను బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించింది. మహబూబ్‌నగర్‌ ఎస్పీగా రాములు, నాగర్‌కర్నూల్‌ ఎస్పీగా సి.హెచ్‌. రమేశ్‌, జోగులాంబ గద్వాల ఎస్పీగా ఎన్‌.రవి, మహబూబాబాద్‌ ఎస్పీగా జె. చిన్నయ్య, నారాయణపేట ఎస్పీగా కె. సత్యనారాయణ, భూపాలపల్లి ఎస్పీగా ఎ.రాములు, సూర్యాపేట ఎస్పీగా నాగేశ్వరరావు, సంగారెడ్డి ఎస్పీగా పి. అశోక్‌, జగిత్యాల ఎస్పీగా ఆర్‌. ప్రభాకర్‌రావు, కామారెడ్డి ఎస్పీగా కె.నరసింహారెడ్డిని ఈసీ నియమించింది.


అంతకుముందు తెలంగాణలో పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌లను బదిలీ చేసింది. జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు బదిలీ జాబితాలో ఉన్నారు. విధి నిర్వహణలో అధికారుల అలసత్వంపై ప్రతిపక్షాల ఫిర్యాదులతో ఈసీ యాక్షన్ తీసుకుంది. కీలక శాఖల అధికారులు, పలు జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లను బదిలీ చేసింది. ప్రధాన నగరాల పోలీస్‌ కమిషనర్లకూ స్థానచలనం కలిగింది. నలుగురు కలెక్టర్ల బదిలీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్‌, మేడ్చల్‌ కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌, యాదాద్రి జిల్లా కలెక్టర్‌ కృష్ణారెడ్డి, నిర్మల్‌ కలెక్టర్‌ వరుణ్ రెడ్డిని బదిలీ చేసింది. వీరితో పాటు 13 మంది ఎస్పీలు, సీపీలను సైతం ట్రాన్స్‌ఫర్‌ చేసింది.


కమిషనర్లు సైతం బదిలీ
హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌, నిజామాబాద్ సీపీ సత్యనారాయణ, వరంగల్ సీపీ రంగనాథ్‌ను సైతం బదిలీ చేసింది. సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్‌, కామారెడ్డి ఎస్పీ శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎస్పీ భాస్కర్‌, మహబూబ్‌నగర్‌ ఎస్పీ నర్సింహ, నాగర్‌ కర్నూల్‌ ఎస్పీ మనోహర్‌, జోగులాంబ గద్వాల ఎస్పీ సృజన, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, మహబూబాబాద్‌ ఎస్పీ చంద్రమోహన్‌, భూపాలపల్లి ఎస్పీ కరుణాకర్‌, సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ బదిలీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇటు ఎక్సైజ్‌ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌తో పాటు రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాస్‌రాజ్‌ను సైతం ట్రాన్స్‌ఫర్ చేసింది సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషన్‌. ఎక్సైజ్‌, వాణిజ్య పన్నుల శాఖకు ప్రత్యేక కార్యదర్శులను నియమించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. గురువారం సాయంత్రం 5గంటల కల్లా ప్యానల్‌ పంపాలని ఈసీ ఆదేశించింది. 


 అక్టోబరు 3 నుంచి 5 వరకు ఎన్నికల కమిషన్‌ అధికారులు రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలపై సమీక్షించారు. పోలీసుశాఖతో నిర్వహించిన సమావేశంలో కొందరు అధికారుల పనితీరుపై ఈసీ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో ఎస్పీ స్థాయి అధికారులే ఎక్కువగా ఉన్నారు.  ప్రతిపక్ష పార్టీలు కూడా కొందరు పోలీసు అధికారుల పనితీరును విమర్శిస్తూ వారిని మార్చాలని వినతిపత్రం సమర్పించాయి. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినందున అధికారులను మార్చే అధికారం కమిషన్‌కు ఉంటుంది. దీంతో  కొందరు ఎస్పీలకు స్థానచలనం కల్పిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.