Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఓట్ల లెక్కింపు దగ్గర పడుతున్న కొద్దీ టెన్షన్ పెరిగిపోతోంది. గెలుస్తామా లేదా అన్న భయం నేతల్లో ఉంటే... పోలింగ్ రోజే విధ్వంసం జరిగిందని కౌంటింగ్ రోజు ఇంకెంత విధ్వంసం చూడాల్సి వస్తుందో అన్న అనుమానం సామాన్య ప్రజల్లో ఉంది. పోలింగ్ జరిగి పది రోజులు దాటినా అసలు ప్రజల నాడి ఏంటన్నది ఎవరికీ ఓ పట్టానా అర్థం కావడం లేదు. అదే టైంలో పార్టీ వ్యాఖ్యలు, నేతలు ఫిర్యాదులు, ఇలా అన్నీ ప్రజలను బెదిరగొట్టేస్తున్నాయి. ఇప్పుడు పరిణామాలు, ఘర్షణలు గెలుపు ఎవరిదీ అన్న చర్చే రాకుండా చేశాయి. తర్వాత మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఎపిసోడ్‌తో ఈ రాజకీయం పీక్స్‌కు వెళ్లింది. 


సీట్‌తో కంట్రోల్‌


ఎన్నికల పోలింగ్ తర్వాత పల్నాడు, రాయలసీమలో కక్షపూరిత రాజకీయాలు తెరపైకి వచ్చాయి. ఓటు వేయలేదని, ఓటు వేసేందుకు అడ్డుకున్నారని, ఆధిపత్యానికి అడ్డు వస్తున్నారని ఇలా కారణాల ఏమైనా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంగం సీరియస్‌గా దృష్టి పెట్టింది. తక్షణమే పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు పార్టీలకు కొమ్ము కాస్తున్న అధికారులను తప్పించింది. ఓ సిట్‌ను ఏర్పాటు చేసి అసలు కారణాలు వెలికి తీయడంతోపాటు పరిస్థితిని చల్లబరచాలని సూచించింది. 


పిన్నెల్లి ఎపిసోడ్‌తో మరో టర్న్


సిట్ రాకతో పరిస్థితిలో కొంత మార్పు వచ్చినప్పటికీ అది ఎంత వరకు ఉంటుందనే అనుమానం చాలా మందిలో ఉంది. ఇంతలో పిన్నెల్లి ఓ పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఈవీఎం ధ్వంసం చేయడం, ఇంతలో అరెస్టు భయంతో ఆయన పరారీ కావడంతో ఘర్షణల ఎపిసోడ్ వేరే మలుపు తిరిగింది. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు చెప్పడంతో పోలీసులకు, ఎన్నికల సంఘానికి పెద్ద రిలీఫ్‌గా చెప్పవచ్చు. 


మూడు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా 


అయితే అందరి దృష్టి పిన్నెల్లి ఎపిసోడ్‌పై ఉన్నప్పటికీ పోలింగ్ తర్వాత గొడవలతో రణరంగంలా మారిన చంద్రగిరి, పల్నాడు, తాడిపత్రిలో పరిస్థితి మాత్రం పిన్‌ తీసిన బాంబులా ఉంది. అది ఎప్పుడైనా పేలే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే ముందు జాగ్రత్తగా అక్కడ అధికారులను అప్రమత్తం చేశారు. పరిస్థితి సద్దుమణిగేందుకు ఏర్పాటు చేసిన సిట్ బృందాలు ఆ మూడు ప్రాంతాల్లో కాపు కాశాయి. 


ర్యాలీలు, బాణసంచాపై నిషేధం


మూడు ప్రాంతాలు కూడా ఖాకీ నిఘా నీడలో ఉన్నాయి. వాటితోపాటు ఇంకా సమస్యాత్మకంగా భావించిన ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టింది ఎన్నికల సంఘం. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న ఎన్నికల సంఘం కూడా పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ప్రత్యర్థులను రెచ్చగొట్టేందుకు వీలు లేకుండా ర్యాలీ, ఊరేగింపులను కూడా నిషేధించింది. బాణసంచా విక్రయాలు, పేలుళ్లపై ఆంక్షలు పెట్టింది. పలు జిల్లాల్లో బాణసంచా విక్రయదారులపై కూడా దాడులు చేస్తోంది. సమస్యాత్మక ప్రాంతాల్లోనే కాకుండా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో పోలీసులు కార్డన్‌ సెర్చ్ నిర్వహిస్తున్నారు. అనుమానితులను గుర్తింపు కార్డులు లేని వాళ్లను అదుపులోకి తీసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ లేని, సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. 


ప్రజల్లో అనేక సందేహాలు


అయినా ప్రజల్లో ఇంకా ఏదో సందేహం వెంటాడుతూనే ఉంది. ఎన్నికల రోజుల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్న ఆందోళన అందరిలో ఉంది. అసలు ఆ రెండు రోజులు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడమే ఉత్తమం అని చాలా మంది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. 


యువకులను బయటకు పంపుతున్న ఫ్యామిలీస్


చంద్రగిరిలో మొన్న జరిగిన ఘర్షణల్లో విద్యార్థులు, టెక్కీలపై కూడా పోలీసులు కేసులు పెట్టారు. దీంతో కౌంటింగ్ సమయానికి ఇంట్లో ఉండే యువకులు, ఉద్యోగులు విహారయాత్రలకు వెళ్లిపోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. లేకుంటే అనవసరంగా కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉందని చిన్న ఘర్షణలు జరిగినా కేసులు తప్పవనే ఆలోచన వారు చేస్తున్నారు. ఇప్పటికే చంద్రగిరిలో చాలా మంది టెక్కీలు తమను అనవసరంగా కేసుల్లో ఇరికించారని ఎన్నికల సంఘానికి మొరపెట్టుకున్నారు. ఆ టైంలో ఊరిలో ఉన్నందునే తమపై కేసులు పెట్టారని అంటున్నారు. దీనిపై ఈసీ కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. 


ఆ రెండులో ఇంట్లో ఉంటే మేలు 


కౌంటింగ్ రోజు ప్రశాంతంగా ఇంట్లో ఉండి విజేతలు ఎవరో లెక్కలు చూసుకోండి తప్ప ఆ రెండు రోజులు మాత్రం బయటకు రాకండని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. వేరే రాష్ట్రాల్లో ఉన్న సన్నిహితులు కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న బంధువులకు ఇదే సలహా ఇస్తున్నారు. పోలీసు వ్యవస్థ, ఎన్నికల సంఘం మరింత ఫోకస్డ్‌గా ఉండి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని కోరుకుంటున్న వాళ్లు కూడా ఉన్నారు.