మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లోని మొదటి ఫేజ్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మిజోరంలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలతోపాటు ఛత్తీస్‌గఢ్‌లోని  20స్థానాలకు ఈనెల 7న పోలింగ్‌ జరగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం సాయంత్రం 5గంటలకు మిజోరాంతో పాటు ఛత్తీస్‌గఢ్‌లోని మొదటి ఫేజ్ ఎన్నికల జరిగే ప్రాంతాల్లో ప్రచారం ముగిసింది. 


మిజోరాంలో ఒకే దశలో పోలింగ్
అధికార మిజో నేషనల్‌ ఫ్రంట్‌, జోరం పీపుల్స్‌ మూమెంట్‌, కాంగ్రెస్‌లు పూర్తిస్థాయిలో అభ్యర్థులను రంగంలో దించాయి. బీజేపీ 23 మందిని, ఆప్ నాలుగు చోట్ల పోటీ చేస్తోంది. మరో 27 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాలుంటే 8.57లక్షల మంది ఓటర్లున్నారు. మొత్తం 174 మంది పోటీ చేస్తున్నారు.  మిజోరంలో పోలింగ్‌ విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు, వయోవృద్ధులు, దివ్యాంగులకు ఇంటినుంచే ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం కల్పించింది. దీంతో 2వేల 59 మంది వృద్ధులు, దివ్యాంగులు, 8526 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా 10,585 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. 


ఛత్తీస్‌గఢ్‌లో 20 స్థానాలకు ఎన్నికలు
ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలుంటే, తొలివిడత 20 స్థానాలకు మంగళవారం పోలింగ్‌ జరగనుంది. ప్రస్తుతం జరుగుతోన్న 20 స్థానాల్లో ఎక్కువగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్నాయి.  దీంతో కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. మిగతా 70 స్థానాలకు నవంబర్‌ 17న రెండో విడతలో జరగనున్నాయి. మిజోరం అసెంబ్లీ గడువు డిసెంబర్‌ 17న ముగియనుండగా, ఛత్తీస్‌గఢ్‌ శాసనసభ గడువు వచ్చే ఏడాది జనవరి 3తో ముగియనుంది.  అధికార కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష బీజేపీ ముమ్మరంగా ప్రచారం చేశాయి. గెలుపుపై రెండు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 


పోలింగ్ కు కొన్ని గంటల ముందు మేనిఫెస్టో రిలీజ్
తొలివిడత ఎన్నికలకు కొన్ని గంటల ముందే కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి అధికారంలోకి వస్తే కుల గణన చేపడతామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో రాయ్‌పుర్, రాజ్‌నంద్‌గావ్, జగదల్‌పూర్, బిలాస్‌పూర్, అంబికాపూర్, కవర్ధా నగరాల్లో మేనిఫెస్టో సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించింది. రాజ్‌నంద్‌గావ్‌లో మ్యానిఫెస్టోను ఆవిష్కరించిన సందర్భంగా ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ మాట్లాడారు.  గ్యాస్‌ సిలిండర్‌పై రూ.500 చొప్పున రాయితీ ఇస్తామని, దీన్ని నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. ధాన్యానికి క్వింటాలుకు రూ.3,200 మద్దతు ధర అందజేస్తామని హమీ ఇచ్చారు. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. 


కాంగ్రెస్ కీలక హామీలివే
రైతుల రుణమాఫీ. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం, గ్యాస్‌ సిలిండర్‌పై రూ.500 రాయితీ, నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని మేనిఫెస్టోలో పొందు పరిచింది. 17.50 లక్షల పేద కుటుంబాలకు గృహ వసతి కల్పిస్తామన్న కాంగ్రెస్, 700 గ్రామీణ, పట్టణ పారిశ్రామిక పార్కుల నిర్మిస్తామని హమీ ఇచ్చింది. మహిళా స్వయం సహాయక సంఘాలు, సక్షం యోజన లబ్ధిదారుల రుణమాఫీ చేస్తామని స్పష్టం చేసింది.