Chandrababu Comments In Gannavaram: కూటమి అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రకటించారు. కృష్ణా జిల్లా గన్నవరంలో (Gannavaram) శుక్రవారం నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడిన ఆయన.. సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలో పెద్ద సైకో ఉంటే.. గన్నవరంలో పిల్ల సైకో ఉన్నారని మండిపడ్డారు. రాజకీయ రౌడీలను తుంగలో తొక్కేస్తామని హెచ్చరించిన ఆయన.. గన్నవరం టీడీపీకి కంచుకోట అని అన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. 'ప్రజల ఆస్తులపై సీఎం జగన్ ఫోటో ఎందుకు.?. కూటమి అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తా. రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తాం. వైసీపీ రెండోసారి అధికారంలోకి వస్తే మీ భూములు లాక్కొంటారు. భూములు అమ్మాలన్నా.. కొనాలన్నా జగన్ అనుమతి తీసుకోవాలి. మీ ఆస్తులకు భద్రత కావాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలి. వైసీపీకి ఓటేస్తే మీ ఇంటికి గొడ్డలి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులను సైతం వైసీపీ ప్రభుత్వం వేధించింది.' అని చంద్రబాబు విమర్శించారు. గన్నవరంలో 9 సార్లు ఎన్నికలు జరిగితే.. ఇండిపెండెంట్ తో కలిసి టీడీపీ 8 సార్లు విజయం సాధించిందని గుర్తు చేశారు. ఎంపీ అభ్యర్థి బాలశౌరి, ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రావును భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా, గన్నవరంలో భారీ వర్షంలోనే చంద్రబాబు ప్రసంగం సాగింది. అయితే, భారీ వర్షంలోనూ టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.










మాచర్ల పర్యటన రద్దు


అయితే, గన్నవరం సభ అనంతరం చంద్రబాబు మాచర్లలో (Macharla) పర్యటించాల్సి ఉండగా ప్రతికూల వాతావరణం కారణంగా రద్దైంది. మాచర్ల ఎయిర్ రూట్ క్లిష్టంగా ఉందని.. అటవీ ప్రాంతం మీదుగా ప్రయాణం సాగించలేమని పైలెట్లు చెప్పడంతో ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ క్రమంలో గన్నవరం నుంచి నేరుగా ఒంగోలుకే బయల్దేరారు. కాగా, వాతావరణం ఇబ్బంది కారణంగా మాచర్ల సభ రద్దైందని.. ప్రజలు అర్థం చేసుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. 'మాచర్ల వచ్చేందుకు అన్ని అవకాశాలు పరిశీలించినా సాధ్యం కాలేదు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బ్రహ్మానందరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.


ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ట్వీట్


అంతకు ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు ట్వీట్ చేశారు. 'స్థిరాస్తితో మనిషికి ఉండే అనుబంధం... భూమికి చెట్టుకు ఉన్నంతగా ఉంటుంది. వందల తరాలకు సరిపడా ఆస్తులను దోచుకుని దాచుకోవడమే కానీ... ఆ తరాల మధ్య ప్రేమలను పట్టించుకోడు జగన్. అందుకే చెల్లెళ్లను దూరంగా పెట్టాడు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత దుర్మార్గమైనదో, దీనికి ఎంతమంది బలయ్యారో ఈ ప్రకటన చూస్తే తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేసే బాధ్యత నాది.' అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.






Also Read: Sharmila : తల్లికిచ్చిన మాటను కూడా తప్పారు - జగన్ మానసిక స్థితిపై ఆందోళన - షర్మిల సంచలన వ్యాఖ్యలు