BJP Chief JP Nadda Key Comments: దేశంలోని ప్రతిపక్ష పార్టీలు కులతత్వ, కుటుంబ రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాయని, బీజేపీ మాత్రం అభివృద్ధి రాజకీయాలు చేస్తోందన్నారు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. తెలంగాణలోని కొత్తగూడెం, మహబూబాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ శ్రేణులు ఉద్ధేశించి జగత్ ప్రకాశ్‌ నడ్డా మాట్లాడారు. మూడోసారి మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తెలంగాణతోపాటు యావత్‌ దేశం అవకాశం కల్పించిందన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో తెలంగాణను అవినీతి కూపంగా మార్చేశారని దుయ్యబట్టిన నడ్డా.. బీజేపీతోనే రాష్ట్ర, దేశాభివృద్ధి సాధ్యమన్నారు.


కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు సంబంధించిన ఫేక్‌ వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తోందని, వీటికి ప్రజలే సరైన బుద్ధి చెబుతారన్నారు. ఎన్‌డీఏ కూటమిని నుంచి ప్రధానిగా మోదీని తాము నిర్ణయించుకున్నామని.. మరీ I.N.D.I.A కూటమి నుంచి ప్రధాని ఎవరని ఆయన ప్రశ్నించారు. ఎన్‌డీఏ కూటమి ప్రజా సేవ కోసం ఏర్పాటైందని.. అహంకార కూటమి అధికారం కోసం మాత్రమే ఏర్పాటైందన్నారు. మోదీ అవినీతిని నిర్మూలించడంలో బిజీగా ఉన్నారని.. కూటమి నేతలు మాత్రం అవినీతి పరులను రక్షించడంలో బిజీగా ఉన్నారని దుయ్యబట్టారు. యూపీఏ హయాంలో రోజుకో అవినీతి కేసు వెలుగులోకి వచ్చేదని.. పదేళ్ల ఎన్‌డీఏ హయాంలో ఒక్క అవినీతి కేసు కూడా లేదన్నారు. మోడీ ప్రభుత్వం చెప్పిందీ, చెప్పనిదీ కూడా చేస్తోందన్నారు.


I.N.D.I.A  కూటమి రాజవంశ, అవినీతి పార్టీల సమూహమన్న నడ్డా.. కూటమి నేతల్లో సగం మంది జెల్లో ఉంటే.. సగం మంది బెయిల్ పై బయట ఉన్నారని విమర్శించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి.. ప్రతి సీటుపై కమలం వికసించడం అవసరమన్నారు. గతంలో వాగ్ధానం చేసినట్టుగానే అయోధ్యలో రామలల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారన్నారు. జమ్మూ కశ్మిర్‌ నుంచి ఆర్టికల్‌ 370ని తొలగించడం ద్వారా బీజేపీ బలమైన దేశంగా గుర్తింపు పొందిందన్నారు. దీంతో ఒకే గుర్తు, ఒకే రాజ్యాంగం, ఒకే ప్రధాని అనే సంకల్పాన్ని బలపర్చినట్టు అయిందన్నారు. కాంగ్రెస్‌ పదేళ్ల పాలనలో నిరాశ, నిస్పృహతో నిండిన ప్రభుత్వం ఉండేదని, ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదన్నారు. గతంలో ప్రధానితో చర్చలు జరిపేందుకు ఉగ్రవాదులను ఆహ్వానిస్తే.. ఎన్‌డీఏ హయాంలో అగ్రదేశాధినేతలు ప్రధానితో చర్చలు జరుపుతున్నారన్నారు. 


అవినీతి కూపంగా యూపీఏ పాలన


యూపీఏ పాలన అవినీతి కూపంగా మారిందన్న జేపీ నడ్డా.. పదేళ్లలో 2జీ, 3జీ, బొగ్గు కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయని విమర్శించారు. జలాంతర్ఘామి కుంభకోణం వంటివి దేశ ప్రతిష్టను మంటగలిపాయని విమర్శించారు. పదేళ్లలో మోదీ నేతృత్వంలో అవినీతికి ఆస్కారం లేకుండా పాలన సాగిందన్నారు. 70 ఏళ్లుగా గిరిజనుల గురించి ఎవరూ పట్టించుకోలేదని, ప్రధాని మోదీ గిరిజనుల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు. తెలంగాణలోని రామప్ప దేవాలయాన్ని యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చడంలో ప్రధాని కీలక పాత్ర పోషించారన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో గిరిజనుల ఆత్మగౌరవ దినోత్సవాన్ని ప్రకటించబడిందన్న విషాన్ని జేపీ నడ్డా గుర్తు చేశారు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని, ఏకలవ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశామని, గిరిజనులు ప్రధాన స్రవంతితో విలీనం చేసేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. గిరిజన సంఘం కోసం సమ్మక్క, సారక్క సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్శిటీని స్థాపించిన విషయాన్ని జేపీ నడ్డా గుర్తు చేశారు. 


బలమైన ఆర్థిక వ్యవస్థగా పురోగామి


భారత్‌ గడిచిన ఐదేళ్లలో బలమైన ఆర్థిక వ్యవస్థగా పురోభివృద్ధి సాధించిందని జేపీ నడ్డా పేర్కొన్నారు. అనేక దేశాలో ప్రస్తుతం ఆర్థిక మాంద్యంతో సతమతమవుతుంటే.. భారత ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి ఐదో స్థానానికి ఎగబాకిందన్నారు. మోదీ నాయకత్వంలో 25 కోట్ల మంది ప్రజలు దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్నారన్న నడ్డా.. నీతి అయోగ్‌ నివేదిక కూడా దీన్ని దృవీకరించిందన్నారు. ప్రధానిగా మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత.. దేశ ఆర్థిక వ్యవస్థ ఐదో స్థానం నుంచి మూడో స్థానానికి చేరుకోవడం తథ్యమన్నారు. భారతదేశం నుంచి ఎలక్ట్రానిక్స్ లో ఎగుమతులు పెరిగాయని, ఔషద ఎగుమతులు 138 శాతం పెరిగిన విషయాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు.


ప్రపంచంలోనే అత్యంత చౌకైన, అత్యంత ప్రభావంతమైన మందులు భారత్‌లో తయారవుతున్నాయన్న నడ్డా.. ఆటో మొబైల్స్‌ రంగంలో కూడా భారత్‌ జపాన్‌ను అధిగమించిందన్నారు. పదేళ్ల క్రితం వరకు మొబైల్‌ పోన్లు చైనా, తైవాన్‌లో తయారు చేయబడ్డాయని, ఇప్పుడు భారత్‌లోనే తయారు చేస్తున్నారన్నారు. మేడ్‌ ఇన్‌ ఇండియా అని ఆయా ఫోన్లపై ఉంటోందంటే.. మోదీ తీసుకున్న సంస్కరణల ఫలితమేనని పేర్కొన్నారు. దేశాన్ని బలోపేతం చేసేందుకు మోదీ ప్రభుత్వం.. గ్రామాలు, పేదలు, యువత, దళితులు, అణగారిన వర్గాలు అభ్యున్నతికి కృషి చేసిందన్నారు. 2014కి ముందుకు పంచాయతీలు అభివృద్ధికి రూ.2.5 నుంచి మూడు లక్షల వచ్చేవని, మోదీ ప్రభుత్వంలో ఈ మొత్తాన్ని ఐదు కోట్లకు పెంచారన్నారు. ప్రస్తుతం 1.5 లక్షలకుపైగా పంచాయతీలకు ఆఫ్టికల్‌ ఫైబర్‌ అనుసంధానం చేయడంతోపాటు రెండు లక్షల పంచాయతీల్లో ఉమ్మడి సేవా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారన్నారు.


ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన కింద దేశంలోని 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలను అందిస్తున్నామన్నారు. 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించి మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత బీజేపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద ఐదు లక్షల వరకు ఉచిత చికిత్స అందించేలా భీమా సదుపాయాన్ని ప్రజలకు కల్పించామని, కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద దేశంలోని 11 కోట్ల 78 లక్షల మంది రైతుల ఖాతాలకు ఏటా ఆరు వేలు చొప్పున చెల్లిస్తున్నామన్నారు.


ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద నాలుగు కోట్ల పక్కా ఇళ్లు నిర్మించామన్న నడ్డా.. వచ్చే ఐదేళ్లలో మరో మూడు కోట్ల కొత్త ఇళ్లను నిర్మిస్తామన్నారు. ఉజ్వల పథకం కింద పది కోట్లకు పైగా గ్యాస్‌ కనెక్షన్లు పంపిణీ చేశామన్నారు. తెలంగాణకు పన్ను, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ వాటాను మూడు రెట్లు పెంచేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేసిందన్న నడ్డా.. వరంగల్‌, కరీంనగర్‌ను స్మార్ట్‌ సిటీలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇందుకోసం రూ.2700 కోట్ల కేటాయించినట్టు తెలిపారు. వరంగల్‌లో కాకతీయ పేరుతో ప్రధాన మంత్రి టెక్స్‌టైల్‌ పార్క్‌ను కూడా ప్రారంభించారని, రైల్వే ట్రాక్‌లకు బడ్జెట్‌ను పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. సికింద్రాబాద్‌ - మహబూబ్‌నగర్‌ విద్యుద్ధీకరణ ప్రాజెక్టుకు రూ.1410 కోట్లు కేటాయించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. 


ఆస్తులు లాక్కునే ప్రణాళికలో ఆ పార్టీలు


బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు అవినీతికి ప్రాధాన్యతనిస్తున్నాయన్నా జేపీ నడ్డా.. ఆ రెండు పార్టీలు ఉద్ధేశాలు సరిగా లేవన్నారు. ప్రజలు జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తిని లాక్కుకునేందుకు పన్నాగాన్ని ఆ పార్టీలు పన్నాయన్నారు. ఓబీసీ, షెడ్యూల్డ్‌ కులాలు, తెగలు, దళితులు, గిరిజనులు నుంచి రిజర్వేషన్లు లాక్కుని మత ప్రాతిపదికన నిర్ధిష్ట వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం యోచిస్తోందని విమర్శించారు. మత ప్రాతిపదికన ఎవరికీ రిజర్వేషన్లు ఇవ్వబోమని, కులం, వెనుకుబాటుతనం ఆధారంగా మాత్రమే రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. దురహంకార ఇండియా కూటమి అవినీతిపరులు, అవకాశవాదుల కూటమి అని విమర్శించారు.


లాలూ దాణా కుంభకోణం, అరవింద్‌ కేజ్రీవాల్‌, కవిత మద్యం కుంభకోణం, స్టాలిన్‌ ప్రభుత్వం ఇసుక కుంభకోణం, మమతా బెనర్జీ మంత్రులు టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ స్కామ్స్‌ చేశారన్నారు. రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ, చిందంబరం, కార్తీ చిదంబరం, సంజయ్‌ సింగ్‌తోపాటు అనేక రాష్ట్రాల్లోని మంత్రులు జైల్లోగానీ, బెయిల్‌లో గానీ ఉన్నారని విమర్శించారు. సమావేశంలో జేపీ నడ్డాతోపాటు బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె లక్ష్మణ్‌, తెలంగాణ ఇన్‌చార్జ్‌ పి సుధాకర్‌ రెడ్డి, కొత్తగూడెం అభ్యర్థి టి వినోద్‌ రావు, మహబూబాబాద్‌ అభ్యర్థి ప్రొఫెసర్‌ అజ్మీరా సీతారామన్‌ నాయక్‌, ఇతర నాయకులు ఉన్నారు.