AP Share In Electoral Bonds?: ఎలక్టోరల్‌ బాండ్లను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకున్న ఫండింగ్‌ స్కీమ్‌గా దీన్ని పేర్కొంటారు. దీనికి ఎక్కడి నుంచి ఎలా నిధులు వస్తాయో ఎవరికీ తెలియదు. వచ్చే నిధులను ఆయా పార్టీలు వినియోగించుకుంటాయి. అనేక సార్లు బ్లాక్‌ మనీ కూడా ఈ బాండ్ల రూపంలో వస్తాయి. ఖాతాలో పడగానే అది వైట్‌గా మారిపోతుంది. అటువంటి ఎలక్టోరల్ బాండ్లను రాజ్యాంగ వ్యతిరేకంగా పేర్కొంటూ సుప్రీంకోర్టు వాటిని రద్దు చేయాలని తీర్పును ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ, తెలుగుదేశం పార్టీలకు ఎంతెంత మొత్తం ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 


ఏపీ వాటా రూ.529 కోట్లు


ఎలక్టోరల్‌ బాండ్ల విధానం అమలులోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు ఇప్పటి వరకు రూ.529.04 కోట్లు బాండ్ల రూపంలో వచ్చాయి. ఇందులో అధికార వైసీపీకి రూ.382.44 కోట్లు రాగా, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి రూ.146 కోట్లు వచ్చాయి. ఇందులో సంవత్సరాలు వారీగా తీసుకుంటే 2017-18లో ఇరు పార్టీలకు రూపాయి కూడా రాలేదు. 2018-19 ఏడాదిలో వైసీపీకి రూ.99.84 కోట్లు రాగా, టీడీపీకి రూ.27.5 కోట్లు, 2019-20లో వైసీపీకి రూ.74.35 కోట్లు, టీడీపీకి రూ.81.6 కోట్లు, 2020-21లో వైసీపీకి రూ.96.25 కోట్లు రాగా, టీడీపీకి రూపాయి కూడా రాలేదు. 2021-22లో వైసీపీకి రూ.60, టీడీపీకి రూ.3.5 కోట్లు, 2022-23లో వైసీపీకి రూ.52 కోట్లు రాగా, టీడీపీకి రూ.34 కోట్లు వచ్చాయి. మొత్తంగా గడిచిన ఆరేళ్లలో (2023 వరకు) వైసీపీకి రూ.382.44 కోట్లు బాండ్ల రూపంలో రగా, టీడీపీకి రూ.146 కోట్లు వచ్చాయి. 


మూడు రకాలుగా వచ్చే విరాళాలు


రాజకీయ పార్టీలకు మూడు రకాలుగా నిధులు సమకూరుతుంటాయి. వ్యక్తులు ఇచ్చే విరాళాలు. ఇలా వ్యక్తులు ఇచ్చే విరాళాలను రూ.20 వేలకుపైగా ఉంటే పార్టీలు వెల్లడించాల్సి ఉంటుంది. రెండోది ఫ్రువెడెన్షియల్‌ ట్రస్ట్‌ బాండ్లు. ఇది మధ్యస్తంగా చెబుతారు. ఒక వ్యక్తి లేదా సంస్థ ప్రుడెన్షియల్‌ ట్రస్ట్‌కు విరాళం ఇవ్వవచ్చు. ఇలాంటివన్నీ సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలకు ఎక్కువగా వెళుతుంటాయి. మూడోది ఎలక్టోరల్‌ బాండ్లు. సంస్థ లేదా వ్యక్తి స్టేట్‌ బ్యాంక్‌లో ప్రాథమిక వివరాలు చెప్పి ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసి పార్టీలకు ఇస్తారు. ఈ విరాళం ఎవరిచ్చారన్నది పార్టీలు ప్రకటించాల్సిన అవసరం లేదు. అంటే బ్లాక్‌ మనీ మొత్తం రాజకీయ పార్టీలకు ఈ రూపంలో వెళ్లేందుకు అవకాశం ఉంది. దీన్నే ప్రస్తుతం సుప్రీంకోర్టు తప్పుబట్టింది.