Andhra Pradesh Elections 2024: నా ఎస్సీ, నాఎస్టీ, నా మైనార్టీ అని ఒకరంటే....మా పార్టీయే బలహీన వర్గాల పార్టీ అని మరొకరు అంటారు. ఇలా ఎవరికి వారు మే ఉద్దరించామంటే...మే ఉద్దరించామంటూ ప్రసంగాలు దంచి కొడుతున్నారు. సీట్ల కేటాయింపుల్లో కూడా లెక్కలు వేసుకొని బరిలోకి దిగారు. గత ఎన్నికల లెక్కలు పరిశీలిస్తే ఎంత మంది ఎన్నికల పరీక్షలో విజయం సాధించి అసెంబ్లీలో అధ్యక్షా అన్నారో పరిళీస్తే... 


రెడ్డిరాజ్యం
గత ఎన్నికల్లో రిజర్వ్‌డు స్థానాలు పోనూ జనరల్‌ స్థానాల్లో అత్యధికంగా గెలిచింది రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలే. మొత్తం 175 మంది ఎమ్మెల్యేల్లో 48 మంది రెడ్లు గెలుపొందారు. జగన్ హవా నడిచిన గత ఎన్నికల్లో ఆ పార్టీ తరపున రెడ్లకు ఇచ్చిన సీట్లలో ఒక్క ఉరవకొండ(Uravakonda) నుంచి పోటీ చేసిన విశ్వేశ్వర్‌రెడ్డి తప్ప అందరూ విజయం సాధించారు. గెలిచిన మొత్తం వైసీపీ(YCP) నుంచి గెలిచిన వారే. తెలుగుదేశం(Telugu Desam) నుంచి ఒక్క రెడ్డి సామాజికవర్గం నేత గెలవలేదు. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ తరఫున రెడ్డి ఎమ్మెల్యే లేకపోవడం ఇదే తొలిసారి. రాయలసీమ నుంచి 31 మంది, కోస్తా జిల్లాల నుంచి 17 మంది విజయం సాధించారు. 


టీడీపీకి కమ్మనైన సహకారం
కమ్మ సామాజికవర్గానికి చెందిన 17 మంది అసెంబ్లీకి ఎన్నికవ్వగా... వీరిలో అధికారపార్టీకి చెందిన వారు ఆరుగురు ఉండగా... తెలుగుదేశానికి చెందిన 11మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం బీసీలు 34 మంది ఎన్నికవ్వగా... వైసీపీ(YCP) నుంచి 28 మంది టీడీపీ నుంచి ఆరుగురు బలహీనవర్గాలకు(BC) చెందిన ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. పొలినాటి వెలమ నుంచి నలుగురు, కొప్పుల వెలమ నుంచి ఐదుగురు ఎన్నికయ్యారు. 


తూర్పు కాపు సామాజాకి వర్గానికి  చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలయ్యారు. కళింగ వర్గం నుంచి ఇద్దరు, నలుగురు యాదవ్‌లు, ముగ్గురు గౌడ్‌లు, ముగ్గురు మత్స్యకారులు, రెడ్డిక ఒకరు, శెట్టిబలిజ ఒకరు, గవర నుంచి ఒకరు, రజక, బోయ, లింగాయత్ నుంచి ఒక్కొక్కరు గెలవగా... కురుబ సామాజికవర్గం నుంచి ఇద్దరు విజయం సాధించారు. 


వైసీపీకి 'కాపు'కాశారు
రాష్ట్రవ్యాప్తంగా 25 మంది కాపులు గెలుపొందగా...వారిలో అత్యధికంగా 22 మంది వైసీపీ తరపున ముగ్గురు టీడీపీ తరపున విజయం సాధించారు. ఇక ఎస్సీలు, ఎస్టీలు పూర్తిగా జగన్ పక్షానే నిలిచారు. మొత్తం 29 ఎస్సీ(SC) నియోజకవర్గాలు ఉంటే...గంపగుత్తగా 27 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు వైసీపీ నుంచే గెలిపొందారు. టీడీపీకి, జనసేనకు చెరో ఒక్కస్థానం దక్కాయి. ఇక ఎస్టీ(ST) స్థానాలు మొత్తం వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. మొత్తం ఏడు నియోజకవర్గాలను జగన్ స్వీప్‌ చేశారు. అలాగే విజయం సాధించిన నలుగురు ముస్లిం(Muslims)లు సైతం వైసీపీ నుంచే గెలిచారు.


వీరేగాక ఇతరవర్గాలకు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా....వైసీపీ నుంచి 9 మంది, టీడీపీ నుంచి ఒకరు విజయం సాధించారు. నలుగురు క్షత్రియులు విజయం సాధించగా...ముగ్గురు వైసీపీ నుంచి ఒకరు టీడీపీ నుంచి గెలుపొందారు. వైశ్యుల్లో ముగ్గురు వైసీపీ ఒకరు టీడీపీ నుంచి విజయం సాధించారు. బ్రాహ్మణుల్లో ఇద్దరు, వెలమ నుంచి ఒకరు వైసీపీ నుంచి గెలుపొందారు. మొత్తంగా చూస్తే రెడ్లు-48, బీసీ- 34, ఎస్సీలు-29, కాపులు-25, కమ్మ-17, ఎస్టీలు-7, ముస్లిం-4 సహా ఇతర సామాజికవర్గాలకు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. అన్ని సామాజికవర్గాలు గత ఎన్నికల్లో వైసీపీ పక్షాన నిలిచాయి.