Budget 2025 Highlights: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. మొత్తం 50.65 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను రూపొందించారు. ఇందులో విద్యారంగానికి ఏకంగా 1.29 లక్షల కోట్లు కేంద్రం కేటాయించింది. గత బడ్జెట్‌లో రూ.1.21 లక్షల కోట్లతో పోల్చితే మొత్తం 6.6 శాతం బడ్జెట్‌ను కేంద్రం పెంచింది. కేంద్రం విద్యారంగానికి కేటాయించిన మొత్తంలో పాఠశాల విద్యకు ఏకంగా రూ.78,572.10 కోట్లు కేటాయించడం విశేషం. గత బడ్జెట్‌లో ఈ మొత్తం రూ.73,008 కోట్లుగా ఉంది. ఇక ఉన్నత విద్యకు రూ.50,077.95 కోట్ల బడ్జెట్‌ను కేంద్రం కేటాయించింది. 


విద్యారంగంలో ఏఐ వినియోగం, ఐదేళ్లలో అదనంగా 75వేల మెడికల్ సీట్లు, బిహార్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, పదేళ్లలో ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్య రెట్టింపు, 50వేల ప్రభుత్వ పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ శిక్షణ కోసం ఏర్పాట్లు.. ఈసారి బడ్జెట్‌లో విద్యారంగానికి సంబంధించి కీలక అంశాలుగా నిలిచాయి.


విద్యారంగానికి బడ్జెట్‌లో ప్రాధాన్యం..


కేంద్ర బడ్జెట్ 2025లో విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ముఖ్యంగా విద్య, నైపుణ్యాభివృద్ధికి ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌లో ప్రాధాన్యమిచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీలలో అదనపు మౌలిక సదుపాయాలు కల్పించాలని సీతారామన్‌ ప్రతిపాదించారు. 10 సంవత్సరాల కిత్రం దేశంలో ఐఐటీ సీట్ల సంఖ్య 65 వేలు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 1.35 లక్షలకు చేరింది. అంటే దాదాపు 100 శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అదనపు మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. ముఖ్యంగా 2014 తర్వాత ప్రారంభించిన 5 ఐఐటీలలో అదనంగా 6,500 మంది విద్యార్థులు చదువుకునేలా ప్రణాళికలు రచించారు. 


ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీపై కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. రూ.500 కోట్లతో 'సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(COEAI)'  కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని కేంద్రం నిర్ణయించింది. విద్యా విధానం, పరిశోధనల్లో ఏఐని అనుసంధానించేందుకు ఇది తోడ్పాటునందించనుంది.


మెడికల్ ఎడ్యుకేషన్ పైనా కేంద్రం వైద్య విద్య పైనా కేంద్రం దృష్టిసారించింది. రానున్న 10 సంవత్సరాల్లో దేశంలో అదనంగా 1.1 లక్షల యూజీ, పీజీ వైద్య సీట్లను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏడాదికి కనీసం 10 వేల సీట్లు చొప్పున రానున్న 5 సంవత్సరాల్లో 75 వేల మెడికల్‌ సీట్లను పెంచాలని నిర్ణయించింది. 


యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉన్నత విద్యలో చేయూత కోసం పెట్టుబడులపై దృష్టిసారించడం కోసం దేశవ్యాప్తంగా ఐదు 'నేషనల్‌ సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌(NCEC)' కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. ‘మేక్‌ ఇన్‌ ఇండియా (Make in Indai), మేక్‌ ఫర్‌ ది వరల్డ్‌(Make for the World)’ సాధనకు కావాల్సిన నైపుణ్యాలను నేర్చుకునేందుకు, అందుకనుగుణంగా యువతను సన్నద్ధం చేయడానికి ఇవి తోడ్పడనున్నాయి. సాంకేతిక పరిశోధనల్ని ప్రోత్సహించేందుకు వీలుగా రానున్న ఐదేళ్లల్లో ఐఐటీ, ఐఐఎస్‌సీలకు 10 వేల ఫెలోషిప్‌‌లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.


యువతకు నైపుణ్యాలు నేర్పించి.. ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 'పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌(PM Internship Scheme)'ను గతేడాది తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిని మరింత బలోపేతం చేయనున్నారు. రాబోయే పదేళ్లలో 4.1 కోట్ల మందికి ఉపాధి కల్పనే ధ్యేయంగా కేంద్రం ముందుకెళ్తోంది.


కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తంగా రూ.50,65,345 కోట్ల కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రెవెన్యూ వసూళ్లను రూ.రూ.34,20,409 కోట్లుగా అంచనా వేశారు. మూలధన వసూళ్లలో రూ.16,44,936 కోట్లుగా ఉండబోతున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. బడ్జెట్‌ 2025-26 సమగ్ర స్వరూపం కింది విధంగా ఉంది.