యూజీసీ నెట్ 2023 పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 13న విడుదల కానున్నాయి. ఈ మేరకు యూజీసీ ఛైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్ ఏప్రిల్ 12న ట్వీట్ చేశారు.ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఫలితాలు వెలువడిన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. అభ్యర్థులు అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. 


యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2022 (యూజీసీ- నెట్‌) ప్రిలిమినరీ ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మార్చి 23న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఏప్రిల్‌ 6న ఫైనల్ కీని విడుదల చేసింది.


యూజీసీనెట్ పరీక్షను దేశవ్యాప్తంగా 663 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 83 సబ్జెక్టుల్లో ఫిబ్రవరి 21 నుంచి మార్చి 16 వరకు నిర్వహించారు. మొత్తం 8,34,537 అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. తుది ఆన్సర్ కీ వెలువడిన నేపథ్యంలో త్వరలోనే ఫలితాలు కూడా వెలువడే అవకాశం ఉంది. 


దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తుంటుంది. కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. పీజీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏటా రెండుసార్లు (జూన్, డిసెంబరు) యూజీసీ నెట్ పరీక్షలకు ఎన్టీఏ నోటిఫికేషన్ విడుదల చేస్తారు.



ALso Read:


సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌ యూజీసీ- నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(నెట్‌) డిసెంబర్‌-2022/ జూన్‌-2023 దరఖాస్తు గడువు వారం రోజులు పొడిగించినట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. సీఎస్‌ఐఆర్‌ యూజీసీ-నెట్‌ దరఖాస్తు గడువు ఏప్రిల్ 10తో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే వివిధ కార‌ణాల వల్ల చాలా మంది అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించలేకపోయారు. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఏప్రిల్‌ 17 వ‌ర‌కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత ఏప్రిల్ 19 నుంచి 25 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించింది. అయితే పరీక్ష తేదీల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని.. ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే జూన్‌ 6, 7, 8 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ స్పష్టం చేసింది.
పూర్తివివరాల కోసం క్లిక్  చేయండి.. 


'టోఫెల్‌' పరీక్షలో కీలక మార్పులు, జులై నుంచి అమల్లోకి!
విదేశాల్లో ఉన్నతవిద్య కోసం వెళ్లాలనుకునే వారిలో 'ఇంగ్లిష్' నైపుణ్యాలను పరీక్షించేందుకు నిర్వహించే టోఫెల్(టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) పరీక్షలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఈ పరీక్ష పూర్తయ్యేందుకు మూడు గంటలకు పైగా సమయం పట్టగా.. ఇకపై రెండు గంటల్లోపే (గంటా 56 నిమిషాల్లో) పూర్తయ్యేలా కుదించారు. అంతేకాకుండా ఈ పరీక్ష పూర్తయిన వెంటనే విద్యార్థులు తమ అధికారిక స్కోర్ విడుదలయ్యే తేదీని సైతం తెలుసుకోవచ్చని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ వెల్లడించింది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్స్‌కు సంబంధించిన టోఫెల్, గ్రాడ్యుయేట్ రికార్డు ఎగ్జామినేషన్స్ రాసేవారికి అనుకూలంగా ఉండేలా కొన్ని మార్పులు చేసినట్లు ఈటీఎస్ సీఈవో అమిత్ సేవక్ వెల్లడించారు. ఈ మార్పులు జులై 26 నుంచి అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..