TG ICET Result: తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీజీఐసెట్-2024 ప్రవేశ పరీక్ష ఫలితాలను వెల్లడించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 14న మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్ష ఫలితాల ఆధారంగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఫుల్‌టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 


TG ICET 2024 ర్యాంక్ కార్డు ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి...


➥ ఐసెట్ ర్యాంకు కార్డు కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి- https://icet.tsche.ac.in/


➥ అక్కడ హోంపేజీలో కనిపించే 'Download Rank Card' అనే లింక్‌ మీద క్లిక్ చేయాలి.


➥ అక్కడ లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి 'View Rank Card' బటన్ మీద క్లిక్ చేయాలి. 


➥ వివరాలు నమోదుచేయగానే ఐసెట్ ర్యాంక్ కార్డు కంప్యూటర్ స్క్రీన్ మీద దర్శనమిస్తుంది.


➥ అభ్యర్థులు ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.


ఐసెట్ ర్యాంకు కార్డుల కోసం వెబ్‌సైట్..


రాష్ట్రంలో జూన్ 5, 6 తేదీల్లో మూడు సెషన్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 116 పరీక్ష కేంద్రాల్లో ఐసెట్-2024 ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు రెండు రాష్ట్రాల నుంచి 86,156 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 77,942 మంది విద్యార్థులు ఐసెట్ పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 90.47 శాతం హాజరు నమోదైంది.  జూన్ 5న మొదటి సెషన్‌కు 115 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 25,931 మంది హాజరయ్యారు. రెండో సెషన్‌కు 116 కేంద్రాల్లో 26,298 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఇక జూన్‌ 6న ఉదయం జరిగిన చివరి సెషన్‌లో 28,256 మంది విద్యార్థులకుగాను 25,662 మంది పరీక్షకు హాజరయ్యారు. 


తెలంగాణలో 16, ఏపీలో 4 సెంటర్లలో ఐసెట్ పరీక్ష నిర్వహించారు. తెలంగాణలో హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటలోని కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఇక ఏపీలో కర్నూలు, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాల్లో ఐసెట్ పరీక్ష నిర్వహించారు. ఐసెట్ పరీక్షకు సంబంధించిన ప్రాథ‌మిక ఆన్సర్ కీని జూన్ 8న విడుద‌ల చేశారు. ప్రాథ‌మిక కీపై జూన్ 9 సాయంత్రం 5 గంటల వరకు అభ్యంత‌రాల‌ు స్వీకరించారు. ఈ ప్రక్రియ ముగియడంతో ఫలితాలను వెల్లడికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


పరీక్ష, అర్హత మార్కులు ఇలా..
తెలంగాణ ఐసెట్ - 2024 ప్రవేశ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించారు. పరీక్షలో 200 మార్కులకుగాను 200 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. పరీక్షకు 150 నిమిషాల సమయం కేటాయించారు. పరీక్షలో మూడు సెక్షన్లు (సెక్షన్-ఎ, బి, సి) ఉంటాయి. వీటిలో సెక్షన్-ఎ: అనలిటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-బి: మ్యాథమెటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-సి: కమ్యూనికేషన్  ఎబిలిటీ-50 ప్రశ్నలు-50 మార్కులు కేటాయించారు.
➥ ఐసెట్ పరీక్షలో కనీస అర్హత మార్కులను 25 శాతంగా నిర్ణయించారు. అంటే 200 మార్కులకుగాను 50 మార్కులను అర్హతగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి అర్హత మార్కులు లేవు.  




మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..