TS EAPCET 2024 Exams: తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించనున్న TS EAPCET -2024 పరీక్షలు మే 7న ప్రారంభమయ్యాయి. మే 11 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఇందులో మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మా విభాగాలకు; మే 9 - 11 వరకు ఇంజినీరింగ్‌ విభాగానికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు మొదటి సెషన్‌లో, మ‌ధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించ‌నున్నారు. ఫలితాలను మే నెలాఖరులో విడుదల చేయనున్నారు. ఎప్‌సెట్‌ పరీక్షల్లో తొలిసారిగా ఫేషియల్‌ రికగ్నిషన్‌ సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నారు. విద్యార్థుల సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్లను అధికారులు ఏర్పాటు చేశారు. 74169 23578, 74169 08215 నంబర్లను సంప్రదించవచ్చు. కాగా గతంలో ఎంసెట్‌గా ఉన్న పేరును ఈసారి ఎప్‌సెట్‌గా మార్చి పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

  


గతంతో పోలిస్తే.. ఈ ఏడాది ఎప్‌సెట్‌కు 35 వేలమంది అదనంగా దరఖాస్తు చేసుకున్నారు. పెరిగిన దరఖాస్తులను దృష్టిలో ఉంచుకుని 20 పరీక్షాకేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇంజినీరింగ్‌కు 166, అగ్రికల్చర్‌ ఫార్మసీకి 135 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలుగు, ఉర్దూల్లో ఏవైనా పొరపాట్లుంటే ఇంగ్లిష్‌ ప్రశ్నపత్రాలనే ప్రామాణికంగా తీసుకోనున్నారు. విద్యార్థులు ఇంగ్లిష్‌ ప్రశ్నలను ఒకటికి రెండుసార్లు చదివి సమాధానం ఇవ్వాలి. 


పరీక్ష విధానం..
మొత్తం 160 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్/ బయాలజీ నుంచి 80 ప్రశ్నలు- 80 మార్కులు, ఫిజిక్స్ నుంచి 40 ప్రశ్నలు-40 మార్కులు, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు-40 మార్కులు. ప్రతిప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉండవు. ఇంటర్ మొదటి సంవత్సరం, చివరి సంవత్సరం నుంచి 100 శాతం సిలబస్‌తో పరీక్ష నిర్వహించనున్నారు. ఇంగ్లిష్‌, తెలుగు, ఉర్దూ మూడు భాషల్లో ఎప్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఉర్దూ మీడియం వారికి చివరి రోజు అయిన మే 12న పరీక్ష ఉంటుందని, వీరికి ఉర్దూ/ఇంగ్లిష్‌ భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు. 


పరీక్ష కేంద్రాలివే...
ఎప్‌సెట్ పరీక్షల కోసం రెండు రాష్ట్రాలు కలిపి మొత్తం 135 కేంద్రాల్లో అగ్రికల్చర్, ఫార్మసీ; 166 కేంద్రాల్లో ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణలో హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఏపీలో కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరులలోని కేంద్రాల్లో పరీక్షలు జరుగనున్నాయి. 


విద్యార్థులకు ముఖ్య సూచనలు..


➥ ఈసారి పరీక్షల్లో తొలిసారిగా ఫేషియల్ రికగ్నిషన్ విధానం అమలుచేయనున్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తులో జతచేసిన ఫొటోను, అభ్యర్థి ముఖంతో సరిపోల్చి లోపలికి అనుమతిస్తామన్నారు.


➥ పరీక్ష సమయానికి 90 నిమిషాల ముందు నుంచే అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభమయ్యాక నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు.  


➥ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను పరీక్ష హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపుకార్డు లేదా కాలేజీ ఐడీ కార్డును పరీక్ష రోజు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ముఖ గుర్తింపుతోపాటు.. బయోమెట్రిక్ విధానంలో ఫోటో, కుడిచేతి వేలిముద్ర ద్వారా సరిపోల్చి లోపలికి అనుమతిస్తారు. 


➥ అభ్యర్థులు హాల్‌‌టికెట్, ఆన్‌లైన్ దరఖాస్తు పత్రంతోపాటు ఒక ఫోటో, బ్లాక్ లేదా బ్లూ పెన్ మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. 


➥ పరీక్ష హాలులో ఇన్విజిలేటర్ సమక్షంలో విద్యార్థులు హాల్‌టికెట్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది.


➥  సెల్‌ఫోన్ సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. 


➥ వాటర్ బాటిల్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. పరీక్ష కేంద్రంలో ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి.


➥ అభ్యర్థులు తమ చేతులపై గోరింటాకు, పచ్చబొట్లు ఉంటే అనుమతించరు. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..