తెలంగాణలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాల్లో ప్రవేశాలకు నిర్దేశించిన టీఎస్‌ ఎంసెట్‌ షెడ్యూలు ఫిబ్రవరి 24న విడుదల కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఫ్రొఫెసర్ లింబాద్రి, జేఎన్‌టీయూ హైదరాబాద్ వీసీ నర్సింహారెడ్డి ఎంసెట్ షెడ్యూలును విడుదల చేయనున్నారు. ఈ ఏడాది మే 7 నుంచి 14 వరకు ఎంసెట్‌ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. మే 7 నుంచి 11 వరకు ఇంజినీరింగ్‌ విద్యార్థులకు; మే 12 నుంచి 14 వరకు అగ్రికల్చర్‌, ఫార్మసీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు.


అయితే ఎంసెట్‌లో ఇంటర్‌ వెయిటేజీ అమలు, దరఖాస్తుకు కనీసం 45 శాతం మార్కులొచ్చి ఉండాలన్న నిబంధనలను సడలించడమా.. లేదా కొనసాగించడమా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీని గత మూడేళ్ల మాదిరిగానే ఈసారి కూడా తొలగించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం జీవో జారీ చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ జారీ నాటికి జీవో రాకుంటే తర్వాత సర్కారు జారీ చేసే జీవోను అనుసరించి వెయిటేజీపై నిర్ణయం ఉంటుందని అందులో పేర్కొననున్నట్లు తెలుస్తోంది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 70 శాతం సిలబస్ నుంచే ఎంసెట్‌లో ప్రశ్నలు వస్తాయి.


ఈ సారి సెషన్‌కు 40 వేల మంది..?
ప్రస్తుతం ఎంసెట్‌లో ఒక్కో సెషన్‌కు 29 వేల మంది విద్యార్థుల వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తున్నారు. అయితే ఈ సంఖ్యను 40 వేలకు పెంచాలని భావిస్తున్నారు. ఇదే అంశంపై టీసీఎస్‌ అయాన్‌ సంస్థతో జేఎన్టీయూ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఎంసెట్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేయడం, ప్రశ్నపత్రాల నార్మలైజేషన్‌ సమస్యను అధిగమించేందుకు ఈ ఏడాది తక్కువ సెషన్లలో పరీక్షల నిర్వహణకు యోచిస్తున్నారు. ఏటా 2.6 లక్షల మందికిపైగా విద్యార్థులు ఎంసెట్‌కు హాజరవుతున్నారు. ఒక్కో సెషన్‌కు 40 వేల మంది విద్యార్థులు హాజరైతే ఎంసెట్‌ పరీక్షలను ఐదు రోజుల్లోనే ముగించవచ్చనే ఆలోచనలో అధికారులు ఉన్నారు.


ఎంసెట్‌ కన్వీనర్‌గా డీన్‌కుమార్‌..
ఈ ఏడాది టీఎస్ ఎంసెట్ కన్వీనర్‌గా జేఎన్‌టీయూహెచ్ సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతిగా ఉన్న ప్రొఫెసర్ బి. డీన్ కుమార్‌ను నియమించారు. గత మూడేళ్లుగా ఎంసెట్ కన్వీనర్‌గా జేఎన్‌టీయూహెచ్ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్, రెక్టార్ గోవర్ధన్ కొనసాగగా.. ఈసారి డీన్ కుమార్‌ను నియమించారు. ఈయన గతంలో పరీక్షల నియంత్రణ విభాగం కంట్రోలర్‌గా, చీఫ్ ఇంజినీర్‌గా పనిచేశారు.


Also Read:


JNTUH Courses: జేఎన్టీయూలో కొత్త కోర్సులు వస్తున్నాయ్‌! ఈ ఏడాది నుంచే ప్రవేశాలు!
రానున్న విద్యాసంవత్సరంలో సరికొత్త కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు జేఎన్‌టీయూహెచ్ కసరత్తు చేస్తుంది. యూనివర్సిటీ పరిధిలో కొత్తగా అగ్రికల్చర్‌ టెక్నాలజీ, రేడియేషన్‌ ఫిజిక్స్‌ కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. వ్యవసాయ యాంత్రీకరణకు పరిశ్రమలను ప్రోత్సహించడమేగాక ఉపాధి అవకాశాలను కల్పించేందుకు అగ్రికల్చర్‌ టెక్నాలజీ కోర్సుకు రూపకల్పన చేసింది. దీంతోపాటు రేడియేషన్‌ ఫిజిక్స్‌ కోర్సును ప్రవేశపెట్టాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


డిగ్రీ పాఠ్య ప్రణాళికల్లో మార్పులు, వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు!
తెలంగాణలో డిగ్రీ విద్య స్వరూపం పూర్తిగా మారనుంది. నాణ్యమైన విద్య, ఉద్యోగావకాశాలకు అనుగుణంగా డిగ్రీ పాఠ్య ప్రణాళికల్లో మార్పులు చేయనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొపెసర్ లింబాద్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ బేగంపేట్ లోని సెస్‌లో “అత్యుత్తమ పాఠ్యప్రణాళిక అభివృద్ధి” కోసం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేసిన రెండురోజుల సదస్సు ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగించారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..