తెలంగాణలో జూనియర్‌ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశ గడువును ఇంటర్‌ బోర్డు మరోసారి పొడిగించింది. వాస్తవానికి ఆగస్టు 5తో దరఖాస్తు గడువు ముగియాల్సి ఉండగా.. ఆగస్టు 16 వరకు ప్రవేశాలు పొందవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ జులై 31న ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ప్రైవేటు కళాశాలల్లో చేరేవారు ఆలస్య రుసుం కింద రూ.500 చెల్లించాలని, ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల కళాశాలల్లో చేరేవారు మాత్రం ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకు ప్రవేశాలు పొందని వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా.. ఈ ఏడాది ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్యను పెంచేందుకు నవీన్‌మిట్టల్‌ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.


రాష్ట్రవ్యాప్తంగా 3,339 ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కాలేజీలు ఉండగా.. వీటిల్లో ఇప్పటి వరకు 3,27,202 మంది విద్యార్థులు ఇంటర్‌ ఫస్టియర్‌లో అడ్మిషన్‌ తీసుకున్నారు. గతేడాది కాలేజీల సంఖ్య 3,107 మాత్రమేకాగా.. 4,98,699 మంది విద్యార్థులు చేరారు. దీనిని బట్టి దాదాపు 1.7 లక్షల మంది విద్యార్థులు ఇంకా చేరాల్సి ఉందని తెలుస్తోంది. వారంరోజుల క్రితం వరకూ ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థుల అడ్మిషన్లు జరుగుతున్నా, ప్రవేశాల­ను బోర్డుకు చూపించలేదు. విద్యార్థుల ప్రవేశాలు ఒక­చోట, వారు చదివేది మరోచోట ఉండేలా కాలేజీలు చేస్తు­న్న మాయాజాలంపై ఇంటర్‌ బోర్డు ఉక్కుపాదం మోప­డమే ఈ ఆలస్యానికి కారణమని తెలుస్తోంది.


అడ్మిషన్లు ముగిసే నాటికి ప్రవేశాలు చూపించని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు కార్యద­ర్శి నవీన్‌ మిత్తల్‌ హెచ్చరించారు. దీంతో గత వారం లక్ష వరకూ ఉన్న అడ్మిషన్ల సంఖ్య ప్రస్తుతం 2 లక్షలు దాటింది. టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు వెలువడిన తర్వా­త ప్రభుత్వ కాలేజీల్లోనూ ప్రవేశాలు కొంత పెరిగాయి.


తెలంగాణ ఇంటర్ అకడమిక్​ ఇయర్ (​2023-24) క్యాలెండర్..
తెలంగాణలో జూనియర్ కళాశాలల అకడమిక్ ​క్యాలెండర్​ని ఇంటర్మీడియట్ బోర్డు ఏప్రిల్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిప్రకారం రాష్ట్రంలోని అన్ని జూనియర్​ కళాశాలలు జూన్​ 1న ప్రారంభమయ్యాయి.  ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం.. జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు, 2024, జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. కాగా, ఇంటర్మీడియట్ విద్య కోసం ఈ ఏడాది మొత్తం 227 పని దినాలు ఉంటాయని బోర్డు తెలిపింది.  ఇక ఫిబ్రవరి రెండో వారం నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. థియరీ పరీక్షలను మార్చి మొదటివారం నుంచి నిర్వహిస్తారు. ఏప్రిల్ 1 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు.


➥ జూనియర్ కాలేజీల పునఃప్రారంభం: 01.06.2023. 


➥ మొదటి, ద్వితీయ సంవత్సరాల ఇంటర్మీడియట్ తరగతులు: 01.06.2023.


➥ దసరా సెలవులు: 19.10.2023 - 25.10.2023.


➥ దసరా సెలవుల తర్వాత పునఃప్రారంభం: 26.10.2023.


➥ అర్ధ సంవత్సర పరీక్షలు: 20.11.2023 - 25.11.2023.


➥ సంక్రాంతి సెలవులు: 13.01.2024 - 16.01.2024.


➥ సంక్రాంతి సెలవుల తర్వాత పునఃప్రారంభం: 17.01.2024.


➥ ప్రీ-ఫైనల్ పరీక్షలు: 22.01.2024 - 29.01.2024.


➥ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు: 2024 ఫిబ్రవరి రెండవ వారం నుండి.


➥  ఇంటర్ థియరీ పరీక్షలు: 2024 మార్చి మొదటి వారం నుండి.


➥ వేసవి సెలవులు: 01.04.2024 - 31.05.2024.


➥ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు:  2024 మే చివరి వారంలో


➥ 2024-25 విద్యా సంవత్సరానికి జూనియర్ కళాశాలల పునఃప్రారంభ తేదీ: 01.06.2024.



ALSO READ:


అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును పొడిగించారు. ఆగస్టు 16 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. దరఖాస్తు గడువు జులై 31తో ముగియాల్సి ఉన్నప్పటికీ.. అభ్యర్థుల అభ్యర్థన మేరకు ప్రవేశ దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. అభ్యర్థులు ఆగస్టు 16 వరకు ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..


నవోదయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ - పరీక్ష విధానం, ఎంపిక, అర్హతల వివరాలు ఇలా!
జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరాకిగాను ఆరోతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ ఏడాది రెండు విడతల్లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 20న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ ఏడాది నవంబరు 4న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే చాలు.. ఇంటర్‌ దాకా ఉచితంగా చదువు, వసతి, భోజనం కల్పిస్తారు. బోధన కూడా అత్యున్నత ప్రమాణాల్లో ఉంటుంది. ప్రవేశ పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19న ప్రారంభంకాగా, ఆగస్టు 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.  
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..