తెలంగాణ ఇంటర్ పరీక్షల సంస్కరణల్లో భాగంగా ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఒక ఇంటర్నల్‌ పరీక్షను రద్దు చేసింది. ఈ విద్యాసంవత్సరం నుంచి ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్‌ పరీక్షను తొలగిస్తున్నట్టు ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేశారు. ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్‌ పాఠ్యాంశాలను లాంగ్వేజెస్‌ సబ్జెక్టుల్లో విలీనం చేయడం వల్ల ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్టు తెలిపారు.


మరో ఇంటర్నల్‌ అయిన ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షను యథాతథంగా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. వంద మార్కుల ఈ ఇంటర్నల్‌ పరీక్షను కాలేజీలోనే నిర్వహించి, అదే కాలేజీ లెక్చరర్లు మూల్యాంకనం చేసి, మార్కులేస్తారు. ఇది క్వాలిఫైయింగ్‌ పేపర్‌ కాగా, ఈ మార్కులను రెగ్యులర్‌ మార్కుల్లో కలపరు. 


ఈ విద్యాసంవత్సరం నుంచి ఫస్టియర్‌లో ప్రాక్టికల్స్‌ అమలుచేయనుండటంతో థియరీకి, ప్రాక్టికల్స్‌కు వేర్వేరు పాఠ్యపుస్తకాలను బోర్డు సిద్ధం చేసింది. ఇంగ్లిష్‌ సబ్జెక్టు పుస్తకాల్లో ఎథిక్స్‌ అండ్‌ హ్యుమన్‌ వ్యాల్యూస్‌ పాఠ్యాంశాలు అంతర్భాగంగా ఉండటంతో ప్రత్యేకంగా పరీక్ష అవసరం లేదని అధికారులు భావించి, ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు.


ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌, ఈ ఏడాది నుంచే అమలు..
తెలంగాణలోని ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలకు బోర్డు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ సబ్జెక్టులోనూ ప్రాక్టికల్స్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటి వరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులకు మాత్రమే ప్రాక్టికల్స్ ఉండేవి. కొత్త విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ అమలు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. విద్యాసంవత్సరం చివరిలో ఇంగ్లిష్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షకు 20 మార్కులు కేటాయించనున్నారు. దీంతో ఇప్పటివరకు ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో ఇంగ్లిష్‌ థియరీ పరీక్షను గతంలో మాదిరిగా 100 మార్కులకు కాకుండా, 80 మార్కులకు నిర్వహించనున్నారు. థియరీలో మార్కులు తగ్గినందున ఆ సబ్జెక్టులో కొన్ని పాఠాలను తొలగిస్తూ సిలబస్‌ను తగ్గించారు. 


మూసపద్ధతిలో ఇంగ్లిష్‌లో పరీక్షలు నిర్వహించడం కాకుండా, ఇంగ్లిష్‌లో ప్రాక్టికల్స్‌ నిర్వహించి, విద్యాసంవత్సరం చివరిలో ప్రయోగ పరీక్షలను నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇంటర్మీడియట్‌ బోర్డు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ కోసం ప్రత్యేక సిలబస్‌ను రూపొందించి, ఆ సిలబస్‌కు అనుగుణంగా విద్యాసంవత్సరం పొడవునా విద్యార్థులతో ప్రాక్టికల్స్‌ను చేయించడం అన్నది ఈ కొత్త విధానంలో ప్రధానాంశం.


ప్రాక్టికల్స్‌ కోసం ప్రత్యేకంగా 90 పేజీలతో కూడిన ‘ఏ హ్యాండ్‌బుక్‌ ఆఫ్‌ కమ్యూనికేటివ్‌ ఇంగ్లిష్‌-1’ పేరిట ప్రత్యేక సిలబస్‌తో ఇంటర్మీడియట్‌ బోర్డు కొత్త పుస్తకాన్ని రూపొందించింది. ఆ పుస్తకాలు ముద్రణను పూర్తిచేసుకొని జూనియర్‌ కళాశాలలకు చేరాయి. ఇప్పటి వరకు ఇంటర్మీడియట్‌ సెకండియర్‌లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ సబ్జెక్టులకు, వొకేషనల్‌ కోర్సులకు ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తున్నారు. 


ఇంటర్ 'హాజరు' మినహాయింపు ఫీజు గడువు నవంబరు 18
తెలంగాణలోని జూనియర్‌ కాలేజీల్లో చదువకుండా హాజరు మిహాయింపు ద్వారా ఇంటర్‌ పరీక్షలు రాసే అవకాశాన్ని ఇంటర్‌బోర్డు కల్పించింది. విద్యార్థులు నేరుగా పరీక్ష ఫీజు చెల్లించి ఇంటర్ పరీక్షలకు హాజరుకావచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించి, అక్టోబరు 20 నుంచి నవంబర్‌ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.200 ఆలస్య రుసుముతో నవంబర్‌ 30 వరకు అవకాశం ఉంది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...