హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో రాష్ట్ర విద్యాశాఖ ప్రముఖ NGO సంస్థలతో MOU కుదుర్చుకుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధన సేవలను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర విద్యాశాఖ ఆ ఎన్జీవోలతో ఆదివారం నాడు ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన ఎడ్​ టెక్​  సదుపాయాలను అందించనుంది ప్రభుత్వం. 

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఆరు ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ఇది సాధ్యం కానుంది. ఇందుకు నందన్ నీలేకణి నేతృత్వంలోని ఎక్‌స్టెప్ ఫౌండేషన్, అలక్​ పాండే అధ్వర్యంలోని ఫిజిక్స్ వాలా, డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, సఫీనా హుస్సేన్​ అధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్, ఖాన్ అకాడమీ, షోయబ్​దార్​ నిర్వహిస్తున్న పైజామ్ పౌండేషన్ లాంటి పేరొందిన సంస్థలతో రాష్ట్ర విద్యాశాఖ MOU కుదుర్చుకుంది.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పేరొందిన సంస్థల భాగస్వామ్యంతో రాష్ట్ర విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో విద్యా నాణ్యత ప్రమాణాలను మెరుగుపరచాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలకు ఆకర్షితులై తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు వివిధ సంస్థలు ముందుకు వస్తున్నాయి.  

తెలుగు, ఇంగ్లిష్​ భాషలతో పాటు మ్యాథ్స్​ బేసిక్స్

నందన్ నీలేకణి నేతృత్వంలోని ఎక్‌స్టెప్ ఫౌండేషన్  కృత్రిమ మేథ (AI) ఆధారిత ప్లాట్‌ ఫారమ్‌తో 540 పాఠశాలలలో పని చేస్తుంది. ఇకపై 33 జిల్లాల పరిధిలో 5,000కి పైగా ప్రాథమిక పాఠశాలలకు విస్తరించనుంది. 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లిష్​ భాషలతో పాటు మ్యాథ్స్​ బేసిక్స్​ను ఈ సంస్థ అందిస్తుంది.  ఫిజిక్స్ వాలా ఇంటర్​ విద్యార్థులకు నీట్​, జేఈఈ (JEE), క్లాట్​ పరీక్షలకు సన్నద్ధులను చేస్తుంది. పాఠశాల స్థాయి నుంచే పోటీ పరీక్షల దృక్కోణంలో విద్యార్థులకు ఉచిత శిక్షణ అందిస్తుంది.

బాల సురక్ష, రక్షణ కార్యక్రమాలు

డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్  6వ తరగతి నుంచి క్లాస్​ 12 వరకు విద్యార్థులకు బాల సురక్ష, రక్షణ కార్యక్రమాలు  ప్రారంభిస్తుంది. ఖాన్ అకాడమీ  6వ తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు  పాఠ్యాంశాలకు అనుగుణంగా వీడియో ఆధారిత STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) శిక్షణను అందజేస్తుంది. పై జామ్ ఫౌండేషన్ ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు కోడింగ్ మరియు కంప్యూటేషనల్ థింకింగ్ పై శిక్షణను అందిస్తుంది. ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ రాష్ట్రంలో పాఠశాలలకు దూరంగా ఉన్న 16 వేలకు పైగా పిల్లలను తిరిగి బడిలో చేర్పించటంతో పాటు , బాలికల అక్షరాస్యత మరియు విద్యా అవకాశాలను మెరుగుపరుస్తుంది.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, సిఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్పెషల్ సెక్రటరీ హరిత, ప్రజ్వల ఫౌండేషన్ చీఫ్ డా.సునీతా కృష్ణన్, ఎక్‌స్టెప్ ఫౌండేషన్ సీఈవో జగదీష్ బాబు, ఫిజిక్స్ వాలా కో-ఫౌండర్ ప్రతీక్ మహేశ్వరి, పైజామ్ పౌండేషన్ ఫౌండర్ షోయబ్ దార్, ఖాన్ అకాడమీ ఇండియా ఎండీ స్వాతి వాసుదేవన్, ఎడ్యుకేట్ గర్ల్స్ సిఈవో గాయత్రి నాయిర్ లోబో, తదితరులు పాల్గొన్నారు.