తెలంగాణలో పదోతరగతి పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాల్లో మార్పులకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ప్రశ్నపత్రాల్లో మార్పులు చేసిన నేపథ్యంలో కొత్త మోడల్‌ పేపర్లను వెలువరించడానికి  విద్యాశాఖ సమాయత్తమవుతుంది. వీలైనంత త్వరగా వీటిని విడుదల చేయడానికి కసరత్తు ప్రారంభించింది. మోడల్ పేపర్లను మొదట ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చి, ఆ తర్వాత పాఠశాలలకు పంపాలని అధికారులు భావిస్తున్నారు. ప్రశ్నపత్రాల్లో వ్యాసరూప, షార్ట్‌ క్వశ్చన్స్‌ చాయిస్‌, మార్కుల్లో మార్పులతో కొత్త మోడల్ పేపర్లు ఉండనున్నాయి.


ఇటీవలే పదోతరగతి పరీక్షల్లో 11 పేపర్లను ఆరుకు తగ్గించిన విషయం తెలిసిందే. ఆ మేరకు 6 పేపర్లకు సంబంధించిన మోడల్ పేపర్లను, బ్లూప్రింట్‌ను విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. వ్యాస రూప, సూక్ష్మ రూప ప్రశ్నలు కఠినంగా ఉన్నాయంటూ విద్యార్థి, ఉపాధ్యాయ  సంఘాల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో టెన్త్‌ ప్రశ్నపత్రంలో మార్పులు తెచ్చారు. అదేవిధంగా పరీక్షకు  సంబంధించిన ప్రశ్నలు, సమాధానాలకు మార్కులను తెలియజేసే బ్లూ ప్రింట్‌ను కూడా విడుదల చేయాల్సి ఉంటుంది. ఎస్‌సీఈఆర్‌టీ ఈ ప్రక్రియను చేపట్టనుంది. 

ఉపాధ్యాయ సంఘాల నుంచి ఒత్తిడి.. 
రెండేళ్లపాటు కరోనా కారణంగా ప్రత్యక్ష తరగతులకు దూరమై...అభ్యసన సామర్థ్యాలు తగ్గాయని.. పరీక్షల విధానంలో మార్పులు చేయాలని..ఛాయిస్ పెంచాలని ఉపాధ్యాయ సంఘాల నుంచి ఒత్తిడి రావడంతో తాజాగా ఇంటర్నల్ ఛాయిస్‌ను తొలగించింది. ఆరు ప్రశ్నల్లో నాలుగింటికి సమాధానాలు రాయాలని పేర్కొంది. దీనివల్ల మిగిలిన రెండు సెక్షన్లలో ఒక్కో ప్రశ్నకు మార్కుల కేటాయింపు మారింది. ఈ మార్పు తెలుగు, ఆంగ్లం, హిందీ సబ్జెక్టులకు ఉండదు. మిగిలిన భాషేతర సబ్జెక్టులైన మ్యాథ్స్, సైన్స్, సోషల్‌ సబ్జెక్టులకు.. అదీ వచ్చే ఏప్రిల్‌లో జరిగే వార్షిక పరీక్షలతో పాటు 2023-24 విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మార్పులన్నీ 9వ తరగతికి కూడా వర్తించనున్నాయి.


డిసెంబరు 28న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వ్యాసరూప ప్రశ్నల సెక్షన్‌లో ఇంతకుముందు ఇంటర్నల్ ఛాయిస్ మాత్రమే ఉంది. ఇందులోభాగంగా, గతంలో వ్యాసరూప ప్రశ్నల విభాగంలో 12 ప్రశ్నలకు ఆరు ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉండేది. కానీ, ఇప్పుడు ప్రశ్నల సంఖ్యను ఆరుకు తగ్గించారు. ఇందులో ఏవేనీ నాలుగు ప్రశ్నలకు సమాధానం రాస్తే సరిపోతుంది. ఇదివరకు వ్యాసరూప ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు ఐదు మార్కులుండగా, ఇప్పుడు ఆరు మార్కులకు పెంచారు. ప్రశ్నల విభాగంలో గతంలో మాదిరిగానే ఇచ్చిన ఆరు ప్రశ్నలకూ సమాధానం రాయాలి. ఈ విభాగంలో గతంలో ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులుండగా ఇప్పుడు నాలుగు మార్కులకు పెంచారు. అతి స్వల్ప ప్రశ్నల విభాగంలో గతంలో మాదిరిగానే ఆరు ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు కలిపారు. ఆబ్జెక్టివ్‌ విభాగంలోనూ గతంలో మాదిరిగానే 20 ప్రశ్నలుంటాయి ఒక్కోదానికి ఒక మార్కు కేటాయించారు. 


త్వరలో పేపర్‌ రూపకల్పన..
జనవరి మొదటి వారంలోనే పదోతరగతి మాదిరి ప్రశ్నపత్రాల రూపకల్పన చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం వివిధ ప్రాంతాల నుంచి సబ్జెక్టు నిపుణులను రప్పించి, అత్యంత గోప్యంగా మొత్తం 12 సెట్ల ప్రశ్నపత్రాలను రూపొందిస్తారు. ఇందులోంచి మూడింటిని ఎంపిక చేస్తారు. అయితే పేపర్‌లో మార్పులు చేపట్టాల్సి ఉండటంతో ఈ ప్రక్రియ ఇంతవరకు చేపట్టలేదు. చాయిస్‌ పెంచడంతో పాటు వ్యాస రూప ప్రశ్నల సంఖ్యను కుదించడంతో ఈ మేరకు పేపర్ల రూపకల్పన చేపట్టనున్నారు.


ఫిబ్రవరి నాటికి ముద్రణకు..
పదోతరగతి పరీక్షలు ఏప్రిల్‌ 3 నుంచి ప్రారంభంకానున్నాయి. అయితే పరీక్షలకు ఎంపిక చేసే మూడు సెట్ల ప్రశ్నపత్రాలను ఫిబ్రవరి నెలాఖరునాటికి ప్రింటింగ్‌కు పంపాలని అధికారులు భావిస్తున్నారు. సంక్రాంతి తర్వాత ప్రశ్నపత్రాల రూపకల్పన చేపట్టి, ఫిబ్రవరి మొదటి వారం కల్లా ఒక్కో సబ్జెక్టులో 12 సెట్ల నుంచి మూడింటిని ఎంపిక చేస్తారు. వీటిని ఫిబ్రవరి నెలాఖరుకు ఎంపిక చేసిన ప్రింటింగ్‌ ప్రెస్‌కు పంపనున్నారు. మార్చి మొదటి వారం కల్లా పేపర్‌ ముద్రణ పూర్తి చేసే యోచనలో అధికారులు కసరత్తు చేస్తున్నారు.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..