TGEAPCET 2025 Notification Details: తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న టీజీ ఎప్సెట్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 20న విడుదల కానుంది. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమవుతుంది. ఎప్సెట్, పీజీఈసెట్, ఐసెట్ కమిటీల సభ్యులు ఫిబ్రవరి 3వ తేదీన జేఎన్టీయూహెచ్లో సమావేశాలు నిర్వహించారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య వి.బాలకిష్టారెడ్డి, విద్యామండలి ఉపాధ్యక్షులు పురుషోత్తం, ఎస్కే మహమూద్, కార్యదర్శి ఆచార్య శ్రీరాం వెంకటేశ్, కన్వీనర్ ఆచార్య బి.డీన్కుమార్, కోకన్వీనర్ ఆచార్య కె.విజయకుమార్రెడ్డి, జేఎన్టీయూహెచ్ ఇన్ఛార్జ్ వీసీ ఈ సమావేశంలో పాల్గొని దరఖాస్తుల షెడ్యూల్ను ఖరారు చేశారు.
'ఎప్సెట్, పీజీఈసెట్తో సహా అన్ని ప్రవేశ పరీక్షలు ముగిసిన తదనంతరం అధికారులు విడుదల చేసే ప్రాథమిక కీపై అభ్యంతరాలు తెలపడానికి ఒక్కో ప్రశ్నకు రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని నిర్ణయించారు. అభ్యంతరం సరైందని నిపుణుల కమిటీ భావిస్తే ఫలితాలు విడుదల చేసిన వారంలో డబ్బులు తిరిగిచ్చేస్తారు. జాతీయస్థాయి పరీక్షలైన జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్, నీట్ తదితర పరీక్షల్లో ఈ విధానం కొనసాగుతోంది.
ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన పీజీఈసెట్ కమిటీ సమావేశంలో సెట్ కన్వీనర్ ఏ.అరుణకుమారి, కోకన్వీనర్ బి.రవీంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఐసెట్ కమిటీ సమావేశంలో మహాత్మాగాంధీ వర్సిటీ ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్, కన్వీనర్ ఆచార్య అలువాల రవి తదితరులు పాల్గొని దరఖాస్తుల షెడ్యూల్ను నిర్ణయించారు.
అన్రిజర్వుడ్ కోటాపై తేలని నిర్ణయం..
రాష్ట్ర విభజన పూర్తయి పదేళ్లు దాటినందున ఆ కోటా విషయమై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు అన్రిజర్వుడ్ కోటా 15 శాతం సీట్లకు తెలంగాణతోపాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఎప్సెట్ నోటిఫికేషన్ విడుదల చేసే నాటికి ప్రభుత్వం నుంచి స్పష్టత రాకుంటే.. ప్రవేశాల నాటికి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తుది నిర్ణయం ఉంటుందని నోటిఫికేషన్లో పొందుపరచాలని కమిటీ నిర్ణయించింది.
దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్
దివ్యాంగులకు ఉన్నత విద్యా కోర్సుల్లో 5 శాతం రిజర్వేషన్ కేటాయించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఇప్పటివరకు దృష్టి లోపం, వినికిడి-మూగ, అంగ వైకల్యం అనే మూడు కేటగిరీలు (ఏ, బీ, సీ) ఉండగా.. 3 శాతం రిజర్వేషన్ ఉంది. కొత్తగా నాలుగో కేటగిరీ (డి)గా ఆటిజం లాంటి మానసిక వైకల్యం, అయిదో కేటగిరీ(ఇ)గా ఒకటికి మించి వైకల్యాలను చేర్చారు. ఒక్కో కేటగిరీకి ఒక శాతం చొప్పున రిజర్వేషన్ ఉంటుంది. వారి సామాజికవర్గాల మొత్తం రిజర్వేషన్లోనే వారికి సీట్లు కేటాయిస్తారు. ఉదాహరణకు ఆటిజం విద్యార్థి ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారైతే వారికి కేటాయించిన 15 శాతం రిజర్వేషన్లో సీటు కేటాయిస్తారు.
ALSO READ:
విదేశాల్లో పిల్లల్ని చదివించే వారికి బిగ్ రిలీఫ్ - టీసీఎస్ లిమిట్ రూ.10 లక్షలకు పెంపు
విద్యా ప్రయోజనాల కోసం చేసే చెల్లింపులపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2025లో కీలక మార్పు ప్రకటించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ లావాదేవీలపై బేసిక్ వద్ద వసూలు చేస్తోన్న పన్ను (టీసీఎస్) పరిమితిని పెంచుతున్నామన్నారు. ఇంతకుమునుపు ఈ పరిమితి రూ.7 లక్షలుగా ఉండేది. ఇప్పుడు ఈ పరిమితిని మరో రూ.3 లక్షలు పెంచుతూ బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ కీలక ప్రతిపాదన చేశారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..