APRGUKT Admissions 2024: ఆంధ్రప్రదేశ్‌ రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) ఆధ్వర్యంలో 2024-25 విద్యాసంవత్సరానికి ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు మే 6న నోటిఫికేషన్‌ వెలువడిన సంగతి తెలిసిందే. ప్రవేశాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 8న ప్రారంభమైంది. ప్రవేశాలు కోరువారు జూన్ 25న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఏపీ ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ఐఐఐటీ క్యాంపస్‌లలో ప్రవేశాలకు యేటా మూడు సార్లు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత కౌన్సెలింగ్‌కు పిలుస్తారు. అధికారిక వెబ్‌సైట్‌ నుంచి కాల్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆయా తేదీల్లో కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.


సీట్లు పొందిన విద్యార్ధులకు రెండేళ్ల పీయూసీ, నాలుగేళ్ల బీటెక్‌ కోర్సుతో కలిపి మొత్తం ఆరేళ్ల కోర్సులో ప్రవేశాలు పొందుతారు. రెండేళ్ల పీయూసీ కోర్సు తర్వాత విద్యార్థులకు బయటకు వెళ్లే వెసులుబాటు కల్పిస్తారు.  ప్రవేశాల్లో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు అదనంగా నాలుగు శాతం మార్కులు కేటాయిస్తారు. నాలుగు క్యాంపస్‌లలో కలిపి 4,400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 85 శాతం సీట్లు ఏపీ అభ్యర్థులకు, 15 శాతం సీట్లను ఓపెన్‌ మెరిట్‌ కింద ఏపీ, తెలంగాణ విద్యార్థులకు కేటాయిస్తారు. 


వివరాలు..


* ఏపీ ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు (RGUKT AP)-2024


ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్


క్యాంపస్‌లు: నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు.


సీట్ల సంఖ్య: 4,400.


వ్యవధి: 6 సంవత్సరాలు (పీయూసీ రెండేళ్లు, బీటెక్ నాలుగేళ్లు).


దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.200 చెల్లిస్తే సరిపోతుంది.


అర్హత: ఈ ఏడాది నిర్వహించిన పదోతరగతి లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఫలితాలు విడుదలయ్యాక జూన్ 31లోగా మార్కుల మెమోల స్కానింగ్ కాపీని ఈమెయిల్: admissions@rgukt.in ద్వారా పంపాల్సి ఉంటుంది. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ఆర్జీయూకేటీ గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదించిన ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి చదివిన విద్యార్థులకు 4 % డిప్రివేషన్‌ స్కోర్‌ను జోడించి మెరిట్‌ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. అభ్యర్థుల మెరిట్ ఆధారంగా కేటగిరీ ప్రకారం ప్రాధాన్యతా క్రమంలో క్యాంపస్‌లను కేటాయిస్తారు. ఒకసారి క్యాంపస్ నిర్ధారణ జరిగిన తర్వాత మార్చుకోవడానికి అవకాశం ఉండదు. విద్యార్థులు ప్రవేశం పొందిన క్యాంపస్‌లోనే విద్యనభ్యసించాల్సి ఉంటుంది.


ఒకవేళ ఇద్దరు విద్యార్థుల స్కోర్ సమానంగా ఉన్న పక్షంలో ప్రధానంగా 7 అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. వాటిలో మ్యాథమెటిక్స్, తర్వాత సైన్స్, ఇంగ్లిష్, సోషల్ స్టడీస్, ఫస్ట్ లాంగ్వేజ్‌లో సాధించిన గ్రేడ్‌ను పరిశీలించి సీట్లు కేటాయిస్తారు. అవీ సమానంగా ఉంటే పుట్టిన తేదీ ఆధారంగా ఎక్కువ వయసు ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. అది కూడా సమానంగా ఉంటే హాల్‌టికెట్ ర్యాండమ్ నంబరు విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. 


ట్యూషన్ ఫీజు: పీయూసీ కోర్సుకు రూ.45,000; బీటెక్‌ కోర్సుకు రూ.50,000 ఫీజుగా నిర్ణయించారు. ఏపీ విద్యార్థులు విద్యాదీవెన కింద ఫీజు రీయింబెర్స్‌మెంట్‌కు అర్హులు. అయితే విద్యార్థి కుటుంబవార్షిక ఆదాయం రూ.2.5 లక్షలలోపు ఉండాలి.  


ముఖ్యమైన తేదీలు..


* నోటిఫికేషన్ వెల్లడి: 06.05.2024.


* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.05.2024.


* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 25.06.2024. (5.00 P.M)


* స్పెషల్ కేటగిరీ (పీహెచ్/క్యాప్/ఎన్‌సీసీ/స్పోర్ట్స్/ స్కౌట్స్ & గైడ్స్) విద్యార్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు..


➥ క్యాప్ (CAP) కేటగిరీ: 01.07.2024 - 03.07.2024.


➥ స్పోర్ట్స్ కేటగిరీ: 03.07.2024 - 06.07.2024.


➥ పీహెచ్ కేటగిరీ: 03.07.2024.


➥ స్కౌట్స్ & గైడ్స్ కేటగిరీ: 02.07.2024 - 03.07.2024.


➥ ఎన్‌సీసీ కేటగిరీ: 03.07.2024 - 05.07.2024.


* ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి (అన్ని క్యాంపస్‌లలో): 11.07.2024.


* నూజివీడు క్యాంపస్‌లో ప్రవేశాలకు సర్టిఫికేట్ వెరిఫికేషన్: 22.07.2024 - 23.07.2024.


* ఆర్కేవ్యాలీ క్యాంపస్‌లో ప్రవేశాలకు సర్టిఫికేట్ వెరిఫికేషన్: 22.07.2024 - 23.07.2024.


* ఒంగోలు క్యాంపస్‌లో ప్రవేశాలకు సర్టిఫికేట్ వెరిఫికేషన్: 24.07.2024 - 25.07.2024.


* శ్రీకాకుళం క్యాంపస్‌లో ప్రవేశాలకు సర్టిఫికేట్ వెరిఫికేషన్: 26.07.2024 - 27.07.2024.


* సీట్లు పొందిన విద్యార్థులు రిపోర్టింగ్ తేదీ: తర్వాత వెల్లడిస్తారు.


Paper Notification


Prospectus & Detailed Notification


Online Application (AP, TS)


Online Application (Other than AP, TS/ NRI)


Website


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..