విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఇంజినీరింగ్‌ కాలేజీలపై తెలంగాణ అడ్మిషన్స్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) కొరడా ఝుళిపించింది. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసిన సుమారు 15 నుంచి 20 కాలేజీలకు జరిమానా విధించింది. అక్రమ పద్ధతుల్లో ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలకు ఒక్కో ఫిర్యాదుపై రూ.2 లక్షల చొప్పున జరిమానా విధించింది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల ప్రకారం ఫీజులు వసూలు చేయకుండా అధికంగా ఫీజులను కొన్ని కాలేజీలు వసూలు చేశాయని టీఏఎఫ్‌ఆర్‌సీకి ఇటీవల ఫిర్యాదులు అందాయి. దాదాపు 26 కాలేజీలపై ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. ఆయా కాలేజీలను విచారించిన కమిటీ సుమారు 15 నుంచి 20 కాలేజీలు అధిక ఫీజులకు పాల్పడినట్లు గుర్తించింది. 


గురునానక్‌ విద్యాసంస్థలోని రెండు కాలేజీలు, కేఎంఐటీకి చెందిన రెండు, మల్లారెడ్డి విద్యాసంస్థలకు చెందిన మూడు, శ్రీఇందు విద్యాసంస్థలకు చెందిన రెండు కాలేజీలకు జరిమానా విధిస్తూ నోటీసులు జారీచేసింది. ప్రభుత్వం ఖరారు చేసిన ఫీజులకు మించి వసూలు చేసే కాలేజీలపై కఠిన చర్యలు తప్పవని టీఏఎఫ్‌ఆర్‌సీ ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. అయినా పలు కాలేజీలు టీఏఎఫ్‌ఆర్‌సీ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేశాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న టీఏఎఫ్‌ఆర్‌సీ సంబంధిత కాలేజీలపై చర్యలకు ఉపక్రమించింది. కాగా, ఈ అంశంపై కాలేజీల యాజమాన్యాలు కోర్టుకెళ్లనున్నట్టు తెలిసింది.


విధించిన జరిమానాను కాలేజీలు త్వరలో కట్టనున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో బీటెక్‌, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల ఫీజులను ప్రభుత్వం ఖరారు చేస్తూ అక్టోబర్‌ 19న జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. టీఏఎఫ్‌ఆర్‌సీ ప్రతిపాదనలకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తూ ఫీజులను ఖరారు చేసింది. ఇంజినీరింగ్‌ కనిష్ట ఫీజు రూ.45, గరిష్ట ఫీజును రూ.1.60 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. ఒక్కో కాలేజీలో ఒక్కో ఫీజు ఉంది. అయితే కొన్ని కాలేజీలు తమ ఇష్టానుసారంగా ఫీజులను వసూలు చేశాయి. దీనిపై టీఏఎఫ్‌ఆర్‌సీకి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో కమిటీ చర్యలు చేపట్టింది. అయితే ఈ అంశంపై కాలేజీలు కోర్టుకెళ్లనున్నట్లు సమాచారం.


త్వరలో మరికొన్నింటిపై చర్యలు!
ప్రస్తుతం ఇరవైకి పైగా కాలేజీలకు టీఏఎఫ్‌ఆర్‌సీ జరిమానా విధించగా, త్వరలోనే మరికొన్నింటిపై చర్యలు తీసుకొనే అవకాశాలున్నట్టు తెలిసింది. మరికొన్ని ఫిర్యాదులు టీఏఎఫ్‌ఆర్‌సీ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. వాటిపై విచారణ జరిపి అధిక ఫీజులు వసూలు చేసినట్టు తేలితే వాటికి సైతం జరిమానా విధిస్తామని టీఏఎఫ్‌ఆర్‌సీ అధికారులు పేర్కొంటున్నారు.



Also Read:


హైద‌రాబాద్ విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌, ఇక ఈ బస్సుల్లోనూ కాలేజీకీ వెళ్లొచ్చు!
హైద‌రాబాద్ నగర విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త తెలిపింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో న‌డిచే అన్ని బ‌స్సుల్లో ప్రయాణించడానికి అనుమతి ఇచ్చింది. అంటే సిటీ బ‌స్సుల‌తోపాటు ప‌ల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ స‌ర్వీసుల్లోనూ విద్యార్థులు ప్రయాణం చేయవచ్చు. ఈ మేర‌కు ఈ విష‌యాన్ని ఆర్టీసీ ఎండీ స‌జ్జనార్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. విద్యార్థుల ర‌ద్దీ దృష్ట్యా టీఎస్ ఆర్టీసీ యాజ‌మాన్యం ఈ నిర్ణయం తీసుకుంద‌ని, స‌దుపాయాన్ని విద్యార్థులు వినియోగించుకోవాల‌ని ఆయన కోరారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సు, వివరాలివే!
ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫ్యాప్సి) ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంపై ఆన్‌లైన్‌ సర్టిఫికెట్ కోర్సును నిర్వహిస్తోంది. డిసెంబరు 1 నుంచి ఆన్‌లైన్‌ కోర్సులు ప్రారంభించనున్నారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ(ఫ్యాప్సీ) ఆధ్వర్యంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌‌పై 10 రోజులపాటు ఆన్‌లైన్‌ సర్టిఫికేట్‌ కోర్సును నిర్వహించనున్నారు.
కోర్సుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..