తెలంగాణ ఎంసెట్‌లో ఈసారి నుంచి ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీని శాశ్వతంగా రద్దు చేస్తూ విద్యాశాఖ బుధవారం (ఏప్రిల్‌ 19) ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ఎంసెట్‌లో వచ్చిన మార్కులతోనే ర్యాంకు కేటాయించనున్నారు. ఇప్పటివరకు ఎంసెట్‌ మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్‌లోని భాషేతర సబ్జెక్టులకు... అంటే 600 మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకు కేటాయించేవారు. ఇక నుంచి ఇంటర్‌ మార్కులతో సంబంధం లేకుండానే ఎంసెట్‌లో స్కోర్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. జేఈఈ మెయిన్, నీట్‌లలోనూ ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఎత్తివేశారు. 


ఎంసెట్‌కు పలు బోర్డుల నుంచి విద్యార్థులు హాజరవుతారు. ఆయా బోర్డులు సకాలంలో ఫలితాలను విడుదల చేయకపోవడం, ఎంసెట్‌ అధికారులకు అందజేయకపోవడం వల్ల ఎంసెట్‌ ఫలితాలకు ఆటంకం ఏర్పడుతోంది. ఇలాంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రతిపాదన మేరకు ఇంటర్‌ వెయిటేజీని రద్దు చేసింది. కరోనా కారణంగా 2020, 2021, 2022లలో కూడా ఇంటర్‌ వెయిటేజీని తొలగించారు. ఈసారి దానిని శాశ్వతంగా రద్దు చేస్తూ... గతంలోని జీఓను సవరిస్తూ తాజాగా విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీఓ నెం 18ను జారీ చేశారు.


టీఎస్ ఎంసెట్-2023 (తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2023) దరఖాస్తు ప్రక్రియ మార్చి 3న ప్రారంభమైంది. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్‌ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రూ.250 - రూ.5000 వరకు ఆలస్య రుసుముతో ఏప్రిల్ 15 నుంచి మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 


దరఖాస్తు ఫీజు ఇలా..
దరఖాస్తు ఫీజుగా  ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.500, మిగ‌తా కేట‌గిరిల అభ్యర్థులు రూ. 1000 చెల్లించి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఇంజినీరింగ్, మెడిక‌ల్ ప్రవేశ ప‌రీక్ష రాసే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.1000, మిగ‌తా కేట‌గిరిల అభ్యర్థులు రూ. 1800 చెల్లించాల్సి ఉంటుంది. 


ఈ ఏడాది మే 7 నుంచి 11 వరకు ఎంసెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. వీటిలో మే 7 నుంచి 9 వరకు ఇంజినీరింగ్‌ విభాగానికి; మే 10 నుంచి 11 వరకు అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాలకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజు రెండు సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 30 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.


ఎంసెట్‌ షెడ్యూల్‌ ఇలా..


➥ ఎంసెట్‌ నోటిఫికేషన్‌ వెల్లడి:  28.02.2023


➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.03.2023.


➥ దరఖాస్తుకు చివరితేదీ (అపరాధ రుసుము లేకుండా): 10.04.2023. 


➥ రూ.250 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 15.04.2023.


➥ రూ.1000 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 20.04.2023.


➥ రూ.2500 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 25.04.2023.


➥ రూ.5000 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 02.05.2023.


➥ దరఖాస్తు ఫీజు: రూ.1100, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.600


➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: 30.04.2023 నుంచి


➥ పరీక్ష తేదీలు:  మే 12 నుంచి 14 వరకు ఇంజినీరింగ్; మే 10, 11 తేదీల్లో ఫార్మసీ, అగ్రికల్చర్ పరీక్షలు.


టీఎస్ఎంసెట్ పూర్తి నోటిఫికేషన్, అర్హతల వివరాల కోసం క్లిక్ చేయండి..


Online Application


Website 


                                   


Also Read:


 ఏప్రిల్ 20 నుంచి 'సమ్మెటివ్‌-2' ఎగ్జామ్స్, పరీక్షల సమయాల్లో మార్పులు!
ఏపీలో ఏప్రిల్ 20 నుంచి సమ్మెటివ్ అసెస్‌మెంట్ పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా 'సమ్మెటివ్‌-2' పరీక్షల సమయాలను మార్పు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల  విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. మార్చిన సమయం ప్రకారం 1 - 8 తరగతులకు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, తొమ్మిదో తరగతికి ఉదయం 8 గంటల నుంచి 11.15 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల అనంతరం మధ్యాహ్న భోజనం పెట్టి, విద్యార్థులను పంపిస్తారు. పాఠశాల విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 20 నుంచి 29 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


సిల్వర్ సెట్‌-2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
కర్నూలులోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. 2023-24 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'సిల్వర్ సెట్-2023' పరీక్షకు ఏప్రిల్ 7న ఆన్‌‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. మే 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రవేశ పరీక్షను మే 25న నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇంటర్ ఉత్తీర్ణత కలిగిన విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు దరఖాస్తుకు అర్హులు.ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. ఎంపికైన విద్యార్థులకు విద్యా బోధనతో పాటు భోజనం, వసతి అందిస్తారు. ఏపీలో పాత 13 జిల్లాలతో పాటు తెలంగాణలో ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, హైదరాబాద్‌లో పరీక్ష నిర్వహించనున్నారు.
ప్రవేశ పరీక్ష పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..