NEET UG Result 2024 Hearing: దేశంలోని వైద్యకళాశాలల్లో మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్-యూజీ (NEET UG) పరీక్షలో ఇకపై గ్రేస్ మార్కులు ఉండబోవని దేశ అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) స్పష్టం చేసింది. అదేవిధంగా నీట్ కౌన్సెలింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని తెలిపింది. నీట్-యూజీ 2024 ఫలితాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో గురువారం(జూన్ 13న) విచారణ జరిగింది. ఈ సందర్భంగా.. నీట్ ఫలితాల్లో 1563 మందికి ఇచ్చిన గ్రేస్ మార్కులను రద్దుచేస్తామని, వారికి మళ్లీ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంటుందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. 


ఈ ఏడాది దేశవ్యాప్తంగా 557 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో 4,750 కేంద్రాల్లో నీట్ యూజీ-2024 ప్రవేశ పరీక్షను మే 5న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసారి పరీక్షకు రికార్డు స్థాయిలో మొత్తం 23.30 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్ష కేంద్రాల వద్ద సమయం కోల్పోయిన కారణంగా.. పరీక్ష రాసినవారిలో 1563 మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్ మార్కులు కేటాయించారు. గ్రేస్ మార్కుల కేటాయింపుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేగింది.


ఆ విద్యార్థులకు మళ్లీ పరీక్ష..
నీట్ ఫలితాల్లో అక్రమాలపై ఆరోపణలు రావడంతో.. స్పందించిన కేంద్రం వెంటనే నలుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని వేసింది. ఈ కమిటీ విచారణ జరిపి కేంద్రానికి నివేదిక సమర్పించింది. కమిటీ ఇచ్చిన నివేదికలోని నిర్ణయాలను కేంద్రం జూన్ 13న సుప్రీంకోర్టుకు వివరించింది. పరీక్ష సమయంలో కోల్పోయిన సమయానికి పరిహారంగా గ్రేస్ మార్కులు పొందిన ఆ 1563 మంది విద్యార్థుల స్కోర్ కార్డులను రద్దు చేస్తున్నట్లు కోర్టుకు వెల్లడించింది. ఆ విద్యార్థులకు మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపింది. జూన్ 23న పరీక్ష నిర్వహించి జూన్ 30లోగా ఫలితాలను ప్రకటిస్తామని సుప్రీంకోర్టులో కేంద్రం స్పష్టం చేసింది. ఆ విద్యార్థులకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు వెలువడిన తర్వాతే కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఒకవేళ మళ్లీ పరీక్ష రాయడం ఆసక్తిలేని విద్యార్థులు గ్రేస్ మార్కులు లేకుండా ఒరిజినల్ మార్కులతో కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చని కేంద్రం పేర్కొంది. 


కౌన్సెలింగ్‌పై స్టేకు సుప్రీం నిరాకరణ.. 
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై దాఖలైన పిటిషన్లపై జూన్ 13న విచారణ జరిపిన సుప్రీంకోర్టు వెబ్‌కౌన్సెలింగ్‌పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కౌన్సెలింగ్ యథాతథంగా ఉంటుందని స్పష్టం చేసింది . ఈ పిటిషన్లపై రెండు వారాల్లోగానే సమాధానం చెప్పాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)కి నోటీసులు జారీ చేసింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 6 నుంచి నీట్ కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. జూన్ 12న ఇదే అంశంపై ఢిల్లీ హైకోర్టులోనూ విచారణ జరిగింది. ఢిల్లీ హైకోర్టు కూడా కౌన్సెలింగ్‌పై స్టేను నిరాకరిస్తూ..తదుపరి విచారణనకు జులై 5కి వాయిదావేసిన సంగతి తెలిసిందే.


ఆరుగురు టాపర్ల వివాదమే కారణం..
ఈ ఏడాది మే 5న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ -2024 పరీక్షకు దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. నీట్ యూజీ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్ 4న వెల్లడించింది. ఫలితాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఏకంగా 67 మంది విద్యార్ధులు 720కి 720 మార్కులు సాధించారు. అందులోనూ హర్యానాలో ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు తొలి ర్యాంక్ రావడంతో అనుమానాలు తలెత్తాయి. ఒకేసారి ఒకే కేంద్రం నుంచి ఇంత మంది టాప్ ర్యాంకును పంచుకోవడం వెనుక గ్రేస్ మార్కులు కారణమని ఇటీవల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే ఫిజిక్స్ వాలా విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలఖ్ పాండే దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ విద్యార్థులకు ర్యాండమ్‌గా 70 నుంచి 80 మార్కులు కలిపారని పిటిషన్‌లో పేర్కొన్నారు. పాండే పిటిషన్‌తో పాటు మరో రెండు పిటిషన్లపై జూన్ 13న విచారణ సుప్రీంకోర్టు విచారణ జరిపింది. 


పేపర్‌ లీకైనట్లు కాదు - ఎన్టీఏ డీజీ
నీట్‌ యూజీ 2024 ప్రవేశ పరీక్షలో 63 అవకతవకలకు పాల్పడినట్లు తేలిందని ఎన్‌టీఏ డీజీ సుబోధ్‌ సింగ్‌ తెలిపారు. వారిలో 23 మందిని పరీక్ష సమయంలోనే డిబార్ చేశామన్నారు. మిగిలిన 40 మంది విద్యార్థుల ఫలితాలను హోల్డ్‌లో ఉంచామని ఆయన తెలిపారు. కేవలం కొంతమంది అవకతవకలకు పాల్పడినంత మాత్రానా పరీక్ష పేపర్‌ లీక్ అయినట్లు కాదని ఆయన స్పష్టంచేశారు. ఇలాంటి ఆరోపణల వల్ల నీట్‌ పరీక్ష విశ్వసనీయత ఏమాత్రం దెబ్బతినదని సుబోధ్‌సింగ్‌ అన్నారు.




మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..