NEET UG 2204 Paper Leak: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నీట్ యూజీ పేపర్ లీక్ (NEET Paper Leak) అంశంలో తవ్వేకొద్దీ విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. బిహార్ కేంద్రంగా పేపర్ లీకేజీ జరిగినట్లు సిట్ విచారణలో తేలినట్లు జాతీయమీడియాలో కథనాలు వస్తున్నాయి. నీట్ ప్రశ్నపత్రం లీకైనట్లు వదంతులు రాగా.. కేంద్రం, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(NTA) వాటిని తోసిపుచ్చింది. అయితే, నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలపై దర్యాప్తునకు బిహార్‌ (Bihar) ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేసింది. సిట్ చేపట్టిన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నీట్‌ పేపర్‌ లీక్‌ (NEET Paper) చేసినందుకు కొందరు అభ్యర్థులు రూ.30 లక్షల చొప్పున చెల్లించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.


నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి బిహార్‌లో ఇప్పటివరకు 14 మందిని సిట్ అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకున్నవారిలో బిహార్‌ ప్రభుత్వ విభాగంలో పనిచేసే ఓ జూనియర్‌ ఇంజినీర్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పేపర్‌ లీక్‌ గ్యాంగ్‌తో కలిసి అక్రమాలకు పాల్పడినట్లు, కొందరు నీట్ అభ్యర్థుల కుటుంబసభ్యులతోనూ టచ్‌లో ఉన్నట్లు.. ఆ జూనియర్‌ ఇంజినీర్‌ విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది.


మే 4న బిహార్‌లోని రామకృష్ణనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ పాఠశాలలో ఈ ముఠా నకిలీ పరీక్ష సెషన్‌ను నిర్వహించింది. ఇక్కడ సమాధానాలతో కూడిన నీట్ ప్రశ్నపత్రాలను అభ్యర్ధులకు పంపిణీ చేసింది. ఈ పేపర్‌ కోసం కొంతరు అభ్యర్థులు రూ.30 లక్షల నుంచి రూ.32 లక్షల వరకు ముడుపులు ఇచ్చారు. మొత్తం 35 మంది అభ్యర్ధులకు ఈ ప్రశ్నాపత్రాలు అందాయి. అనంతరం ఆ ప్రశ్నాపత్రాలను అదే పాఠశాలలో కాల్చివేసినట్లు విచారణలో వెల్లడైందని జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి. విచారణలో భాగంగా నీట్ పేపర్ లీక్ అయినట్లు భావిస్తోన్న పాఠశాల నుంచి కాలిపోయిన ప్రశ్నపత్రం అవశేషాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. 


మరో 9 మందికి నోటీసులు..
ఈ కేసుకు సంబంధించి విచారణ ముమ్మరంగా సాగుతోంది. మొత్తం 13 మంది నీట్‌ అభ్యర్థులు ఈ పేపర్‌ లీక్‌లో భాగస్వాములైనట్లు అధికారులు గుర్తించారు. ఇందులో నలుగురిని ఇప్పటికే అరెస్టు చేయగా.. మరో 9 మందికి తాజాగా నోటీసులు జారీ చేశారు. వీరు జూన్ 17, 18 తేదీల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. 


అన్ని వివాదాలే..
నీట్ పరీక్ష జరిగినప్పటి నుంచి అన్ని వివాదాలే కనిపిస్తున్నాయి. ఒకవైపు పేపర్ లీక్, మరోవైపు గ్రేస్ మార్కులు ఇవ్వడం, మరో కేంద్రంలో ఒక మీడియం బదులు మరో మీడియం ప్రశ్నపత్రం ఇవ్వడం ఇలా పరీక్ష రోజు నుంచి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. పేపర్ లీక్ వార్తలు కొట్టిపడేసిన కేంద్రం, ఎన్టీఏ.. వివాదం సుప్రీంకోర్టుకు చేరడంతో 1563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు రద్దు చేసింది. నీట్ ఫలితాల్లో అక్రమాలపై ఆరోపణలు రావడంతో.. స్పందించిన కేంద్రం వెంటనే నలుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని వేసింది. ఈ కమిటీ విచారణ జరిపి కేంద్రానికి నివేదిక సమర్పించింది. కమిటీ ఇచ్చిన నివేదికలోని నిర్ణయాలను కేంద్రం జూన్ 13న సుప్రీంకోర్టుకు వివరించింది. పరీక్ష సమయంలో కోల్పోయిన సమయానికి పరిహారంగా గ్రేస్ మార్కులు పొందిన ఆ 1563 మంది విద్యార్థుల స్కోర్ కార్డులను రద్దు చేస్తున్నట్లు కోర్టుకు వెల్లడించింది. 


నీట్ రద్దు కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్..
నీజీ యూజీ పరీక్షను రద్దు చేయాలని, పరీక్ష నిర్వహణలో చోటు చేసుకున్న అవకతవకలపై న్యాయస్థానం పర్యవేక్షణలో సీబీఐ లేదా ఇతర స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. నీట్ పరీక్ష రాసినవారిలో 20 మంది విద్యార్థులు ఈ పిటిషన్ వేశారు. ఇప్పటికే నీట్ పరీక్షలో అక్రమాలపై సుప్రీంకోర్టుతో పాటు.. వివిధ హైకోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. 


ఎన్‌ఎస్‌యూఐ ఆందోళన.. 
నీట్ అక్రమాల ఆరోపణల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్ నివాసంలోకి చొచ్చుకెళ్లేందుకు కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) సభ్యులు జూన్ 15న ప్రయత్నించారు. వీరిపై పోలీసులు సెక్షన్ 188 కింద కేసులు నమోదు చేశారు. నాలుగు కార్లలో ఆందోళనకారులు మంత్రి నివాసానికి చేరుకున్న ఆందోళనకారులు.. నివాసంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టినట్లు  ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.


ALSO READ: 'నీట్' పరీక్షలో ఆ విద్యార్థులకు గ్రేస్ మార్కులు రద్దు, వారికి మళ్లీ పరీక్ష - కౌన్సెలింగ్ నిలిపివేతకు సుప్రీం నిరాకరణ





మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..