నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నట్టు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) ప్రకటించింది. షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్‌ 1 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించాలి. అయితే, కొత్త కాలేజీలు, కోర్సుల ఏర్పాటు, సీట్ల పెంపుపై సెప్టెంబరు 15 నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు మరిన్ని సీట్లు అందుబాటులోకి వచ్చేలా కౌన్సెలింగ్‌ను వాయిదా వేయాలని మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ నిర్ణయించినట్టు ఎన్‌ఎంసీ తెలిపింది. ఈ ఏడాది మే 21న నీట్ పీజీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. 



దేశవ్యాప్తంగా 2022-23 సంవత్సరానికి పీజీ వైద్య విద్య ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియను సెప్టెంబరు 1 నుంచి నిర్వహించాల్సి ఉంది. ఈ మేరకు కౌన్సెలింగ్‌కు సంబంధించి ఆగస్టు నెలాఖరులోగా ప్రవేశ ప్రకటన వెల్లడించాలి. నీట్ పీజీ కౌన్సెలింగ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వైద్యకళాశాలల్లో 52 వేల పీజీ వైద్య విద్య సీట్లను భర్తీ చేస్తారు. ఈ సీట్ల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న కళాశాలలకు ఇప్పటికీ జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) సీట్లను ఇచ్చే ఉద్దేశంతో 'లెటర్ ఆఫ్ ఇంటెంట్' జారీచేస్తుంది. ఇచ్చిన తర్వాత మరోసారి ఎన్‌ఎంసీ నిపుణుల బృందం ఆయా కళాశాలలను పరిశీలించి, అవసరమైన పూచీకత్తులను స్వీకరించి, సీట్లకు పూర్తిస్థాయిలో అనుమతులిస్తుంది. కానీ సీట్ల పెంపుపై అస్పష్టత కారణంగా కౌన్సెలింగ్ వాయిదా వేశారు. 


ప్రవేశ ప్రక్రియ ప్రారంభించనున్న నేపథ్యంలో ఇలా లెటర్  ఆఫ్  ఇంటెంట్  ఇవ్వడం వల్ల ఆయా సీట్లను ప్రవేశాలకు పరిగణనలోకి తీసుకోవాలా? వద్దా? అనే సందిగ్ధత నెలకొంది. పైగా ఎన్ని సీట్లను కన్వీనర్  కోటా కింద లెక్కలోకి తీసుకుంటే.. అందులో సగం సీట్లను అఖిల భారత కోటాలో ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన వాటినే రాష్ట్ర స్థాయిలో భర్తీ చేసుకోవాలి. ఇంత సంక్లిష్టత నెలకొనడంతో తాజాగా డీజీహెచ్ఎస్ఈ అంశంపై స్పష్టతనిస్తూ అన్ని రాష్ట్రాలకూ లేఖ రాసింది.

ప్రవేశ ప్రకటన వెలువరించడానికి ముందు ఎన్ని సీట్లకు అనుమతి లభిస్తుందో... ఆ సీట్లను మాత్రమే ప్రవేశాలకు పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టీకరించింది. లెటర్  ఆఫ్  ఇంటెంట్  ఇచ్చిన సీట్లను ప్రవేశాల జాబితాలో పొందుపరచవద్దని తెలిపింది. దీంతో ఇప్పటివరకూ అనుమతి ఉన్న పీజీ సీట్లకే ప్రవేశ ప్రకటన వెలువరించనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు తెలిపాయి.

తెలంగాణ  రాష్ట్రంలో 2070 పీజీ వైద్యవిద్య సీట్లుండగా రెండు వైద్య కళాశాలల నుంచి గతేడాది ప్రవేశాలు పొందిన 130 పీజీ సీట్లను రద్దు చేస్తూ ఎన్ ఎంసీ నిర్ణయం తీసుకుంది. వీటిని ఇంకా సర్దుబాటు చేయలేదు. 2022-23 సంవత్సరానికి ఎలాగూ వీటికి అనుమతి లభించదు. దీంతో ఆ మేరకు సీట్లను కోల్పోయినట్లయింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 200కి పైగా పీజీ సీట్లు ఈ ఏడాది కొత్తగా వచ్చే అవకాశాలున్నాయని వైద్యవర్గాలు తెలిపాయి. ఇంకా అనుమతి లేఖలు రాకపోవడంతో తొలివిడత ప్రవేశాలనాటికి వాటిని పరిగణనలోకి తీసుకునే అవకాశాల్లేవు. తగ్గిన సీట్లతోనే ఈసారి పీజీ వైద్యవిద్య ప్రవేశ ప్రకటన వెలువరించే అవకాశాలున్నాయని కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి.



ఒకవేళ తొలివిడత ప్రవేశ ప్రకటన తర్వాత గనుక అనుమతి వస్తే అప్పుడు కొత్తగా వచ్చిన పీజీ సీట్లను తరువాత విడత కౌన్సెలింగ్ లకు లెక్కలోకి తీసుకుంటామని వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతానికి లెటర్  ఆఫ్  ఇంటెంట్  ఇచ్చిన సీట్లకు అనుమతి ఇవ్వడానికి ముందు ఇంకా ఏమైనాలోపాలను సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటే.. ఆయా కళాశాలల నుంచి పూచీకత్తు స్వీకరిస్తారని, ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఇదే విషయంలో సర్కారు పూచీకత్తుగా వ్యవహరిస్తుందని వైద్యవర్గాలు వివరించాయి.


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..