ఎంబీబీఎస్ పూర్తి చేసిన అభ్యర్థులు ఏడాదిపాటు తప్పనిసరి ఇంటర్న్‌షిప్ చేసేందుకు ప్రస్తుతమున్న 2023 మార్చి 31 కటాఫ్ తేదీ గడువును కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ జూన్ 30 వరకు పొడిగించింది. ఈ మేరకు త్వరలో ప్రకటన వెలువడనున్నట్లు అధికార వర్గాలు జనవరి 12న వెల్లడించాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ), విద్యార్థి సంఘాలు, భావి అభ్యర్థులు, పలు రాష్ట్రాల అధికారుల అభ్యర్థన మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ నిర్ణయం తీసుకొంది. ఇంటర్న్‌షిప్ కటాఫ్ గడువు పొడిగించడంతో.. ఈ ఏడాది మార్చి 5న ఉంటుందని ప్రకటించిన నీట్ పీజీ ప్రవేశ పరీక్షను సైతం వాయిదా వేయాలనే డిమాండు విద్యార్థులు, వారి కుటుంబాల నుంచి రావచ్చని అధికారులు భావిస్తున్నారు.


నీట్ పీజీ ఇంటర్న్‌షిప్ కటాఫ్ తేదీపై అభ్యంతరం.. 
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ నీట్-పీజీ పరీక్షల షెడ్యూల్‌ను ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్(ఫోర్డా) ఈ షెడ్యూల్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇంటర్న్‌షిప్ పూర్తి చేయడానికి మార్చి 31 కటాఫ్ తేదీగా నిర్ణయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇలా చేయడం వల్ల చాలా మంది విద్యార్థులు నష్టపోతారని, ప్రస్తుత బ్యాచ్‌లో సగం కంటే ఎక్కువ మంది విద్యార్థులు అర్హత సాధించడం చాలా కష్టమని ఫోర్డా అభిప్రాయపడింది.


నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ప్రకారం.. నీట్ పీజీ పరీక్ష 2023 మార్చి 5న జరగనుంది. ఫలితాలు మార్చి 31న వెల్లడి కానున్నాయి. అయితే, ఇంటర్న్‌షిప్ పూర్తి చేయడానికి మార్చి 31 కటాఫ్ తేదీగా నిర్ణయించడాన్ని వైద్యులు వ్యతిరేకించారు. ఈ విషయంపై ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఓ ట్వీట్ చేసింది. ‘50% కంటే ఎక్కువ మంది ఇంటర్న్‌లు అర్హత సాధించలేకపోవచ్చు. దీంతో వారి కెరీర్‌ ప్రమాదంలో పడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటర్న్‌షిప్ కటాఫ్ తేదీని మే వరకు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే చివరి నిమిషంలో విద్యార్థులు గందరగోళానికి గురికావచ్చు. ఈ సమస్యను తక్షణం పరిష్కరించాల్సిన అవసరం ఉంది’ అని ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ పేర్కొంది. 


Also Read:


గురుకుల ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తు ప్రారంభం!
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, హైదరాబాద్ 2023-24 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 38 టీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్- సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మార్చి-2023లో పదోతరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. స్క్రీనింగ్ టెస్ట్, మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు ఐఐటీ, నీట్ తదితర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణ ఇస్తారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 31 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తుచేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి..


జేఈఈ మెయిన్ దరఖాస్తుల సవరణకు అవకాశం, ఎప్పటివరకంటే?
జేఈఈ మెయిన్ 2023 సెషన్‌-1 దరఖాస్తుల సవరణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అవకాశం కల్పించింది. అభ్యర్థులు జనవరి 13 నుంచి 14 వరకు వివరాల్లో తప్పులుంటే సరిచేసుకోవచ్చు. దరఖాస్తు సవరణకు జనవరి 14న రాత్రి 11.50 గంటల వరకు అవకాశం కల్పించారు. జేఈఈ మెయిన్ సెషన్-1 దరఖాస్తు సమయంలో వివరాలు తప్పుగా నమోదుచేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...