KNRUHS MBBS/BDS Provisional Merit List: తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా ప్రవేశాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థుల నుంచి ప్రొవిజినల్ మెరిట్ జాబితాను వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ (KNRUHS) సెప్టెంబరు 24న విడుదల చేసింది. జాబితాలో మొత్తం 16,679 విద్యార్థులతోపాటు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కౌన్సెలింగ్‌కు అర్హత సాధించిన అభ్యర్థులు ఉన్నారు. కోర్టును ఆశ్రయించిన 8 మంది విద్యార్థులు కౌన్సెలింగ్‌కు అర్హత సాధించలేదు. వీరితోపాటు వివిధ కారణాల వల్ల కౌన్సెలింగ్‌కు అర్హత సాధించలేకపోయిన విద్యార్థుల జాబితాను వర్సిటీ విడుదల చేసింది. మెరిట్ జాబితాపై అభ్యంతరాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించింది. 


బుధవారం (సెప్టెంబరు 25) సాయంత్రం 5 గంటలల్లోగా విద్యార్థులు అభ్యంతరాలు తెలిపాల్సి ఉంటుంది. విద్యార్థులు అవసరమైన డాక్యుమెంట్లతో అభ్యంతరాలను యూనివర్సిటీకి మెయిల్‌ (knrugadmission@gmail.com) ద్వారా పంపించాలి. అభ్యంతరాల పరిశీలన తర్వాత గురువారం (సెప్టెంబరు 26) తుది మెరిట్ జాబితాలను హెల్త్ వర్సిటీ విడుదల చేయనుంది. విద్యార్థులు సెప్టెంబరు 26 నుంచే వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెబ్ఆప్షన్ల నమోదు చేసుకోవచ్చు. గతేడాది కళాశాలల వారీగా సీట్ల కేటాయింపు వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ఇప్పటికే అందుబాటులో ఉంచారు. దీని ఆధారంగా వెబ్ ఆప్షన్ల కోసం ముందే కాలేజీల జాబితాను సిద్ధం చేసుకుంటే, ఆప్షన్ల నమోదు ప్రక్రియ సులభమవుతుందని హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.


Provisional Merit List of applied candidates


List of Not Eligible candidates


WEBSITE


అసలు ఏమైందంటే? 
రాష్ట్రంలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నిబంధనలల్లో తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేసిన చేసిన సంగతి తెలిసిందే. నిబంధనల్లో రూల్‌ ‘3 ఏ’ను చేరుస్తూ ప్రభుత్వం జీవో 33ను జారీ చేసింది. నీట్‌ ప్రవేశ పరీక్ష రాసే సమయానికి విద్యార్థి వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానికుడిగా పరిగణించాలంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో పేర్కొంది. వైద్యారోగ్యశాఖ జారీ చేసిన జీవోను పలువురు విద్యార్థులు సవాల్‌ చేశారు. హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలుచేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. 


మెడికల్ ప్రవేశాల్లో స్థానికతపై హైకోర్టు కీలక ఆదేశాలు..
తెలంగాణలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి స్థానికత అంశంపై రాష్ట్ర హైకోర్టు సెప్టెంబరు 5న కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. స్థానికులంతా స్థానిక కోటా కింద అర్హులేనని సీజే జస్టిస్‌ అలోక్‌ అరాధే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టంచేసింది. స్థానికులు ఎవరనే అంశంపై సరైన మార్గనిర్దేశకాలు లేవని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు స్థానికత నిర్ధారణకు సరైన మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ప్రవేశాలు కల్పించాలని సూచించింది. కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని స్పష్టం చేసింది.  


రాష్ట్రంలో 2014కు ముందు ఏర్పాటైన అన్ని మెడికల్ కాలేజీల్లో 15 శాతం అన్‌రిజర్వ్‌డ్‌ కోటా సీట్లకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు పోటీపడేవారు. అయితే 2024 జూన్ 2 నాటికి రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయింది. దీంతో కన్వీనర్‌ కోటా సీట్లన్నీ స్థానిక విద్యార్థులతోనే భర్తీ చేయనున్నారు. అయితే ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ అడ్మిషన్లలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నిబంధనలతో తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కోర్టులో నమోదైన పిటిషన్లపై సెప్టెంబరు 5న తీర్పు వెలువడింది. దీనికి అనుగుణంగా తాజాగా కొత్త మెరిట్ జాబితాను హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసింది.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...