తెలంగాణ ఎప్‌సెట్ (TS EAPCET) - 2024 పరీక్ష హాల్‌టికెట్లను జేఎన్‌టీయూ హైదరాబాద్ ఏప్రిల్ 29న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే కేవలం అగ్రిక‌ల్చర్, ఫార్మసీ కోర్సులకు సంబంధించిన ప‌రీక్షల హాల్‌టికెట్లను మాత్రమే విడుదల చేసింది. అయితే ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించిన పరీక్షల హాల్‌టికెట్లను మే 1న విడుదల చేయనున్నారు. ఈ ఏడాది ఎప్‌సెట్‌ ప్రవేశ పరీక్షకు దాదాపు 3.5 ల‌క్షలకు పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అగ్రిక‌ల్చర్ అండ్ ఫార్మా విభాగానికి లక్షకుపైగా ద‌ర‌ఖాస్తులు రాగా.. ఇంజినీరింగ్ విభాగానికి 2.5 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగానికి; మే 7, 8 తేదీల్లో అగ్రిక‌ల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి ప‌రీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు మొదటి సెషన్‌లో, మ‌ధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించ‌నున్నారు. తెలంగాణలో హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేయనున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరులోని కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. 


TS EAPCET 2024 అగ్రికల్చర్ & ఫార్మసీ పరీక్షల హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి.. 


మే 1 వరకు దరఖాస్తుకు అవకాశం..
తెలంగాణ ఎప్‌సెట్ దరఖాస్తు గడువు ఇప్పటికే ముగిసిన సంగతి తెలిసిందే. అయితే రూ.5000 ఆల‌స్య రుసుముతో మే 1 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికీ దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇక ఇదే చివరి అవకాశం.


ఇంటర్ (ఎంపీసీ/ బైపీసీ)లో ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరి. అగ్రికల్చర్ సంబంధిత కోర్సులకు సంబంధించి డిప్లొమా చివరిసంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వయసు 31.12.2024 నాటికి ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సులకు 16 సంవత్సరాలలోపు ఉండాలి. అగ్రికల్చర్ సంబంధిత కోర్సులకు 17 - 22 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 3 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.


ఇంజినీరింగ్ (లేదా) అగ్రికల్చర్ & ఫార్మా పరీక్షల్లో ఏదో ఒకదానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.900 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. ఇక రెండు విభాగాలకు (ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మా) దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.1800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది.


దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..


పరీక్ష విధానం..
మొత్తం 160 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్/ బయాలజీ నుంచి 80 ప్రశ్నలు- 80 మార్కులు, ఫిజిక్స్ నుంచి 40 ప్రశ్నలు-40 మార్కులు, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు-40 మార్కులు. ప్రతిప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉండవు. ఇంటర్ మొదటి సంవత్సరం, చివరి సంవత్సరం నుంచి 100 శాతం సిలబస్‌తో పరీక్ష నిర్వహించనున్నారు. ఇంగ్లిష్‌, తెలుగు, ఉర్దూ మూడు భాషల్లో ఎప్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఉర్దూ మీడియం వారికి చివరి రోజు అయిన మే 12న పరీక్ష ఉంటుందని, వీరికి ఉర్దూ/ఇంగ్లిష్‌ భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..