జేఎన్‌టీయూ-హైదరాబాద్ విద్యార్థులకు ఊరటనిచ్చే వార్త వినిపించింది. విద్యార్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైన నేపథ్యంలో ఈ ఏడాది క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ విధానాన్ని అమలు చేయడం లేదని, వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని జేఎన్టీయూ అధికారులు ప్రకటించారు. బీటెక్, బీఫార్మసీ విద్యార్థులను వచ్చే ఏడాదికి ప్రమోట్ చేయడానికి క్రెడిట్ ప్రమాణాలను సడలించింది. 2021-22 విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తించే సడలింపు తర్వాత, విద్యార్థులు తదుపరి సంవత్సరానికి ప్రమోట్ కావడానికి 25 శాతం క్రెడిట్‌లు మాత్రమే అవసరం అవుతాయి.



Also Read:  'నీట్‌' పీజీ కటాఫ్‌ మార్కులు తగ్గించిన కేంద్రం, కొత్త కటాఫ్ ఇదే!

కరోనాతో రెండేళ్లుగా క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ విధానాన్ని యూనివర్సిటీ రద్దు చేసింది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ ఏడాది నుంచి క్రెడిట్‌ ఆధారిత డిటెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించినట్లు అక్టోబరు మొదటివారంలో జేఎన్‌టీయూ అధికారులు ప్రకటించారు. దీని ప్రకారం నిర్దేశిత క్రెడిట్స్‌ సాధించకపోతే విద్యార్థులు మరుసటి సంవత్సరానికి ప్రమోట్‌ అయ్యేందుకు వీలుండదని రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో యూనివర్సిటీ నిర్ణయంపై మడ్డిపడ్డ విద్యార్థులు ఆందోళనకు దిగారు. క్రెడిట్ బేస్ డిటెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనకు దిగొచ్చిన యూనివర్సిటీ అధికారులు డిటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. 

Read Also:  విద్యార్థులకు అలర్ట్, పాత విధానంలోనే జేఎన్‌టీయూ పరీక్షలు

జేఎన్టీయూ అధికారులకు గవర్నర్ అభినందనలు 
క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ సడలించినందుకు జేఎన్టీయూ అధికారులకు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అభినందనలు తెలిపారు. అక్టోబర్ 15వ తేదీన భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ట్విట్టర్ స్పేస్ ద్వారా విద్యార్థులు... యువతతో గవర్నర్ సంభాషించారు. ఈ సందర్భంగా JNTU విద్యార్థులు క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ విధానం వల్ల తమకు జరుగుతున్న నష్టాన్ని గవర్నర్ కు వివరించారు. సమస్యను పరిష్కరిస్తామని విద్యార్థులకు గవర్నర్ హామీ ఇచ్చారు. గవర్నర్ విజ్ఞప్తి మేరకు క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ విధానాన్ని సడలిస్తున్నట్టు  JNTU అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై అధికారులకు అభినందనలు తెలిపారు.

Read Also:  నేషనల్‌ లా యూనివర్సిటీ ప్రవేశాలకు నోటిఫికేషన్!

అసలు ఏంటీ క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ విధానం..? 
జేఎన్‌టీయూ పరిధిలోని కళాశాలల్లో ఇంజినీరింగ్‌లో చేరిన విద్యార్థులు ప్రతిఏటా నిర్దేశిత క్రెడిట్స్ సాధించాల్సి ఉంటుంది. అలాగే 75 శాతం  హాజరు ఉంటేనే సెమిస్టర్ పరీక్షలు రాసేందుకు అనుమతిస్తారు. కరోనాతో రెండేళ్లు హాజరుతో పాటు క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ విధానాన్ని యూనివర్సిటీ రద్దు చేసింది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆ విధానాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విధానం ప్రకారం ఇంజినీరింగ్ విద్యార్థులు మొదటి ఏడాది నుంచి రెండో ఏడాదిలోకి వెళ్లాలంటే 18 క్రెడిట్స్, రెండో ఏడాది నుంచి మూడో ఏడాదిలోకి వెళ్లాలంటే 47 క్రెడిట్స్, 3 నుంచి నాలుగో ఏడాదిలోకి వెళ్లాలంటే 73 క్రెడిట్స్ సాధించాల్సి ఉంటుంది. ఇక లేటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశాలు పొందిన విద్యా్ర్థులు రెండో ఏడాది నుంచి మూడో ఏడాదిలోకి వెళ్లాలంటే 25 క్రెడిట్స్, 3 నుంచి నాలుగో ఏడాదిలోకి వెళ్లాలంటే 51 క్రెడిట్స్ ఉండాలి. ఒకవేళ విద్యార్థులు నిర్దేశిత క్రెడిట్స్ సాధించలేకపోతే మరుసటి ఏడాదిలోకి ప్రవేశించే వీలుండదు. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..