దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం సాయంత్రం ఈ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఏడాది ఫలితాల్లో మన తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచి టాప్ లేపారు. 

ముగ్గురు తెలుగు విద్యార్థులకు 100 పర్సంటైల్

ఈ ఏడాది జేఈఈ మెయిన్ పేపర్‌-1 ఫలితాల్లో దేశవ్యాప్తంగా మొత్తం 12 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ స్కోరు సాధించగా అందులో ముగ్గురు తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మహిత్‌, మోహిత్ అనే విద్యార్థులు, తెలంగాణ నుంచి వివాన్‌ మహిశ్వరి వందకు వంద పర్సంటైల్‌ సాధించారు. 

ఈ ఏడాది జేఈఈ మెయిన్ పరీక్షకు 13,55,293 మంది రిజిస్టర్ చేసుకోగా 13,04,653 మంది పరీక్ష రాశారు. ఈ పరీక్షను జనవరి 21,22, 23, 24, 28, తేదీల్లో నిర్వహించారు. 

స్కోర్ కార్డ్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. మీ స్కోర్ కార్డు పొందడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. 

  • 1. ముందుగా జేఈఈ మెయిన్ అధికారిక రిజల్ట్స్‌ లింక్‌ ఓపెన్ చేయాలి. 
  • 2. అక్కడ అప్లికేషన్ నెంబర్‌, పాస్‌వర్డ్‌ ఎంటర్ చేయాలి. 
  • 3. క్యాప్చా కోడ్‌ సరిగా టైప్ చేసి సబ్‌మీట్ చేయాలి. 
  • 4. మీ స్కోర్ కార్డ్‌ స్క్రీన‌ మీద కనిపిస్తుంది. దానిని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవడం మంచిది. 

స్కోర్‌కార్డ్‌లో ఏముంటుంది?

  1. • మొత్తం మీద పర్సంటైల్ స్కోరు
  2. • సబ్జెక్ట్ వారీగా పర్సంటైల్ (భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, గణితం)
  3. • ఆల్ ఇండియా ర్యాంక్ (AIR)
  4. • క్వాలిఫైంగ్‌ స్టాటస్‌ (JEE అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారా లేదా అని)

మంచి మార్కులు వచ్చిన విద్యార్థులు ఏం చేయాలి?

  • అర్హత సాధించిన విద్యార్థులు JEE అడ్వాన్స్‌డ్ 2026కి దరఖాస్తు చేసుకోగలరు.
  • సెషన్ 2కి హాజరయ్యే విద్యార్థులకు ఇది మొదటి అవకాశం. రెండు సెషన్ల నుంచి మెరుగైన స్కోర్‌ను తుది మెరిట్ జాబితాకు పరిగణనలోకి తీసుకుంటారు.
  • విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి మాత్రమే సమాచారాన్ని పొందాలని, పుకార్లను నివారించాలని సూచించారు.

మంచి పర్సంటైల్ రాని వారు ఏం చేయాలి? 

ఫలితాల విడుదలకు ముందే ఎన్టీఏ అధికారులు సోమవారం ఉదయం ఫైనల్‌ ఆన్సర్‌ కీ విడుదల చేశారు. ఈ ఫైనల్‌ కీలో ఒక కీలక మార్పు జరిగింది. మొత్తం 9 ప్రశ్నలను డ్రాప్‌ చేశారు. అంటే ఈ ప్రశ్నలకు మార్కుల కేటాయింపులో ఎన్టీఏ నిబంధనల ప్రకారం మార్పులు ఉంటాయి. ఒక వేళ మొదటి విడతలో వచ్చిన స్కోరుతో మీరు సంతృప్తి చెందకపోతే బాధపడాల్సిన అవసరం లేదు. జేఈఈ మెయన్ రెండో విడత పరీక్షలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోంది. మొదటి విడత, రెండో విడత ఈ రెండింటిలో మీకు ఏ పరీక్షలో ఎక్కువ స్కోరు వస్తే దానినే ర్యాంకు కేటాయింపునకు పరిగణలోకి తీసుకుంటారు. రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు జరుగుతాయి.