దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాలకోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ (JEE Advanced) ఫలితాలు సెప్టెంబరు 11న విడుదల కానున్నాయి. సెప్టెంబరు 11న ఉదయం 10 గంటలకు ఐఐటీ బాంబే ఫలితాలను ప్రకటించనుంది. దీంతోపాటు మెరిట్‌ జాబితాను కూడా విడుదల చేయనుంది. పరీక్ష రాసిన విద్యార్థులు వెబ్‌సైట్‌ ద్వారా మెరిట్‌ జాబితాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. సీట్ల సంఖ్యకు రెండున్నర రెట్ల మంది ఉత్తీర్ణులయ్యేలా కటాఫ్‌ మార్కులు నిర్ణయిస్తారు. సెప్టెంబర్‌ 12 నుంచి ప్రవేశాలకు సంబంధించిన జోసా కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనిద్వారా దేశంలోని 23 ఐఐటీల్లో బీటెక్ సీట్లు కేటాయించనున్నారు.




ఫలితాల కోసం వెబ్‌సైట్: www.jeeadv.ac.in       


ఆగస్టు 28న దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను నిర్వహించారు. ఉదయం పేపర్–1, మధ్యాహ్నం పేపర్–2 పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షకు జేఈఈ మెయిన్‌‌లో అర్హత సాధించిన 2.50 లక్షల మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 1.56 లక్షల మంది హాజరయ్యారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 30 వేల మంది విద్యార్థులు ఉన్నారు. రాష్ట్రంలో 30 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఐఐటీ బాంబే జేఈఈ అడ్వాన్స్ డ్–2022 నిర్వహించింది.



Also Read:
సీయూఈటీ యూజీ ఫలితాలు వచ్చేస్తున్నాయ్, ఎప్పుడంటే?


జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 పరీక్ష ఆన్సర్ 'కీ'ని ఐఐటీ బాంబే సెప్టెంబరు 3న విడుదల చేసింది. విద్యార్థుల సౌలభ్యం కోసం పరీక్ష ప్రశ్నపత్రాలను కూడా వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఆన్సర్ కీపై సెప్టెంబరు 5న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించింది. ఫలితాలతోపాటు ఫైనల్ ఆన్సర్ కీ, మెరిట్ జాబితాను కూడా ఐఐటీ బాండే విడుదల చేయనుంది. ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ) అక్టోబర్ 18న నిర్వహిస్తారు. వీటి ఫలితాలను అక్టోబర్ 22న విడుదల చేస్తారు.

12 నుంచి కౌన్సెలింగ్..


దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్దేశించిన జోసా(జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ) షెడ్యూలును ఐఐటీ బాంబే ప్రకటించింది. షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 12 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. అయితే సెప్టెంబరు 20 వరకు అభ్యర్థులకు మాక్‌ కౌన్సెలింగ్‌ అందుబాటులో ఉంటుంది. దానివల్ల తమ ర్యాంకు ఆధారంగా ఎక్కడ సీటు వస్తుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. సెప్టెంబరు 21 నుంచి అసలు ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించింది. మొత్తం 6 రౌండ్ల కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐఐటీ బాంబే విడుదల చేసింది.


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం 6 రౌండ్ల కౌన్సెలింగ్ తర్వాత ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర సంస్థల్లో సీట్లు ఖాళీగా ఉంటే అక్టోబరు 16 నుంచి 21 వరకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. మరోవైపు సీట్ల భర్తీ నియమ నిబంధనలను కూడా ప్రకటించింది. సీట్లు పొందిన జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు రూ.40,000; ఇతరులు రూ.20,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈసారి మొత్తం 114 విద్యాసంస్థలు కౌన్సెలింగ్‌లో పాల్గొననున్నాయి. అందులో 23 ఐఐటీలు, 31 ఎన్‌ఐటీలు, 26 ట్రిపుల్‌ఐటీలు, మరో 33 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి.

Also Read: JoSAA 2022 Schedule: 'జోసా' కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!



JoSAA కౌన్సెలింగ్ ఇలా..


♦ 1వ రౌండ్‌ : సెప్టెంబరు 23 నుంచి 27 వరకు
♦ 2వ రౌండ్‌: సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 1 వరకు
♦ 3వ రౌండ్‌: అక్టోబరు 3 నుంచి 7 వరకు
♦ 4వ రౌండ్‌: అక్టోబరు 8 నుంచి 11 వరకు
♦ 5వ రౌండ్‌: అక్టోబరు 12 నుంచి 15 వరకు
♦ 6వ రౌండ్‌ (చివరి): అక్టోబరు 16 నుంచి 17 వరకు నిర్వహిస్తారు. 
6 రౌండ్ల సీట్ల కేటాయింపు తేదీలు ఇవే:
♦ 1వ రౌండ్‌ సీట్ల కేటాయింపు: సెప్టెంబరు 23న
♦ 2వ రౌండ్‌: సెప్టెంబరు 28వ తేదీ
♦ 3వ రౌండ్‌: అక్టోబరు 3
♦ 4వ రౌండ్‌: 8వ తేదీ
♦ 5వ రౌండ్‌: 12వ తేదీ
♦ 6వ రౌండ్‌ (చివరి): అక్టోబరు 16న


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..